కాళేశ్వర ప్రాజెక్టులో ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. లక్ష్మీ పంప్హౌస్ నుంచి ఎగువన ముప్కాల్ పంప్హౌస్ వరకు పంపులు నడుస్తుండడంతో ఎస్సారెస్పీ వైపు జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. నిండుగా ఉన్న వరద కాలువ తూముల నుంచి అధికారులు చెరువులకు నీటిని విడుదల చేస్తుండడంతో అవి నిండి మత్తళ్లు దుంకుతున్నాయి. అక్కడి నుంచి గొలుసుకట్టుగా దిగువన ఉన్న చెరువులు, కుంటలకు తరలివెళ్తున్నాయి. దీంతో ఆయకట్టు రైతులు సంబురాలు చేసుకుంటూ నీటిని విడుదల చేసిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. చెరువులు నింపుతుండడంతో వానలు కోసం ఎదురు చూడకుండా పంటలు సాగు చేసుకుంటున్నామని స్పష్టం చేస్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు లింక్-1, 2లో ఆరు రోజులుగా ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. ప్రాణహిత ద్వారా వస్తున్న జలాలను ఎగువకు ఎత్తిపోస్తున్నారు. మేడిగడ్డలోని లక్ష్మీ బరాజ్కు ప్రాణహిత నుంచి 22,350 క్యూసెకుల ఇన్ఫ్లో ఉండగా, లింక్- 1, 2లలో 21 మోటర్లను నడిపిస్తూ నీటిని ఎగువకు తరలిస్తున్నారు. రామగుండం ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ అధికారుల నిరంతర పర్యవేక్షణలో సీఎం కార్యాలయ నిరంతర సలహాలు, సూచనలతో ఎత్తిపోతలను కొనసాగిస్తున్నారు.
లింక్ -1లో 17 పంపులు
కాళేశ్వరం ప్రాజెక్టు లింక్-1లోని మూడు పంప్ హౌస్ల్లో అధికారులు 17 పంపులను నడుపుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కన్నెపల్లిలోని లక్ష్మీ పంప్హౌస్లోని 7 పంపులను నడిపిస్తూ 15,400ల క్యూసెకుల నీటిని అన్నారంలోని సరస్వతీ బరాజ్లోకి ఎత్తిపోస్తున్నారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం కాసిపేటలోని సరస్వతీ పంపుహౌస్లో 5 పంపులను నడిపిస్తూ 14,650 క్యూసెకుల నీటిని మంథని మండలం సిరిపురంలోని పార్వతీ బరాజ్లోకి, అంతర్గాం మండలం గోలివాడలోని పార్వతీ పంపుహౌస్లోని నాలుగు మోటర్లను నడిపిస్తూ 13,050 క్యూసెకుల నీటిని ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎత్తిపోస్తున్నారు.
లింక్ – 2లో నాలుగు మోటర్లు
ఎల్లంపల్లికి చేరిన కాళేశ్వరం జలాలు టన్నెల్ ద్వారా ధర్మారం మండలం నందిమేడారంలోని నందిపంపు హౌస్కు వెళ్తుండగా, అకడి రెండు మోటర్లను నడిపిస్తూ అండర్ టన్నెల్ ద్వారా 6300ల క్యూసెకుల నీటిని నంది రిజర్వాయర్ లోకి ఎత్తిపోస్తున్నారు. అకడి నుంచి టన్నెల్ ద్వారా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్లోని గాయత్రీ పంప్హౌస్కు తరలిస్తుండగా, అకడ రెండు బాహుబలి మోటర్లను ఆన్ చేసి 6300ల క్యూసెకుల నీటి ఎత్తి పోస్తున్నారు. కాగా, నంది పంపుహౌస్ను రామగుండం ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు పరిశీలించారు.
గాయత్రీ నుంచి ఎస్సారెస్పీ వైపు
రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రీ పంపుహౌస్ నుంచి అధికారులు వరద కాలువకు నీటిని విడుదల చేయడంతోపాటు ఎస్సారెస్పీ పునర్జీవ పథకం ద్వారా ఎదురెక్కిస్తుండడంతో కాళేశ్వర జలాలు ఎగువకు పరుగులు పెడుతున్నాయి. మల్యాల మండలం రాంపూర్లోగల పంప్హౌస్లో నాలుగు మోటర్ల ద్వారా 5800 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి మెట్పల్లి మండలం రాజేశ్వర్రావుపేట (వరదకాలువ 34వ కిలోమీటరు)కు చేరుతుండగా, ఇక్కడి మూడు మోటర్ల సాయంతో 5800 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తూ వరదకాలువ ఎగువ ప్రాంతానికి తరలిస్తున్నట్లు డీఈ రూప్లానాయక్ తెలిపారు. ఇక్కడి నుంచి ఎగువన ఉన్న నిజామాబాద్ జిల్లాలోని ముప్కాల్(వరదకాలువ 0.10 కిలోమీటర్) పంపుహౌస్ చేరుకుంటుండగా, అక్కడి పంపుల ద్వారా కాళేశ్వరం జలాలు ఎస్సారెస్పీలోకి చేరుకుంటున్నాయి.
క్షేత్రస్థాయికి కాళేశ్వర జలాలు..
ఎస్సారెస్పీ పునర్జీవ పథకం ఫలితం క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నది. ఎస్సారెస్పీ పునర్జీవ పథకం ద్వారా ఎదురెక్కి వస్తుండడంతో వరదకాలువకు ఏర్పాటు చేసిన తూముల ద్వారా అధికారులు చెరువులు నింపుతున్నారు. దీంతో అవి మత్తళ్లు దుంకి దిగువన ఉన్న గొలుసు కట్టు చెరువులవైపు వెళ్తున్నాయి. ఈ క్రమంలో కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లి వద్ద వరద కాలువకు వద్ద ఏర్పాటు చేసిన తూము నుంచి ఊర చెరువులోకి మీరు చేరడంతో పూర్తిస్థాయిలో నిండి మత్తడి దుంకుతోంది. దీంతో గ్రామస్తులు మత్తడి వద్దకు చేరుకొని సంబురాలు చేసుకున్నారు. ఇకడ మారెట్ కమిటీ మాజీ చైర్మన్ సాగి మహిపాల్రావు, నాయకులు గడ్డం స్వామి, ఆడెపు మహేందర్, దూలం వీరేశం, పున్న కనకయ్య, రాజేశం ఉన్నారు.
‘ఎస్సారార్’ నుంచి నీటి విడుదల
మాన్వాడ ఎస్సారార్ జలాశయం నుంచి శనివారం 3480 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న ఎల్ఎండీకి విడుదల చేసినట్లు జలాశయం ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. ఒక గేటు ద్వారా మాత్రమే దిగువకు నీటిని విడుదల చేసి పంపినట్లు చెప్పారు. ఈ మేరకు జలాశయంలో 15.997 టీఎంసీల నీటి నిలువ ఉన్నట్లు వారు తెలిపారు.
పెద్ద చెరువుకు నీళ్లు.. నాట్లకు సిద్ధమైన పొలాలు
బోయినపల్లి, జూలై 8: రామడుగు మండలం లక్ష్మీపూర్లోని గాయత్రీ పంప్హౌస్ నుంచి మొన్నటి వరకు శ్రీరాజరాజేశ్వర జలాశయానికి తరలించగా, వరదకాలువలో నిండిన నీటిని నాలుగు రోజులుగా బోయినపల్లి మండలం విలాసాగర్ పెద్ద చెరువులోకి రెండు మోటర్ల ద్వారా ఎత్తిపోస్తున్నారు. దీంతో రైతులు సంతోషంగా భూములు దున్నుకుని నారు వేసుకునేందుకు సిద్ధమవతున్నారు. ఈ చెరువు విస్తీర్ణం 185 ఎకరాలు కాగా, ఆయకట్టు దాదాపు 700 ఎకరాల వరకు ఉంది. స్థానిక ప్రజా ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం గ్రామ శివారులోని వరదకాలువ వద్ద పంప్హౌస్ నిర్మాణం కోసం రూ.కోటి 31 లక్షలు మంజూరు చేసింది. దీంతో రెండు మోటర్లు బిగించి విద్యుత్ ప్యానల్ బోర్డును ఏర్పాటు చేశారు. 2021 జూన్ 16న మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్ మోటర్లను ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది వరద కాలువ నుంచి నీటిని ఎత్తిపోస్తూ పెద్ద చెరువును నింపుతున్నారు.
అడిగిన వెంటనే ఇస్తున్నరు
విలాసాగర్ చెరువుకు నీటిని విడుదల చేయాలని అడిగిన వెంటనే నీటి పారుదల శాఖ అధికారులు ఆమోదం తెలిపిన్రు. విలాసాగర్ పెద్ద చెరువు కింది ఆయకట్టు రైతులకు సాగు నీటి కొరత ఉన్నదని, వర్షాలు పడటం లేదని లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటిని విడుదల చేయాలని అధికారులను కోరినం. వారు వెంటనే నీటి విడుదలకు అనుమతి ఇవ్వడంతో మోటర్లు మొదలైనయ్. నాలుగు రోజులుగా పెద్ద చెరువులోకి నీరు చేరుతున్నది.
– సుంకపాక లక్ష్మణ్, రైతు, విలాసాగర్ (బోయినపల్లి మండలం)
సంతోషంగా సాగు చేసుకుంటున్నం
పెద్ద చెరువు నింపుతుండడంతో విలాసాగర్తో పాటు చెరువు కింది గ్రామాల రైతులు సంతోషంగా సాగు చేసుకుంటున్నరు. ఈ ఏడాది సరైన వర్షాలు లేవు. దుక్కులు దున్నుకుని వర్షం కోసం ఆకాశం వైపు చూస్తున్నాం. ఈ సమయంల పెద్ద చెరువులోకి మోటర్ల ద్వారా ఎత్తిపోస్తుండడంతో పాణం లేసొచ్చినట్టయింది. రైతు కుటుంబాల్లో సంతోషం కనబడుతంది. సీఎం కేసీఆర్కు కృతజ్నతలు.
-దావ కనుకయ్య, రైతు విలాసాగర్ (బోయినపల్లి మండలం)