రాజన్న సిరిసిల్ల : నాటిన ప్రతి మొక్క ఎదిగేలా బాధ్యత తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులను ఆదేశించారు. బుధవారం వీర్నపల్లి మండలంలోని అడవిపదిర గ్రామాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. గ్రామంలోని అవెన్యూ ప్లాంటేషన్ ను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
అవెన్యూ ప్లాంటేషన్ పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్ నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని అన్నారు. ఎల్లారెడ్డి పేటలో 80 శాతం హరితహారం మొక్కలు నాటే లక్ష్యం పూర్తయిందని అధికారులు చెప్పారని, మిగతా 20 శాతం మొక్కలను సెప్టెంబర్ 15వ తేదీలోగా పూర్తి చేయాలన్నారు. ఆ వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
తెలంగాణ క్రీడా ప్రగతి ప్రాంగణా ఏర్పాటును నాన్ ఏజెన్సీ ఏరియాలో మొదట పూర్తి చేయాలన్నారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ అడవి పదిర గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు.
వంటగది, మరుగుదొడ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని తెలుపగా.. వాటి పురోగతిని జిల్లా కలెక్టర్ జిల్లా విద్యాధికారి డాక్టర్ ధనాలకోట రాధా కిషన్ తో కలిసి పరిశీలించారు. సాధ్యమైనంత త్వరగా నిర్మాణాలను పూర్తి చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులను, అధికారులకు సూచించారు.