కార్పొరేషన్, నవంబర్ 27: నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలని మేయర్ యాదగిరి సునీల్ రావు కోరారు. నగరంలోని 50, 60వ డివిజన్ల పరిధిలో గల మంకమ్మతోటలో ఆదివారం ఆయన పర్యటించారు. రోడ్డు విస్తరణలో భాగంగా ఓ ఇంటి ప్రహరీ అడ్డురావడంతో సంబంధిత యజమానితో మేయర్ మాట్లాడారు. రోడ్డుకు అడ్డుగా ఉన్న ప్రహరీ తొలగించి, రోడ్డు విస్తరణతో పాటు నగర అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేయగా, యజమాని అంగీకరించారు.
దీంతో యజమానికి మేయర్ ధన్యవాదాలు తెలిపారు. ప్రహరీ తొలగించి, రోడ్డు విస్తరణ, డ్రైనేజీ పనులు చేపట్టాలని బల్దియా ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, నగర అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు. భవిష్యత్లో నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా నగరపాలక సంస్థ ముందస్తు ఆలోచనతో అంతర్గ రోడ్లను విస్తరించడంతో పాటు వాల్ టూ వాల్ డ్రైనేజీ పనులు చేపట్టి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.
సంబంధిత విషయాన్ని ప్రజలు గమనించి జరుగుతున్న అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకారం అందించాలన్నారు. రోడ్డు విస్తరణలో ప్రహరీ లాంటి నిర్మాణాలు అడ్డుగా వస్తే తొలగించేందుకు సహకరించి, అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నగర వ్యాప్తంగా స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్లో చేపట్టిన పనులు నాణ్యతతో వేగంగా జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ప్రతి ప్రాజెక్ట్ పనిని వచ్చే జూన్లోగా పూర్తి చేసేందుకు నగరపాలక సంస్థ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
వరద నీటితో ప్రజలకు ఇబ్బందులు రాకుండా స్టాంవాటర్ డ్రైనేజీ నిర్మిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం స్టాంవాటర్ డ్రైనేజీ నిర్మాణ పనులు 75 శాతం పూర్తయినట్లు తెలిపారు. ఆరు నెలల్లో అభివృద్ధి పనులు పూర్తి చేసి నగర రూపు రేఖలు మార్చడంతో పాటు ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రాజేందర్రావు, పెద్దపల్లి జితేందర్, డీఈ వెంకటేశ్వర్లు, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.