భానుడు భగ్గుమంటున్న వేళ ‘హరిత’ మొక్కల సంరక్షణపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. నిత్యం ట్యాంకర్ల ద్వారా నీరందిస్తూ కంటికిరెప్పలా కాపాడుతున్నారు. బల్దియా, పంచాయతీ పాలకవర్గాలు వాచర్లను నియమించి ప్రతిరోజూ పర్యవేక్షిస్తున్నారు. వెరసీ మండుటెండల్లోనూ మొక్కలు పచ్చదనంతో కళకళలాడుతూ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
జిల్లాలో ఉన్నట్టుండి ఒక్కసారిగా ఎండలు భగ్గుమంటున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల దాకా నమోదవుతున్నాయి. వేసవితాపాన్ని భరించలేక ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. నేలపై గడ్డిపోచలు సైతం మాడిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా అధికారులు హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణకు శ్రద్ధ చూపుతున్నారు. కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్ నాలుగురోజులకోసారి సమీక్షిస్తూ పంచాయతీ, బల్దియా పాలకవర్గాలకు దిశానిర్దేశం చేస్తున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో సిబ్బంది మొక్కలకు ప్రతిరోజూ ట్యాంకర్ల ద్వారా నీరందిస్తున్నారు. ఆయా వార్డులు, డివిజన్లలోని ప్రజాప్రతినిధులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించగా, రోజు పరిశీలన తప్పనిసరిగా మారింది. దీంతో హరిత మొక్కలు ఏపుగా పెరుగుతూ పచ్చని శోభను సంతరించుకున్నాయి. రహదారుల గుండా వెళ్లే వాహనదారులకు నీడనివ్వడమే గాకుండా ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.