Sircilla | సిరిసిల్ల రూరల్, జూన్ 4: రాజన్న సిరిసిల్ల జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్పోస్టులో విధులను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎస్పీ మహేశ్ బి గీతే సూచించారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో జిల్లా సరిహద్దులోని తంగళ్లపల్లి మండలంలోని జిల్లెళ్ల చెక్పోస్టును ఆయన బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోవుల అక్రమ రవాణా అరికట్టడానికి ఏర్పాటుచేసిన చెక్పోస్టులో నిర్వహించే వాహనాల ఎంట్రీ రికార్డును పరిశీలించారు. చెక్పోస్టులోని సిబ్బంది పలు సూచనలు చేశారు.
అనంతరం జిల్లా ఎస్పీ మహేశ్ బి. గీతే మాట్లాడుతూ.. బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. గోవుల అక్రమ రవాణా, గోవధ నివారించేందుకు జిల్లా సరిహద్దుల (జిల్లెళ్ల, పెద్దమ్మ, మానాల క్రాస్ రాడ్) వద్ద చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేశామన్నారు.చెక్ పోస్ట్ ల వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, తనిఖీల్లో సరైన పత్రాలు ఉన్న రైతులకు సంబంధించిన లేదా వ్యవసాయనికి సంబంధించిన పశువుల రవాణాకు ఆటంకం కలిగించకుండా సిబ్బంది విధులు నిర్వహించాలని తెలియజేశారు. చెక్పోస్టు వద్ద ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ఇతర డిపార్ట్మెంట్ సిబ్బంది, జిల్లా పోలీస్ యంత్రాంగామంతా సమన్వయంతో విధులు నిర్వహిస్తున్నామని తెలిపారు.