చెట్టు మనిషికి ప్రాణవాయువు అందిస్తూ ఆయువును పెంచుతుందని మనందరికీ తెలుసు. భారీ వర్షాలకు నేలకొరిగి కొనఊపిరితో ఉన్న ప్రాణవాయువును ఇచ్చే మహావృక్షానికే ఆయువు పోయాలన్న ఓ యువకుడి సంకల్పం.. రాష్ట్ర మంత్రి కేటీఆర్, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రత్యేక చొరవ, జిల్లా కలెక్టర్ సహకారంతో నెరవేరింది.
నాలుగు నెలల క్రితం గతంలో ఎన్నడూ చూడని విధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. భారీ వర్షాలకు జిల్లాలోని కోనారావుపేట మండలం సుద్దాల గ్రామ శివారులో బుర్ర భూమయ్య గౌడ్, బుర్ర రమేష్ గౌడ్ల వ్యవసాయ క్షేత్రంలో ఉన్న సుమారు వందేండ్ల వయసు ఉన్న మర్రి చెట్టు కూకటి వేళ్లతో సహా పెకిలి పోయింది. నీరు అందక కొద్ది రోజులకే ఆ మర్రి చెట్టు మోడుగా మారింది.
అదే గ్రామానికి చెందిన ప్రకృతి ప్రేమికుడు దొబ్బల ప్రకాష్ రైతులు బుర్ర భూమయ్య గౌడ్, బుర్ర రమేష్ గౌడ్లతో మాట్లాడాడు. మోడు వారిన చెట్టుకు తిరిగి ప్రాణం పోసి ఇక్కడ నుంచి మరో చోటుకు తరలిస్తానని తెలిపాడు. పక్కనే ఉన్న రైతు దొబ్బల దాస్ వ్యవసాయ క్షేత్రంలోని బావి నీటిని వాడుకునేందుకు అనుమతి తీసుకున్నాడు. రెండు నెలల పాటు ఆ చెట్టుకు నీటిని అందించాడు.
దీంతో చెట్టు తిరిగి చిగురించడం ప్రారంభించింది. ఆ విషయాన్ని గమనించిన ప్రకాష్ మరో రెండు నెలల పాటు ఆ చెట్టుకు నీటిని అందించాడు. ఫలితంగా మోడు వారిన చెట్టు చిగురించిన ఆకులతో పచ్చగా దర్శనం ఇచ్చింది. చెట్టు వేర్లు బయటకి రావడంతో వేర్లకు ఉన్న మట్టిని తడపడం ద్వారా చెట్టుకు ప్రకాష్ ప్రాణం పోశాడు.
అయితే వేర్లు బయట ఉండడంతో నీరు పడుతుంటే మట్టి కొద్ది కొద్దిగా ఊడి పోతుంది. చాలా కాలం ఇలాగే ఉంటే మట్టి పూర్తిగా తొలగి పోయి చెట్టు చనిపోయే ప్రమాదం ఉందని … అలా అయితే ఏండ్ల నాటి చెట్టు ఆయువు శాశ్వతంగా పోతుందని ప్రకాష్ ఆందోళన చెందాడు. అలా జరగకుండా ఉండాలంటే సాధ్యమైనంత త్వరగా మర్రి చెట్టును ట్రాన్స్ప్లాంటేషన్ పరిజ్ఞానంతో ఒకచోట నుంచి మరోచోటకు తరలించి నాటడమే పరిష్కార మార్గం అని భావించాడు.
మర్రి చెట్టును తమ గ్రామంలోని స్కూల్కు తరలించి విద్యార్థులకు నీడ నిచ్చేలా ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలన్నది ప్రకాష్ ఆలోచన. ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే చెట్టును ట్రిమ్ చేయడం, లిఫ్ట్ చేయడం, వాహనంలో తరలించడం, తిరిగి నాటడం చేయాలి. అందుకు భారీ ఖర్చు అవుతుంది. మర్రి చెట్టుకు ప్రాణమైతే పోయగలిగాడు గానీ.. అంత ఖర్చును వెచ్చించే డబ్బు తన వద్ద లేదు. స్థానిక ప్రజాప్రతినిధులు నుంచి ఆశించిన స్పందన రాలేదు. దీంతో దాతలు ఎవరైనా ముందుకు వస్తే… 100 ఏండ్ల వయస్సు ఉన్న మర్రిచెట్టుకు తిరిగి ప్రాణం పోయాలని భావించాడు.
ఈ విషయాన్ని జిల్లా వాసి , సిద్దిపేట ప్రజా సంబంధాల అధికారి మామిండ్ల దశరథంతో పంచుకున్నాడు. మర్రి వృక్షాన్ని మళ్లీ బతికించాలి అన్న ప్రకాష్ పట్టుదలను గమనించి ” ప్రకాష్ తపనను వివరిస్తూ… మర్రి వృక్షంపై కథనాలు రాసి మీడియాకు అందించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాను ఈ కథనం ఆకర్షించింది. పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి.
మీడియాలో వచ్చిన కథనాలను రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ చూశారు. అప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రవేశపెట్టిన తెలంగాణకు హరితహారం స్ఫూర్తితో దేశాన్ని హరిత భారత్ చేయాలన్న సంకల్పంతో గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రారంభించి దేశ వ్యాప్తంగా లక్షలాది మొక్కలను నాటుతూ… ప్రజల్లో హరిత ప్రాధాన్యం తెలియజేస్తూ చైతన్యం తీసుకువస్తున్న ఎంపీ సంతోశ్కు చెట్టును బతికించిందేకు ఓ యువకుడు చేస్తున్న ప్రయత్నం ఎంతగానో కదిలించింది.
వెంటనే ఎంపీ సంతోశ్ కుమార్.. ప్రకాశ్ను కలిసి ఆ చెట్టును వేరే చోటుకు తరలించేందుకు VATA సభ్యులను పంపించారు. దీంతో వారం రోజులు శ్రమించి వాళ్లు మొదట చెట్టు కొమ్మలను తొలగించారు. చెట్టును ట్రాన్స్ప్లాంటేషన్కు సిద్ధం చేశారు.
చెట్టును ట్రిమ్ అయితే చేశారు కానీ భారీ వృక్షాన్ని తరలించడం సవాలుగా మారింది. కొనారావుపేట మండలం సుద్దాల గ్రామం నుండి జిల్లా కేంద్రం అయిన సిరిసిల్లలోని నూతన కలెక్టరేట్ ( వెనుకభాగం) లోని నిర్దేశిత స్థలానికి సుమారు 6 కిలోమీటర్లు తరలించడం కష్టంగా మారింది. ఎలా తరలించాలి అన్న అంశంపై నిపుణులు ఆ ప్రాంతాన్ని సందర్శించి మేధోమథనం చేశారు. వృక్షాన్ని తరలించేందుకు ప్రత్యేకంగా రోడ్డు నిర్మించాలని భావించారు. ప్రత్యేక రోడ్డును యుద్ధ ప్రాతిపదికన నిర్మించారు.
తరలింపునకు భారీ వాహనాలు కావాలి. 100 టన్నుల చెట్టును ఎత్తి వాహనంపై పెట్టేందుకు భారీ వాహనాలు కావాలి. మొదట 50 టన్నుల సామర్థ్యం గల క్రేన్ తెచ్చారు. అనంతరం 70 టన్నుల సామర్థ్యం గల క్రేన్ తెచ్చారు. రెండు సందర్భాలలోనూ చెట్టును ఎత్తడం సాధ్యం కాలేదు. చివరి 70 టన్నులు గల రెండు క్రేన్లను వినియోగించి సఫలం అయ్యారు. దీనికి నెల రోజుల పాటు సమయం పట్టిందంటే క్షేత్ర స్థాయిలో లక్ష్య సాధనకు ఎంతగా శ్రమించారో అర్థం చేసుకోవచ్చు.
చెట్టును తరలించేందుకు అంతా సిద్ధం అయ్యింది. ఆదివారం సుద్దాలలో ఉదయం 8.00 గంటలకు చెట్టును వాహనంలోకి ఎత్తి ఉదయం 10.00 గంటలకు కలెక్టరేట్కు చేర్చాలన్నది ప్రణాళిక. పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగినప్పటికీ లక్ష్య సాధన అంత సులభంగా జరగలేదు. ఉదయం 10.00 గంటలకు సుద్దాలలో మర్రి చెట్టును తరలించేందుకు సిద్ధం చేసిన వాహనంలోకి ఎత్తారు. ఆదివారం అర్థరాత్రి సుమారు 12.10 నిమిషాలకు మర్రి వృక్షాన్ని ట్రాన్స్ప్లాంటేషన్ చేసి చెట్టుకు తిరిగి ప్రాణం పోశారు. భారీ మర్రి వృక్షం ట్రాన్స్ ప్లాంటేషన్కు ముందే మర్రి చెట్టుకు చెందిన రెండు పెద్ద కొమ్మలను ప్రధాన చెట్టు నుంచి వేరు చేసి… రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల పరిధిలోని జిల్లెల్ల అటవీ ప్రాంతంలో క్రేన్ల సహాయంతో నాటారు.
రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆశీస్సుల వల్లే మర్రి వృక్షం ట్రాన్స్ప్లాంటేషన్కు మార్గం సుగమం అయ్యిందని పార్లమెంట్ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ తెలిపారు. చెట్లు ఉంటేనే మానవ మనుగడ అన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మాటలను త్రికరణ శుద్ధిగా నమ్మి సవాలుతో కూడిన ప్లాంటేషన్ ను చేపట్టి దిగ్విజయంగా పూర్తి చేశామని తెలిపారు. సహకరించిన జిల్లా కలెక్టర్, VATA సభ్యులకు ఎంపీ ధన్యవాదాలు తెలిపారు. చెట్టును బతికించాలి అన్న ప్రకాష్ ఆశయం గొప్పదని ప్రశంసించారు.
వందెండ్ల మర్రి చెట్టుకు తిరిగి ప్రాణం పోయాలన్న ఆశతోనే మోడు వారిన చెట్టును చిగురింపజేశా.. శాశ్వతంగా ప్రాణం పోసే స్థాయి నాకు లేక మదన పడ్డా… మీడియా ద్వారా ఎంపీ సార్ చెంతకు చేరడం.. తానే స్వయంగా బాధ్యత తీసుకోవడం… అసాధ్యం అనుకున్న ఈ పనిని సుసాధ్యం చేశారు. ప్రాణవాయువు ఇచ్చే చెట్టుకు ఆయువు పోసిన ఎంపీ సంతోష్ కుమార్ సార్కు శిరస్సు వంచి నమస్కరిస్తున్న– ప్రకృతి ప్రకాష్