ఇల్లంతకుంట, ఫిబ్రవరి 21: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భార్య కాపురానికి రావడం లేదని ఓవ్యక్తి బలన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతారంలో సోమవారం జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతారం గ్రామానికి చెందిన చొప్పరి లక్ష్మణ్ (34)కు పదహారేండ్ల కిందట అదే మండలంలోని కందికట్కూర్కు చెందిన రేణుకతో వివాహం జరిగింది. లక్ష్మణ్ అప్పులు చేసి సొంతూరిలో ఇంటి నిర్మాణం చేపట్టాడు.
అప్పులు తీర్చేందుకు గత్యంతరంలేని పరిస్థితుల్లో ఇల్లును అమ్మాలని నిర్ణయించి భార్యకు చెప్పాడు. ఇది ఇష్టంలేని భార్య ఏడాది కిందట తల్లిగారింటికి వెళ్లిపోయింది. ఆదివారం లక్ష్మణ్ అత్తగారింటికి వెళ్లి రావాలని కోరగా నిరాకరించింది.
దీంతో మనస్తాపానికి గురైన లక్ష్మణ్ అత్తగారింటి వద్ద పురుగుల మందు తాగాడు. స్థానికులు, అత్తగారింటివారు చికిత్స కోసం సిరిసిల్ల ఏరియా దవాఖానకు తరలించారు. చికిత్సపొందుతూ సోమవారం మరణించాడు. మృతుడి తల్లి దేవవ్వ ఫిర్యాదు మేరకు ఎస్ఐ మహేందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.