గుండెపోటుతో దుబాయ్లో వెంకంపల్లివాసి మృతి
గల్ఫ్ బాటపట్టిన వలసజీవి గుండె ఆగిపోయింది. కరోనా కష్టాలను దాటుకొని భవిష్యత్తుపై ఆశలతో ముందుకెళ్తున్న సమయంలో కుటుంబం ఆగమైంది. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి దివ్యాంగురాలైన భార్య, ఇద్దరు ఆడ పిల్లలు దిక్కుతోచని స్థితిలో పడిపోగా, ఆ తల్లీకూతుళ్లు రోదిస్తున్న తీరు గ్రామస్తులను కంటతపడి పెట్టిస్తున్నది.
గంగాధర, జూలై 26: వెంకంపల్లి గ్రామానికి చెందిన గుండవేని రవి పదేళ్లుగా దుబాయ్ వెళ్తున్నాడు. రెండు నెలల క్రితం స్వగ్రామానికి వచ్చి, మళ్లీ దుబాయ్ వెళ్లాడు. ఈ నెల 17వ తేదీన రవి గుండెపోటుతో మృతి చెందినట్లు కంపెనీ ప్రతినిధులు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. విషయం తెలిసిన భార్య మమత, ఇద్దరు కూతుళ్లు నందిని (5వ తరగతి), శరణ్య (4వ తరగతి) గుండెలవిసేలా రోదిస్తున్నారు. పది రోజులుగా రవి మృతదేహం కోసం ఎదురు చూస్తున్నారు. తన భర్త మృతదేహాన్ని తెప్పించాలని భార్య వేడుకుంటున్నది. మమత దివ్యాంగురాలు కావడం, ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో ఈ నిరుపేద కుటుంబం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రవి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. మమత బ్యాంక్ ఖాతా (62341169015, ఎస్బీఐ, గంగాధర బ్రాంచ్ లేదా గూగుల్ పే నంబర్ 9390636032)కు నగదు పంపాలని కోరుతున్నారు.