రాంనగర్, జనవరి 27: అన్ని వర్గాల ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సేవలందించే అధికారులు చిరస్థాయిగా నిలిచిపోతారని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. రాచకొండ జాయింట్ కమిషనర్గా బదిలీపై వెళ్తున్న సీపీ వీ సత్యనారాయణకు వీడోలు, నూతనంగా బాధ్యతలు చేపట్టిన సీపీ ఎల్ సుబ్బారాయుడుకు స్వాగతం పలుకుతూ శుక్రవారం కరీంనగర్ కమిషనరేట్ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా వచ్చి, మాట్లాడారు. సీపీ సత్యనారాయణ జిల్లాలో సమర్థవంతంగా పనిచేశారని కొనియాడారు. రాజన్న జోన్ డీఐజీ కే రమేశ్ నాయుడు మాట్లాడుతూ, మానవత్వంతో స్పందిస్తూ సేవలందించే అధికారిగా సీపీ సత్యనారాయణ గుర్తింపు పొందారన్నారు. సీపీ సత్యనారాయణ మాట్లాడుతూ, సాహసోపేతమైన చర్యలతో కమిషనరేట్ వ్యాప్తంగా శాంతియుత వాతావరణం ఏర్పడిందన్నారు. సంతృప్తికరంగా విధులను నిర్వహించానని, సహకరించిన అధికారులు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.
నూతన సీపీ సుబ్బారాయుడు మాట్లాడుతూ, తనకు సుపరిచిత ప్రాంతమే అయినందున ప్రజాప్రతినిధులు, అన్ని శాఖలకు చెందిన అధికారుల సమన్వయంతో పనిచేస్తామని చెప్పారు. బదిలీపై వెళ్తున్న సీపీకి మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రజాప్రతినిధులు, వివిధశాఖలకు చెందిన అధికారులు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో మానకొండూర్, చొప్పదండి ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, మేయర్ వై సునీల్ రావు, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) గరిమా అగర్వాల్, ట్రైనీ కలెక్టర్ లెనిన్తోపాటు డీసీపీ (శాంతిభద్రతలు) ఎస్ శ్రీనివాస్, ఏసీపీలు తుల శ్రీనివాసరావు, కరుణాకర్ రావు, వెంకటరెడ్డి, మదన్లాల్, జే విజయసారథి, కే శ్రీనివాస్, సీ ప్రతాప్, జిల్లా అగ్నిమాపక అధికారి వెంకన్న, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.