ఎల్లారెడ్డిపేట, ఆగస్టు 10: రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరం ఉంటుందని కొత్తగా చేర్చేందుకు, ఉన్న కార్డులోంచి పేరు తొలగించేందుకు ఆడిషన్, డిలీట్ ఆప్షన్లు ఉన్నాయని కలెక్టర్ సందీప్కుమార్ ఝా తెలిపారు. ఆదివారం సిరిసిల్లా జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని సాయిమణికంఠ ఫంక్షన్హాల్లో లబ్ధిదారులకు రేషన్ కార్డులను అందించి మాట్లాడారు. ప్రతి సంక్షేమ పథకానికి రేషన్కార్డు ప్రామాణికమైనందున అందరికి రేషన్ కార్డులు అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు.
పేదలకు ఇచ్చే సన్న బియ్యం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం విధానంలో వన్ నేషన్, వన్ రేషన్ కార్డుతో పేదలు తమకున్న రేషన్ కార్డుతో దేశంలో ఎక్కడైనా రేషన్ బియ్యం తీసుకునే వెసులుబాటు కూడా ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీవో వెంకటేశ్వర్లు, సివిల్ సప్లె డీఎం రజిత, ఏఎంసీ చైర్మన్ సాబెరా బేగం, డీటీ మురళీ కృష్ణ, ఆర్ఐ శ్రవణ్ తదితరులు ఉన్నారు.