వాతావరణ అనుకూల పరిస్థితులతో అన్నదాతల్లో ఆనందం
ధాన్యం విక్రయాలకు సన్నద్ధం
హుజూరాబాద్, ఏప్రిల్ 2 : డివిజన్లో వరి కోతలు ప్రారంభమయ్యాయి. గతేడాది పంట చేతికి వచ్చే సమయంలో మబ్బులు పట్టి ఆందోళనకు గురి చేయగా, ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేకపోవడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన వరి ధాన్యాన్ని విక్రయాలకు సిద్ధం చేస్తున్నారు.
మండలంలోని ఇప్పలనర్సింగాపూర్, కందుగుల తదితర గ్రామాల్లో ముందుగానే నాట్లు వేయడంతో కోతలు.. దానికనుగుణంగానే హార్వెస్టింగ్ ప్రారంభమైంది. సన్నరకం పంటలు కొంచెం ఆలస్యంగా కోతకు రాగా… దొడ్డు రకం వరి రకం కోతలు ఇప్పటికే మొదలయ్యాయి. మరో వారం రోజుల్లో కోతలు ఉధృతం కానున్నాయి.
డివిజన్లో 71,200 ఎకరాల్లో వరి సాగు
హుజూరాబాద్ డివిజన్లో 1,20,650 ఎకరాల సాగు భూమి విస్తీర్ణం ఉండగా… వానకాలంలో 71,200 ఎకరాల్లో రైతులు వరి సాగు చేయగా, ఈ యాసంగిలో 74,336 ఎకరాల్లో పంటలు వేశారు. ఇందులో హుజూరాబాద్ మండలంలో అత్యధికంగా 23,857 ఎకరాలు, అత్యల్పంగా ఇల్లందకుంటలో 9,322 ఎకరాలు, వీణవంకలో 15,489 ఎకరాలు, సైదాపూర్లో 13,553, జమ్మికుంటలో 12,115 ఎకరాల్లో వరిసాగైనట్లు వ్యవసాయాధికారులు తెలిపారు. మొత్తం సాగు విస్తీర్ణంలో 41 వేల ఎకరాల్లో సన్నరకాలైన బీపీటీ, జైశ్రీరాం, సాంబమసూరి తదితర పంటలతో పాటు, సీడ్ ఉంటుందని వ్యవసాయాధికారులు పేర్కొన్నారు.
త్వరలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
ధాన్యం విక్రయాలకు రైతులకు ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం గతంలో మాదిరిగానే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే మండలానికి 10 చొప్పున కేంద్రాలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండగా… మరిన్ని తెరిచేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దళారులను నమ్మి మోసపోవద్దని , కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని అధికారులు రైతులకు సూచించారు.
ఇవి కూడా చూడండి..
పాకిస్తాన్లో కరోనా టీకాలు దొంగతనం
కోటిన్నర కరోనా వ్యాక్సిన్ డోసులు వృథా