siricilla | సిరిసిల్ల రూరల్, మే 7: అభం శుభం తెలియని ఆ చిన్నారికి తండ్రి చనిపోయాడు అన్న విషయం తెలియక ఆ చిన్నారి చేతులతో నాన్న ముఖంపై చేయి వేసి నాన్న.. లే.. నాన్న.. అన్న మూగ సైగలు అక్కడ ఉన్న వారిని సైతం కలిసి వేసిన సంఘటన తంగళ్ళపల్లి మండలం మండేపల్లి కేసీఆర్ నగర్లో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. వరంగల్ కు చెందిన తాడూరి రామ్ కుమార్ (38) 14 సంవత్సరాల క్రితం వేములవాడ పట్టణానికి చెందిన అనితను కులాంతర వివాహం చేసుకున్నాడు.
అప్పటినుండి పెద్దలకు దూరంగా ఉంటూ సిరిసిల్లలో జిరాక్స్ మెషిన్ మెకానిక్ గా పని చేస్తూ, తన తమ్ముడితో వివాహ ఈవెంట్లను చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ తరుణంలో ముగ్గురు కొడుకులు సుఖజిత్ 11, శ్రీవాస్తవ్ 5, విహన్ 1 పుట్టారని, ఆ సమయంలో వైద్య ఖర్చులకోసం కాస్త అప్పు అయిందని ఆమె తెలిపింది. సిరిసిల్ల పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా కొంతకాలం పని చేశానని, కరోనా రావడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తయని ఆమె పేర్కొంది. చేసిన రూ.మూడు లక్షల అప్పు తీర్చేది ఎలా.. ఎంత పని చేసినా డబ్బులు రావడం లేదని ఇలాగైతే అప్పులు ఎలా తీర్చేది అంటూ మనస్థాపానికి గురయ్యాడు.
గత రెండు రోజుల క్రితం వివాహ ఈవెంట్ ఉందని వరంగల్ కు వెళ్తున్న అని చెప్పి వెళ్లి తిరిగి బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగి వచ్చాడని ఆమె తెలిపింది. మధ్యాహ్నం సమయంలో పెద్ద కొడుకు సుఖజీతో బట్టలు సర్దుకో నాని మనం ఊరికి వెళ్దాం అంటూ చెబుతూ… ఇద్దరి తమ్ముళ్లను బాగా చూసుకోమని చెప్పినట్లు పెద్ద కొడుకు తెలిపాడు. ఇంతలో గదిలోకి వెళ్లి డోర్ వేసుకున్నాడని, కాసేపటి తర్వాత ఎంత పిలిచినా.. డోర్ తీయకపోవడంతో పక్కింటి వారి సహాయంతో డోర్ ను పగలగొట్టి చూడగా తన భర్త విగత జీవిగా ఉరివేసుకొని కనిపించాడని భార్య రోధిస్తూ తెలిపింది.
అభం శుభం తెలియని చిన్న కుమారుడు విహాన్ తన తండ్రి చనిపోయాడు అన్న విషయం కూడా తెలియని ఆ పసిబాబు తండ్రిని తట్టి లేపుతున్న సంఘటన పలువురిని కంటతడి పెట్టించింది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని పరిశీలించి మృతుడి భార్య అనిత ఫిర్యాదు ఇన్చార్జి ఎస్సై వినీత రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.