అనారోగ్యంతో దవాఖానలో ప్రాణం విడిచిన భర్త.
ప్రాణాపాయస్థితిలో కొడుకు
దిక్కుతోచనిస్థితిలో ఎల్లారెడ్డిపేటకు చెందిన రూత
ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు
ప్రేమించి పెండ్లి చేసుకొని ఉన్నంతలో అన్యోన్యంగా బతుకున్న కుటుంబంపై విధి కన్నెర్రజేసింది. మూడు నెలల కిందట అనారోగ్యం బారిన పడ్డ భర్త ఆదివారం కన్నుమూశాడు..ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో కొడుకు ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు..ఇటు భర్త మరణం..అటు కన్నకొడుకు పరిస్థితిని చూసి ఆ మహిళ తల్లడిల్లుతున్నది.. దిక్కుతోచనిస్థితిలో ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నది.. ‘కొడుకునైనా కాపాడండి’ అంటూ ఉబికివస్తున్న కన్నీళ్లను దిగమింగుకొని చేతులు జోడించి వేడుకుంటున్నది.
ఎల్లారెడ్డిపేట, జూన్ 6: ఎల్లారెడ్డిపేటకు చెందిన రేసు సతీశ్ వీర్నపల్లికి చెందిన రూతను 14 ఏండ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి ప్రణిత్(12) ఒక్కగానొక్క కొడుకు. ఉన్నంతలో హాయిగా బతుకుతున్న తరుణంలో సతీశ్ ఈ ఏడాది మార్చిలో అనారోగ్యానికి గురయ్యాడు. ఇదే పరిస్థితిలో కొడుకు ప్రణిత్కు ఏప్రిల్లో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్కు గురయ్యాడు. దీంతో చికిత్స కోసం హైదరాబాద్లోని నీలోఫర్ హాస్పిటల్కు తరలించారు. కొంత మెరుగై ఇంటి కి చేరుకోగా మూడు రోజుల క్రితం మరోమారు ప్రణిత్ అనారోగ్యానికి గురయ్యాడు. భర్త సతీశ్ పరిస్థితి విషమించడంతో సిరిసిల్ల జిల్లా దవాఖానకు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబంలో ఇద్దరికి మెరుగైన చికిత్స చేయించుకునే పరిస్థితి లేకుండా పోవడంతో భర్త కండ్ల ముందే చనిపోగా కొడుకు అనారోగ్య పరిస్థితిని గుర్తు చే సుకుంటూ గుండెలవిసేలా రోదించింది. దాతలు ముందుకువచ్చి ఆదుకోవాలని వేడుకుంటున్నది. సాయం చేయాల్సిన వారు అకౌంట్ నంబర్ 071701000022639, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, ఎల్లారెడ్డిపేట బ్రాంచిచ్, ఐఎఫ్ఎస్సీకోడ్ ఐవోబీఏ0000717కు, ఫోన్పే నంబర్ 995 1574531లో సంప్రదించాలని అర్థిస్తున్నది.