రాజన్న సిరిసిల్ల : సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. మంగళవారం సిరిసిల్ల పట్టణంలోని 26వ వార్డులో ఆయన ఇంటింటా తిరుగుతూ ఆకస్మిక తనిఖీలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి మంగళవారం, శుక్రవారం జిల్లాలో డ్రైడే పాటిస్తున్నామని చెప్పారు.
ఇందులో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో ఇంటి ఆవరణ నిలువ ఉన్న నీటిని తొలగించి అవగాహన కల్పిస్తున్నారు. ప్రజలు కూడా ఇంటి ఆవరణ ఎలాంటి నీటి నిలువలు లేకుండా చూసుకోవాలని కలెక్టర్ సూచించారు. నీటి నిలువల ద్వారా దోమలు తయారై జ్వరాల బారిన పడే అవకాశం ఉంటుందన్నారు.
ఆయన వెంట మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి, కమిషనర్ శ్యాం సుందర్ రావు, మేనేజర్ సంపత్ రెడ్డి, కౌన్సిలర్ గూడూరి లక్ష్మి , సానిటరీ ఇన్స్పెక్టర్ నగేశ్, అంగన్వాడీ టీచర్ కే జ్యోతి, ఆశ వర్కర్ వైష్ణవి, నాయకులు రామతీర్థపు రాజు, గూడూరు మధు తదితరులు ఉన్నారు.