సిరిసిల్ల రూరల్, ఫిబ్రవరి -14 : విద్యార్థులంతా ప్రతి సబ్జెక్టులో ఉత్తమ ఫలితాలు సాధించేలా నిత్యం సాధన చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా(Sandeep Kumar Jha) సూచించారు. తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల రెసిడెన్షియల్ విద్యాలయాన్ని కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా కిచెన్, స్టోర్ రూంలోని బియ్యం, ఇతర ఆహార పదార్థాలను సిద్ధం చేసే సరుకుల నాణ్యతను పరిశీలించారు. అనంతరం 6వ తరగతి నుంచి 12 వ తరగతి వరకు ప్రతి తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు.
మొత్తం ఎందరు విద్యార్థులు ఉన్నారు? ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. విద్యాలయం ఆవరణ, పరిసరాలు శుభ్రం చేయించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు ఈ సందర్భంగా మ్యాథ్స్, బాటనీ పాఠ్యాంశాలు బోధించారు. ఆయా పాఠ్యాంశాల్లో అనుమానాలు నివృత్తి చేశారు. అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు 10 జీపీఏ సాధించేలా సన్నద్ధం కావాలన్నారు. కార్యక్రమంలో విద్యాలయం ప్రిన్సిపాల్ పద్మ, టీచర్లు తదితరులు పాల్గొన్నారు.