కోనరావుపేట, ఏప్రిల్ 5 : సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని మరిమడ్ల గ్రామంలో శనివారం అర్ధరాత్రి అకస్మాత్తుగా కురిసిన వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. గాలులతో కూడిన రాళ్లవాన కారణంగా ఎకరాల్లో సాగుచేసిన వరి పంట తీవ్రంగా దెబ్బతీసింది. కోత దశకు చేరుకున్న పంట రాళ్లవాన కురిసి నేలపాలు కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా మబ్బులు కమ్ముకొని గాలి తీవ్రత పెరిగింది. అనంతరం వడగళ్ల వాన కురవడంతో పంటలు నేలకొరిగాయి. ముఖ్యంగా వరి, పంట భారీగా నష్టపోయినట్లు రైతులు చెబుతున్నారు.
కొన్ని చోట్ల పొలాల్లో నీరు నిలిచిపోవడంతో పంట పూర్తిగా పాడైపోయింది. కష్టపడి సాగు చేసిన పంట చేతికి వస్తుందనుకున్న సమయంలో ఈ ప్రకృతి విపత్తు రావడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పెట్టిన పెట్టుబడులు నేలపాలు కావడంతో అప్పులపాలు అవ్వడమే తప్ప మరోగతి లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వ్యవసాయ అధికారులు ప్రాంతాన్ని సందర్శించి నష్టం అంచనా వేసి ఉన్నతధికారులూకు నివేదించాలని స్థానికులు కోరుతున్నారు.
కరగని రాళ్లు…చెదిరిన ఆశలు
అరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వస్తుందనుకున్న సమయంలో రైతుల ఆశలు చీకట్లోరాళ్లవాన చిదిమేసింది. అయితే విచిత్రం ఏమిటంటే రాళ్లు కురిసి కొన్ని క్షణల్లో కరిగిపోవాల్సిన రాళ్లు ఇప్పటివరకు కరిగిపోలేదు. రాళ్ళన్ని గడ్డలు కుట్టుకపోయి పంట పొలాల్లో పేరుకుపోయాయి.