PM Shri scheme | కోరుట్ల, ఫిబ్రవరి 19 : పీఎంశ్రీ పథకం పనులు వేగవంతంగా పూర్తి చేయాలని పెద్దపల్లి కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. కోరుట్ల పట్టణంలోని పీఎంశ్రీ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలను ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీఎం శ్రీ నిధులు రూ.40.50 లక్షలతో చేపడుతున్న అదనపు తరగతి గదులు, అధునాతన సైన్స్ ల్యాబ్ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు.
ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో నిర్మిస్తున్న తరగతి గదుల నిర్మాణ పనుల్లో అలసత్వం పనికిరాదని, నాణ్యతతో కూడిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట కోరుట్ల ఆర్డీవో జివాకర్ రెడ్డి, తహశీల్దార్ కృష్ణ చైతన్య, జిల్లా విద్యాధికారి రాము, మండల విద్యాధికారి గంగుల నరేశం, సెక్టోరియల్ అధికారి సత్యనారాయణ, టీఎస్ డబ్ల్యూడీఈ ఇంజనీర్లు శశికుమార్, ధనుంజయ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.