పెద్దపల్లి, ఏప్రిల్ 3(నమస్తే తెలంగాణ): ‘మేడిగడ్డ కుంగిన చోట రింగ్బండ్, ఇసుక బస్తాలు వేసి నీళ్లు ఎత్తిపోయవచ్చు. కానీ, కావాలనే బరాజ్ల్లోని నీళ్లను దిగువకు వదిలి పంటలను ఎండబెట్టిన్రు. రైతుల నోట్లో మట్టికొట్రిన్రు’ అని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ మండిపడ్డారు. ఎస్సారెస్పీ చివరి ఆయకట్టు వరకూ సాగునీరిస్తామని సర్క్యూలర్ ఇచ్చి, షెడ్యూల్ ఇచ్చి నీరు ఇవ్వకుండా మోసం చేశారని ధ్వజమెత్తారు. ఈ విషయమై కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. తెలంగాణలో రైతు ఆత్మహత్యలకు సీఎం రేవంత్రెడ్డి, మంత్రులే కారణమని ఆరోపించారు. పంటలు ఎండటానికి కారణమైన ప్రభుత్వం ఎకరాకు 25వేల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. న్యాయం చేసేదేకా రైతులకు పక్షాన పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ పాలనలో వడగళ్ల వానతో నష్టపోయిన రైతులకు ఎకరానికి 10వేల చొప్పున పంటనష్ట పరిహారాన్ని అందించామని గుర్తు చేశారు. పెద్దపల్లి బీఆర్ఎస్ భవన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్ సింగ్, కమాన్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్తో కలిసి ఆయన మాట్లాడారు.
ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ కన్నా గొప్పగా పనిచేస్తారని తెలంగాణ రైతులు కాంగ్రెస్కు ఓటేస్తే నిండా ముంచారని ధ్వజమెత్తారు. వంద రోజుల్లో ఆరు హామీలను అమలు చేస్తామని చెప్పి 600 అబద్ధాలతో పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. ఈ రోజు ఏ ఊళ్లో చూసినా రైతు లు పంట పొలాల్లో కూర్చొని ఏడుస్తున్నారని, పంటలు ఎండబెట్టిన పాపం కాంగ్రెస్ సర్కారుదేనని దుయ్యబట్టారు. గత ప్రభుత్వానికి ఎక్కడ పేరు వస్తుందోనని, సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టును చిన్నగా చేసి చూపుతున్నారని, కుం గిన పిల్లర్లను సాకుగా చూపి నీళ్లివ్వకుండా రైతు ఆత్మహత్యలకు కారణమవుతున్నారని మండిపడ్డారు. పెద్ద పెద్ద చెరువులు, డ్యాంలు కావచ్చు చిన్న గండి పడితే ఇసుక సంచులు వేసుకొని నీళ్లు ఆపుకున్న సందర్భాలు తెలంగాణలో అనేకం ఉన్నాయని గుర్తు చేశారు. కానీ, రేవంత్రెడ్డి అలాంటి ప్రయత్నాలు చేయడం లేదని ఆగ్రహించారు. ‘కాళేశ్వరానికి మేడిగడ్డనే వెన్నముక’ అని రేవంత్ మాట్లాడిన మాటలను సెల్ఫోన్ ద్వారా మీడియాకు వినిపిస్తూ.. వెన్నెముక మొత్తం విరిగి పోలేదని, ఒక్క పిల్లర్ మాత్రమే కుంగిందని, దాని చుట్టూ ఇసుక బస్తాలతో రింగ్ బండ్ వేసి నీళ్లను నిలుపవచ్చన్నారు. కానీ, ముఖ్యమంత్రి, మంత్రులు చిన్న లోపాన్ని పెద్దదిగా చూపి రైతుల నోళ్లల్లో మట్టికొడుతున్నారని మండిపడ్డారు.
రైతుబంధు ఏమైందని, ఇంకెప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. పెద్దపల్లి జిల్లా వెబ్సైట్లో చూస్తే రెండెకరాల భూమి ఉన్న రైతులు రెండు వేల మంది, ఐదెకరాల వరకు భూమి ఉన్న రైతులు ఆరువేల మంది దాకా ఉన్నారని, వారికి డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి ఉందన్నారు. అక్కడొకరికి.. ఇక్కడొకరికి ఇచ్చి మొత్తం మందికి వేశామని చెప్పుకుంటూ.. మోస పూరితంగా పరిపాలన చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎంత సేపు అబద్ధాల తో పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. రైతుల పంటలు ఎండిపోవడానికి కారణమైన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులపై క్రిమినల్ కేసులను నమోదు చేయాలన్నారు. రైతులు నీళ్ల కో సం ఇంకా ఎదురు చూస్తున్నారని, కనీసం గుం డారం రిజర్వాయర్ కూడా నింపలేదన్నారు. నీళ్లివ్వకుండా పంటలు ఎండబెడుతున్న కాంగ్రెస్కు ప్రజలు, రైతులు గుణపాఠం చెబుతారన్నారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్ సింగ్, కమాన్పూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్ పాల్గొన్నారు.