Sircilla | సిరిసిల్ల రూరల్ : నాడు అన్నల కోటగా పేరున్న గండిలచ్చపేటలో నేడు దళిత బంధు వెలుగులు నింపుతున్నది. స్వరాష్ట్రంలో మంత్రి కేటీఆర్ సారథ్యంలో గ్రామం ప్రగతి పథంలో పయనిస్తున్నది. తాజాగా దళితబంధుతో 33 కుటుంబాలకు భరోసా కలుగగా, నాడు దళ సభ్యులుగా ఉన్న వారు నేడు వ్యాపారులుగా మారడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
నాడు నక్సల్స్ ప్రాబల్య ప్రాంతమైన తంగళ్లపల్లి మండలం మారుమూల గ్రామం గండిలచ్చపేట నిత్యం అలజడితో ఉండేది. చుట్టూ గుట్టలు, మానేరు వాగు ఒడ్డున పచ్చని పొలాల నడుమ ఈ గ్రామం ఉన్నది. గండిలచ్చపేటను నాడు అన్నల కోటగా చెప్పుకునేవారు. గ్రామస్తులు ఎప్పుడూ భయం భయంగా గడిపే పరిస్థితులు నిత్యంగా కనిపించేవి. ఉమ్మడి రాష్ట్రంలో గ్రామాన్ని పట్టించుకోకపోవడంతో అభివృద్ధికి నోచుకోలేదు. స్వరాష్ట్రంలో మంత్రికేటీఆర్ సారథ్యంలో గ్రామం సమగ్రాభివృద్ధిలో పయనిస్తున్నది. గ్రామస్తులు మరింత చైతన్యవంతులుగా మారారు. సంపూర్ణ అక్షరాసత్య, ఇంటింటా మరుగుదొడ్డి నిర్మించుకుని ఆదర్శంగా నిలిచారు.
వంద శాతం పన్నుల చెల్లింపులు జరుగుతున్నాయి. మంత్రి కేటీఆర్ సహకారంతో గ్రామంలో ప్రతి వీధిలో సీసీ రోడ్డు, గ్రామానికి వచ్చే రోడ్లన్నీ బీటీ రోడ్లుగా మారాయి. హరితహారంలో భాగంగా రోడ్డుకిరువైపులా మొక్కలు నాటడంతో అవి పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ గ్రామం ముందుకు సాగుతున్నది. ఇక్కడ ప్రజల జీవన ప్రమాణాలు సమూలంగా మారడం విశేషం. గతంలో గ్రామానికి చెందిన బల్లెపు సిద్దన్న, దేవుని నర్సయ్య, ఉప్పలయ్య, దళ నాయకులుగా, మల్యాల లచ్చయ్య, పడిగె దేవయ్య, చిన్నన్న దళ సభ్యులుగా, జ్యోతి మిలిటెంటుగా పనిచేశారు. ఇందులో పడిగె దేవయ్య పోత్గల్ గ్రామ శివారులో జరిగిన ఎన్కౌంటర్లో మరణించగా, చిన్నన్న, జ్యోతి ఆజ్ఞాతంలోకి వెళ్లారు. 2002 వరకు పనిచేసి అందరూ జనజీవన స్రవంతిలో కలిశారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సారథ్యంలో గ్రామం ప్రశాంతంగా ఉండటంతోపాటు ప్రగతి బాటలో పయనిస్తుండడం విశేషం.
దళిత బంధుతో వెలుగులు..
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దళితుల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన దళితబంధు పథకం గ్రామంలోని 33 మంది కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నది. మొదటి విడుతలో సిరిసిల్ల నియోజవర్గానికి 100 యూనిట్లు కేటాయించగా, తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేటను ఎంపిక చేశారు. గ్రామంలోని 33 మంది కుటుంబాలను దళితబంధు పథకంలో చేర్చారు. వీరిలో కొందరు పౌల్ట్రీ ఫాం, పాల డెయిరీ, ట్రాక్టర్లు, కాంక్రీట్ మిషన్, ఫొటో స్టూడియో, మినీ సూపర్ మార్కెట్, తదితర స్యయం ఉపాధి యూనిట్లను ఏర్పాటు చేసుకున్నారు.
మణెమ్మ..మిల్లర్ ఓనరైంది..!
గండిలచ్చపేటకు చెందిన మల్యాల మణెమ్మ ఇప్పుడు మిల్లర్ యూనిట్కు ఓనరైంది. భర్త రాజయ్యతో కలిసి వ్యవసాయ కూలీ, భవన నిర్మాణ కూలీ పనులకు వెళ్లేది. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు వీరి జీవితాన్ని మార్చింది. భర్తతో కలిసి మిల్లర్ యూనిట్ పెట్టి భవన నిర్మాణంతోపాటు కాంక్రీట్ పనులకు యూనిట్ నిర్వహిస్తున్నారు. సొంతంగా యూనిట్ పెట్టుకోవడం సంతోషంగా ఉందని, సీఎం కేసీఆర్ దయతోనే మిల్లర్ యూనిట్ పెట్టుకున్నామంటున్నారు. ఇద్దరు మగ పిల్లలను చక్కగా చదివిస్తానని, తమకు పదిలక్షలిచ్చి ఇల్లు నిలబెట్టిన ముఖ్యమంత్రి సల్లంగ ఉండాలని కృతజ్ఞతలు చెబుతున్నారు.
నాడు దళ సభ్యుడు.. నేడు మినీ సూపర్ మార్కెట్ ఓనర్..!
తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేటకు చెందిన ఇతని పేరు మల్యాల లచ్చయ్య. మాజీ దళ సభ్యుడిగా పని చేసిన లచ్చయ్య నేడు మినీ సూపర్ మార్కెట్ ఓనరయ్యాడు. నాడు అన్నలతో కలిసి పనిచేసిన ఆయన, ఇప్పుడు దళితబంధుతో స్వయం ఉపాధి పొందుతున్నాడు. వ్యవసాయ కూలీగా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్న లచ్చయ్య దళితబంధు స్కీం ద్వారా వచ్చిన రూ.10 లక్షలతో సిరిసిల్లలో మినీ సూపర్మార్కెట్ ఏర్పాటు చేసుకున్నాడు. సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన ఈ పథకం తన జీవితం మార్చిందని, ఇప్పుడు సగర్వంగా ఆత్మగౌరవంతో జీవిస్తున్నానని చెబుతున్నాడు. అంతే కాదు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు రుణపడి ఉంటానని కృతజ్ఞతలు చెబుతున్నాడు. దళితబంధు గొప్పదని, దళితుల అభ్యున్నతికి ఎంతో దోహదపడుతున్నదని అంటున్నాడు.
దళిత బంధు.. కొండంత భరోసా
దళితబంధు మాకు కొండంత భరోసా. మాది వ్యవసాయ కుంటుంబం. నేను బీకాం వరకు చదివిన. చెన్నైలో ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసిన. నాకు భార్య, ఇద్దరు పిల్లలు. నాన్న దుర్గయ్యతో కలిసి ఉంటాం. దళితబంధు స్కీం పెట్టడంతో గ్రామంలోనే పౌల్ట్రీఫాం పెట్టుకుందామని నిర్ణయించుకున్న. పెట్టుబడి ఎక్కువవుతుందని తెలిసి నాన్న, మేం కలిసి వేర్వేరుగా దళిత బంధు స్కీంలో దరఖాస్తు చేసుకున్నం. ఇద్దరికి దళితబంధు మంజూరైంది. గ్రామ శివారులోని మాకు ఉన్న వ్యవసాయ భూమిలో ఇద్దరం కలిసి పౌల్ట్రీఫాం పెట్టుకున్నాం. రూ.20 లక్షలతో యూనిట్ ఏర్పాటు చేసుకున్నాం. 6 వేల సామర్థ్యం గల బాయిలర్ పౌల్ట్రిఫాం పెట్టుకున్నాం. మా కుటుంబమంతా పనిచేస్తుంది. ఒకరి కింద పనిచేయడం, వలస పోవడం తప్పింది. చాలా సంతోషంగా ఉంది. మంత్రి కేటీఆర్ సార్ చేతుల మీదుగా ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది.
– చెదల సుమన్, గండిలచ్చపేట
అన్నల కంచుకోటగా నిలిచింది
పీపుల్స్ వార్ నుంచి మావోయిస్టులవరకు గండిలచ్చపేట కంచుకోటగా నిలిచింది. గ్రామస్తులందరికి కమ్యూనిస్టు భావజాలం ఎక్కువ. గ్రామంలో దళనాయకులతోపాటు దళసభ్యులు, మిలిటెంట్లుగా పనిచేసిన్రు. తెలంగాణ ఉద్యమంలోనూ పాలుపంచుకున్నం. నక్సల్ ఎజెండా టీఆర్ఎస్దే అన్న కేసీఆర్ పిలుపు మేరకు మద్దతు తెలిపినం. కేటీఆర్ సారథ్యంలో గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నం. ప్రభుత్వ పథకాలను వినియోగించుకుంటూ ముందుకు సాగుతున్నం. గ్రామంలో 33 మంది దళితులకు దళితబంధు రావడం సంతోషం. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సార్లకు కృతజ్ఞతలు.
– బల్లెపు సిద్ధన్న, మాజీ దళ నాయకుడు, బీఆర్ఎస్ నేత, గండిలచ్చపేట