వేములవాడ, మే 16: 28 రోజుల బాబు కిడ్నాప్ కథ సుఖాంతమైంది. గంటల వ్యవధిలోనే పోలీసులు ఈ కేసును ఛేదించి తల్లి ఒడికి చేర్చారు. సోమవారం వేములవాడ డీఎస్పీ చంద్రకాంత్ వివరాలు వెల్లడించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శాంతినగర్కు చెందిన లావణ్య తన భర్తతో విభేదాలు రాగా నాలుగు రోజులుగా రాజన్న ఆలయ పరిసరాల్లో ఉంటున్నది. అయితే తనకు ఇద్దరు కుమారులు ఉండగా పెద్ద కొడుకు సనత్కుమార్ పుట్టు వెంట్రుకలు రాజన్నకు అప్పగించి మరో 28 రోజుల వయస్సుగల బాబుతో ఆలయ మెట్ల వద్దనే ఉంటున్నది. ఏపీలోని తిరుపతి జిల్లా అలిపిరికి చెందిన చాడీ అభితేజ ఆలియాస్ రవితేజ కొంతకాలంగా ఇక్కడే తాపీమేస్త్రీగా పనిచేస్తూ ఆలయ మెట్ల వద్దే తన భార్య సునీతతో కలిసి ఉంటున్నాడు.
ఈ క్రమంలో లావణ్యతో వీరికి పరిచయం ఏర్పడింది. వీరు ఆదివారం రాత్రి లావణ్యకు మద్యం తాగించారు. సోమవారం వేకువజామున 3గంటలకు లావణ్య నిద్రలేచి చూడగా తన చిన్న కొడుకు కనిపించలేదు. దీంతో ఆందోళనకు గురై ఉదయం 6గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాత్రి మద్యం తాగించి సునీత- రవితేజ దంపతులే తన కొడుకును అపహరించారని అనుమానం వ్యక్తం చేసింది. సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించిన పట్ట ణ సీఐ వెంకటేశ్ కేసును ఛేదించేందుకు రంగంలోని దిగారు. మూడు బృందాలుగా విడిపోయి కరీంనగర్, వరంగల్, హైదరాబాద్కు వెళ్లారు. ఆయా జిల్లా పోలీసులనూ అప్రమత్తం చేశారు. ఈ క్రమంలో వరంగల్ బస్టాండ్లో అక్కడి పోలీసుల సహాయంతో బాలుడితోపాటు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాలల రక్షణ హెల్ప్ లైన్ సహాయంతో వేములవాడకు తీసుకువచ్చి తల్లికి అప్పగించారు. అపహరణ కేసును కొన్ని గంటల వ్యవధిలోనే ఛేదించిన పట్టణ సీఐ వెంకటేశ్, ఎస్ఐలు తిరుపతి, ప్రశాంత్రెడ్డి, పోలీసు సిబ్బంది శ్రీనివాసరావు, ఉమాపతిని ఆయన అభినందించారు. అయితే రవితేజ-సునీత దంపతులకు పిల్లలు లేకపోవడంతోనే బాబును అపహరించినట్లు తెలిసింది.