పెద్దపల్లి, డిసెంబర్ 13: సర్కారు స్కూళ్లలో చదివే విద్యార్థులకు నాణ్యమైన భోజనం. బోధన అందించే లక్ష్యంతో పెద్దపల్లి కలెక్టర్ జిల్లాలో ‘లంచ్ అండ్ లెర్న్’ పేరిట వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బుధవారం పెద్దపల్లి మండలం రంగంపల్లిలోని తెలంగాణ మైనార్టీస్ బాలికల గురుకుల స్కూల్లో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్కూల్ పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. వారితో ఆప్యాయంగా ముచ్చటించారు. బోధనా విధానం, భోజనంలో నాణ్యతపై ఆరా తీశారు. ఆసక్తికలిగిన విషయాలు, సబ్జెక్టులు, ఇష్టమైన క్రీడలు తదితర అంశాలను అడిగితెలుసుకున్నారు.
మన దేశానికే గర్వకారణంగా నిలిచిన చంద్రయాన్- 3 ప్రాజెక్టులో పాల్గొన్న శాస్త్రవేత్తలు ప్రభుత్వ పాఠశాలలో చదివారని తెలిపారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని ఉద్బోధించారు. అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ విజయం దిశగా సాగిపోవాలని చెప్పారు. మానసిక ప్రశాంతత కోసం మెడిటేషన్, యోగా చేయాలన్నారు. ప్రతి రోజూ కొంత సమయాన్ని క్రీడలకు కేటాయించాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించేందుకు లంచ్ అండ్ లెర్న్ కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు.
ఇక నుంచి ప్రతి బుధవారం జిల్లా అధికారులు ప్రభుత్వ పాఠశాలలను సంందర్శించి, తనిఖీ చేసి పాఠశాలలో విద్యార్ధులకు అందితున్న సౌకర్యాలు, సమస్యలు, బోధన, భోజనం తదితర అంశాలపై సమగ్ర నివేదిక సమర్పిస్తారని చెప్పారు. ప్రతి విద్యార్ధిపై ప్రభుత్వం లక్షల రూపాయలు వెచ్చిస్తున్న విషయాన్ని విద్యార్ధులు, తల్లిదండ్రులు గమనించాలన్నారు. ప్రభుత్వం సూచించిన ఫుడ్ మెనూను ప్రభుత్వ పాఠశాలల్లో, హాస్టల్స్లో తప్పకుండా అమలు అయ్యే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. చదువులో వెనుకబడిన విద్యార్ధులపై దృష్టి సారించి, ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రతి విద్యార్థిని ప్రగతి నెల వారిగా సమీక్షించాలని, పేరేంట్స్ మీటింగ్ ఏర్పాటు చేయాలన్నారు.