తీగలగుట్టపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ)పై అంతులేని అలసత్వం కొనసాగుతున్నది. అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల పట్టింపులేమితో నిర్మాణం నత్తనడకన సాగుతున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో రెండేళ్లలో కంప్లీట్ చేయడమే లక్ష్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనులు ప్రారంభించగా, తర్వాత వచ్చిన సర్కారు గాలికొదిలేసింది. 15 నెలలైనా ఇంకా పిల్లర్ల దశకే పరిమితం కాగా, గేటు పడినప్పుడల్లా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం దుమ్ము, ధూళితో స్థానికులు నరకం చూస్తున్నారు. ఇప్పటికైనా పనులు వేగంగా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
కరీంనగర్ కలెక్టరేట్, అక్టోబర్ 16: కరీంనగర్ – మంచిర్యాల రహదారి నిత్యం రద్దీగా ఉంటుంది. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే పెద్దపల్లి-కరీంనగర్- నిజామాబాద్ రైల్వేలైన్లో కరీంనగర్ జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న కరీంనగర్-తీగలగుట్టపల్లి క్రాసింగ్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి లేక వాహనదారులు ఏండ్లుగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ మార్గంలో కొన్నేండ్లుగా రైళ్ల సంఖ్య భారీగా పెరిగింది. ఈ క్రమంలో రైలు వచ్చి వెళ్లే సమయంలో క్రాసింగ్ వద్ద గేటు వేస్తుండగా, ఒక్కోసారి రైలు వచ్చి వెళ్లడానికి సుమారు 20 నుంచి 30 నిమిషాలు పడుతుండడంతో వాహనదారులు చుక్కలు చూస్తున్నారు. ఇక్కడ ఆర్వోబీ నిర్మించాలని ఏండ్లుగా వాహనదారులు డిమాండ్ చేస్తూ వచ్చినా నెరవేరలేదు.
పనుల్లో నిర్లక్ష్యం
బీఆర్ఎస్ ప్రభుత్వం రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం రైల్వే శాఖకు పలుసార్లు లిఖిత పూర్వకంగా విన్నవించింది. ఆలస్యంగానైనా స్పందించి ఆర్వోబీ నిర్మాణానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీని నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం కావాలని సూచించడంతో అప్పటికప్పుడు తన వంతు వాటా కూడా విడుదల చేసింది. 154 కోట్ల వ్యయంతో నాలుగు వరుసల్లో 750 మీటర్ల పొడవు, 21 మీటర్ల వెడల్పుతో వంతెన పనులు రహదారులు, భవనాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టారు. 2023 జూలై 13న అప్పటి రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ కలిసి పనులకు శంకుస్థాపన చేశారు.
ఆరునెలల పాటు శరవేగంగా కొనసాగగా, అంతలోనే అసెంబ్లీ ఎన్నికలు రావడం, నిధుల విడుదలలో జాప్యం జరగడంతో పనులు నిలిచాయి. అయితే, ప్రస్తుత ప్రభుత్వం ఆర్వోబీ నిర్మాణంపై అంతగా దృష్టి సారించడం లేదు. గుత్తేదారు, అధికారుల నిర్లక్ష్యంతో పనులు మందకొడిగా సాగుతున్నాయి. కనీసం పదిశాతం పనులు కూడా పూర్తి కాలేదు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా ఇటీవల సంబంధిత అధికారులతో సమీక్షించి, పనుల్లో వేగం పెంచాలని సూచించినా అది జరగలేదు. గతేడాది జూలై నుంచి సాగుతున్న పనులతో ఇప్పటివరకు కేవలం ఒకవైపు మాత్రమే పిల్లర్లు వేయడం పూర్తయింది. వీటిపై స్లాబు నిర్మాణం చేపట్టడంతో పాటు రెండో వైపు పిల్లర్లు, స్లాబు పనులు పూర్తి చేసేందుకు ఇంకెన్నాళ్లు పడుతుందో తెలియదు.
వాహనదారులకు తిప్పలు
ఈ మార్గంలో రోజూ వందల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ రహదారిపై ఉన్న ట్రాక్ గుండా గంటకోసారి గూడ్స్ రైళ్లు వెళ్తున్నాయి. దీంతో రోజుకు కనీసం పది నుంచి పదిహేను సార్లు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే, బ్రిడ్జి నిర్మాణ పరిసరాల్లో దుమ్ము, ధూళితో స్థానిక ప్రజలు నరకం చూస్తున్నారు. జిల్లాతోపాటు మంచిర్యాల, ఆదిలాబాద్, లక్షెట్టిపేట, తదితర ప్రాంతాల నుంచి వచ్చే రోగులు కూడా ఇబ్బందులు పడుతున్నారు.
ఒకసారి రైల్వే గేటు వేస్తే తిరిగి తీసేందుకు కనీసం పావుగంటకు పైగా సమయం పడుతున్నది. ఈలోగా ఇరువైపులా కిలోమీటర్ మేరకు ట్రాఫిక్ జాం అవుతుండగా, క్లియర్ కావడానికి కనీసం అరగంటకు పైగానే పడుతున్నది. ఒక్కోసారి అత్యవసర వైద్యం కోసం వచ్చే రోగులు ట్రాఫిక్లోనే మరణించిన సందర్భాలు కూడా ఉన్నా యి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి యుద్ధప్రాతిపదికన పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.