వీర్నపల్లి , జూలై 18: వీర్నపల్లి (Veernapally) మండలంలోని అడవిపదిర గ్రామానికి రాకపోకలు బంద్ అయ్యాయి. రోడ్డం వాగుపై రూ.2.50 కోట్లతో నూతన వంతెన నిర్మాణానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అనంతరం కాంట్రాక్ట్ దక్కించుకున్న గుత్తేదారు పనులు మొదలు పెట్టి పిల్లర్ల వరకు పూర్తి చేశారు. వంతెన పక్కన ఓ రైతుకు చెందిన వ్యవసాయ పొలం నుంచి తాత్కాలికంగా మట్టి రోడ్డు వేశారు. అయితే చేసిన పనులకు బిల్లులు రాలేదని గుత్తేదారు పనులు నిలిపివేశాడు.
పనులు ముందుకు సాగపోవడంతో రైతు వ్యవసాయం చేయడానికి ఇబ్బందులు పడుతున్నాడు. సదరు రైతు గత నెల 19న జేసీబీతో మట్టిని తవ్వించి రోడ్డును మూసివేశాడు. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రధాన రహదారి నుంచి గ్రామానికి వెల్లడానికి రోడ్డు లేకపోవడంతో నెల రోజులుగా గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. లాల్ సింగ్ తండా నుంచి అదనంగా మూడు కిలోమీటర్ల దూరం తిరిగి రావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి గ్రామానికి రోడ్డు పునరుద్ధరించాలని కోరుతున్నారు.