Kondoori Ravindar Rao | సిరిసిల్ల టౌన్, మే 21: కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల నుండి వస్తున్న వ్యతిరేకతను డైవర్షన్ చేసేందుకే కేసీఆర్ ను బదనాం చేసే దిశగా కుట్రలు చేస్తున్నారని నాఫాస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు అన్నారు. రాష్ట్రంలో కమిషన్ల పాలన నడుస్తున్నదని, కాంగ్రెస్ సొంత పార్టీ నాయకులు, మంత్రులే స్వయంగా చెప్తున్నారని పేర్కొన్నారు. సిరిసిల్లలోని ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
పాలన సాధ్యం కానీ దయనీయ స్థితిలో ఉన్న ప్రభుత్వం అన్ని వర్గాల నుండి వస్తున్న వ్యతిరేకత నుండి తప్పించుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపిందని చెప్పారు. ఇందులో బాగంగానే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు గత ఇరిగేషనాశాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు, ఆర్థికశాఖ మంత్రిగా పని చేసిన ఈటెల రాజేందర్ కు నోటీసులు ఇచ్చిందని మండిపడ్డారు.
గోష్ కమిషన్ రెండు రోజుల క్రితమే కేసీఆర్, హరీష్ రావు ఇతరులను ఎవరినీ విచారణ జరపాల్సిన పరిస్థితి లేదని, రిపోర్టు ఇస్తారని చెప్పిన ఒక్క రోజులోనే ఓ దినపత్రిక విచారణ చేయకుండానే కేసీఆర్, హరీష్ రావును దోషులుగా ఎలా చూపెట్టగలరని రాసిన వెంటనే ప్రభుత్వం జీవో తీసి నోటీసులు ఇవ్వడాన్ని ప్రజలు గమనించాల్సిన అవసరం ఉందన్నారు. మీడియా ఆధారంగా దోషులుగా చిత్రీకరించాలనే ఉద్దేశంతోనే నోటీసులు జారీ అయినట్లు బావిస్తున్నామన్నారు. 17 నెలల పాలనలో ఏ ఒక్క హామీని అమలుచేయకుండా కమిషన్ల పంపిణీపై ప్రభుత్వ పాలన నడుస్తుందని ఆరోపించారు.
కాంట్రాక్టర్లు కమిషన్లు ఇవ్వలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇటీవల స్వయానా ఓ మంత్రి అందరు మంత్రులు డబ్బులు తీసుకుంటున్నారని చెప్పిన విషయం ద్వారానే ప్రభుత్వ పనితీరు అర్ధమవుతుందన్నారు. సాధించుకున్న రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలపడమే లక్ష్యంగా కేసీఆర్ పని చేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణను సస్యశ్యామలం చేశారని కొనియాడారు. కేసీఆర్ ను కేవలం దోషిగా చూపాలన్న దురుద్దేశంతోనే ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎండిన చెరువులు, పంటలే కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయంపై తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు. కోర్టు తీర్పును తాము గౌరవిస్తామన్నారు.
రాజకీయ కక్షలో భాగంగానే నోటీసులు
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య మాట్లాడుతూ రాజకీయ కక్షలో భాగంగానే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. అడగోలు హామీలతో నేర చరిత్ర కలిగిన రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. గత ఏడాది 2024-25 విద్యాసంవత్సరంలో విద్యార్థులకు ఒక్క రూపాయి ఇవ్వలేదని, వృద్ధులు, వితంతువులు ఫించన్ల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. హామీల అమలు నుండి ప్రజల దృష్టిని మరల్చే విధంగా కమిషన్ పేరు మీద కేసీఆర్ కు నోటీసులు పంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
కేసీఆర్ తెలంగాణను సాధించినందునే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడని గుర్తుంచుకోవాలన్నారు. లేకోపోతే ఆంధ్రోళ్ల సంచులు మోసుకుంటూ ఉండేవాడన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు పంప్ హౌస్లు, అప్పర్మానేరు, మల్లన్నసాగర్, కొండపోచమ్మ, రంగనాయకసాగర్ ప్రాజెక్టులు అన్నీ కేసీఆర్ నిర్మించారని తెలిపారు. మేడిగడ్డ ప్రాజెక్టులో ఒక్క పిల్లర్ కుంగినంత మాత్రాన మొత్తం నిర్మాణమే లోపభూయిష్టంగా ఉందంటూ అడ్డమైన కమిషన్ వేసి కేసీఆర్ను బదనాం చేసే నీచ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా ప్రజలకు కష్టాలు వస్తాయని నానుడి ఉందన్నారు.
ప్రభుత్వం వేసిన కమిషన్ నుండి కేసీఆర్ కడిగిన ముత్యంలా బయటికి వస్తారని ధీమా వ్యక్తం చేశారు. రాబోవు రోజుల్లో కాంగ్రెస్ అరాచక పాలనను ప్రజలు తిరస్కరిస్తారని చెప్పారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, తంగళ్లపల్లి బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గజభీంకార్ రాజన్న, మాజీ కౌన్సిలర్ గుండ్లపల్లి పూర్ణచందర్, సెస్ మాజీ డైరెక్టర్ కుంబాల మల్లారెడ్డి, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.