Raging గంగాధర, ఏప్రిల్ 4 : గంగాధర మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే ప్రభుత్వ బాలుర గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ భూతం పడగ విప్పింది. పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులు, తమతో పాటు చదువుతున్న విద్యార్థులను చితకబాదారు. దెబ్బలకు తాళలేక ఓ విద్యార్థి గోడ దూకి పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్కు పరిగెత్తాడు. పాఠశాలలో ఇంత జరుగుతున్న ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు, నైట్ వాచ్మెన్కు తెలియకపోవడం శోచనీయం. కాగా శుక్రవారం రాత్రి సమయంలో జరిగిన సంఘటనను బయటికి పొక్కకుండా పాఠశాల ఉపాధ్యాయులు తొక్కి పెట్టడానికి ప్రయత్నించారు. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకోగా వారిని లోనికి అనుమతించకుండా సిబ్బంది తాళం వేశారు. దీంతో సిబ్బంది తీరుపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న మండల విద్యాధికారి ప్రభాకర్ పోలీసులు పాఠశాలలో విచారణ చేశారు. గాయపడిన విద్యార్థులను గంగాధర ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స చేయించారు.
మూడు గంటల పాటు చితక బాదారు
గంగాధర మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. తమకు రెస్పెక్ట్ ఇవ్వడం లేదంటూ పాఠశాలలో చదువుతున్న 20 మంది పదవ తరగతి విద్యార్థులు, 9వ తరగతి విద్యార్థులను చితకబాదారు. శుక్రవారం రాత్రి 11 గంటల నుండి దాదాపు మూడు గంటల వరకు ఈ ప్రస్థానం కొనసాగినట్టు విద్యార్థులు వివరించారు. దెబ్బలకు తాళలేక ఓ విద్యార్థి గోడదూకి పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ కు పరిగెత్తినట్లు తెలిపారు. కాగా పాఠశాలలో రాత్రి సమయంలో విధులు నిర్వహిస్తున్న గణిత ఉపాధ్యాయుడు రమేష్, నైట్ వాచ్మెన్ శంకర్ పట్టించుకోలేదని విద్యార్థులు కన్నీరు పెట్టుకున్నారు. తమను తమ ఇళ్లకు పంపించాలని, ఇక్కడే ఉంటే తమను మళ్లీ కొడతారంటూ అధికారుల ముందు విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు.
సంఘటనను తొక్కి పెట్టేందుకు ఉపాధ్యాయుల ప్రయత్నం
పాఠశాలలో జరిగిన సంఘటనను తొక్కి పెట్టేందుకు పాఠశాల ఉపాధ్యాయులు ప్రయత్నించారు. ఉదయం పాఠశాలకు వచ్చిన ప్రిన్సిపల్, ఉపాధ్యాయులకు రాత్రి జరిగిన సంఘటన గురించి విద్యార్థులు వివరించిన నిర్లక్ష్యం వహించారని విద్యార్థులు ఆరోపించారు. 10వ తరగతి విద్యార్థులను కనీసం మందలించలేదని, తమ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా సంఘటనను తొక్కి పెట్టేందుకు ఉపాధ్యాయులు ప్రయత్నించారని విద్యార్థులు ఆరోపించారు. గాయపడిన విద్యార్థులను కనీసం ఆసుపత్రికి తీసుకు వెళ్లకుండా ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వహించారని, వారి వల్ల తాము ఇబ్బందులు పడుతున్నట్లు విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకున్నారు.
తల్లిదండ్రుల ఆందోళన
పాఠశాలలో జరిగిన సంఘటనను తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు శనివారం పాఠశాల వద్దకు చేరుకున్నారు. తల్లిదండ్రులను గమనించిన పాఠశాల సిబ్బంది వారిని పాఠశాలల్లోనికి రాకుండా తాళం వేసి అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము లేకుండా పోలీసులతో రహస్య విచారణ ఎందుకు చేయిస్తున్నారని ప్రశ్నించారు. ఆర్సిఓ మేడం ఎవ్వరిని లోపలికి రాణించవద్దని చెప్పారని సిబ్బంది చెప్పగా తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ సి ఓ ఎవరు పిల్లలు గాయపడి ఏడుస్తుంటే తమను లోపలికి రావద్దని చెప్పడానికి తను ఎవరు అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. తమను లోనికి పంపించకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
ఈ ప్రిన్సిపల్ మాకొద్దు : తల్లిదండ్రుల డిమాండ్
పాఠశాలలో జరిగిన సంఘటనపై నిర్లక్ష్యం వహించిన ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, సిబ్బందిని బదిలీ చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఏండ్లకు ఏండ్లు బదిలీలు లేకుండా ఇక్కడే పనిచేస్తున్నారని. పాఠశాలకు వచ్చిన తల్లిదండ్రులకు కనీస గౌరవం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని వెంటనే బదిలీ చేయాలని, లేదంటే తమ పిల్లలను బడికి పంపించామని హెచ్చరించారు.
అధికారుల విచారణ
పాఠశాలలో జరిగిన సంఘటనపై తాసిల్దార్ రజిత, ఎంఈఓ ప్రభాకర్ రావు, ఎంపీవో ప్రత్యూష, ఏఎస్ఐ లచ్చయ్య, ఆర్ ఐ రజినీకాంత్ విచారణ జరిపారు. విద్యార్థుల నుండి వివరాలు సేకరించారు. చర్యల నిమిత్తం నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని తెలిపారు.