Sircilla | కోనరావుపేట, మార్చి 4: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి హామీ కూలీలపై తేనె టీగలు దాడి చేశాయి. ఈ ఘటనలో కూలీలకు తీవ్రగాయాలయ్యాయి.
వివరాల్లోకి వెళ్తే.. కోనరావుపేట మండలంలోని నిజామాబాద్లో బుధవారం ఉదయం ఉపాధి పనుల్లో భాగంగా సర్వాయి కాలువ మరమ్మతు పనులను చేపట్టారు. దాదాపు 10 మంది కూలీలు అక్కడ పనిచేస్తుండగా చెట్టుపై ఉన్న తేనె టీగలు వారిపై దాడి చేశారు. తేనె టీగలు మీదకు రావడంతో భయపడిపోయిన కూలీలు అక్కడి నుంచి పరుగులు తీశారు. అప్పటికే వారిని తేనెటీగలు విపరీతంగా కుట్టాయి. ఇది గమనించిన తోటీ కూలీలు.. గాయపడిన వారిని కోనరావుపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. కానీ అక్కడ వైద్య సిబ్బంది అందుబాటులో లేరు. పైగా ప్రభుత్వ అంబులెన్స్ కూడా అందుబాటులో లేకపోవడం గమనార్హం.
ఇక చేసేదేమీ లేక.. గాయపడిన వారిని ట్రాలీ ఆటోలో సిరిసిల్ల జిల్లా ఆస్పత్రికి తరలించారు. వారి వెంట సర్పంచ్ సింగం శ్రీహరి, ఉపసర్పంచ్ లంబ రాజు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తాళ్లపల్లి ప్రభాకర్ వెళ్లారు. వారికి మెరుగైన వైద్యం అందిచేలా చూడాలని వైద్యులను కోరారు. కాగా, తేనేటీగల దాడిలో గాయపడిన వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వారిలో పులి పాలవ్వ అనే వృద్ధురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.