పెద్దపల్లి, మార్చి3 : ఆన్లైన్ ద్వారా మధ్యాహ్న భోజన చెల్లింపులకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా(Yogita Rana) తెలిపారు. సోమవారం హైదరాబాద్ నుంచి విద్యాశాఖ సంచాలకుల నరసింహారెడ్డితో కలిసి యోగితా రాణా మధ్యాహ్న భోజన పథకం బిల్లుల చెల్లింపుపై జిల్లా కలెక్టర్లు విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పెద్దపల్లి కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, డీఈవో డీ మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యాశాఖ కార్యదర్శి మాట్లాడుతూ.. ట్రెజరీ ద్వారా మధ్యాహ్న భోజన బిల్లుల చెల్లింపు ప్రక్రియ ఆలస్యం అవుతుందని, నేరుగా ఆన్లైన్ నుంచే మధ్యాహ్న భోజనం బిల్లులు చెల్లించేందుకు గల అవకాశాలను విద్యాశాఖ పరిశీలిస్తుందని తెలిపారు.
రాష్ట్రంలో ముందస్తుగా పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద ఆన్ లైన్ బిల్లులో చెల్లింపు ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. పెద్దపల్లి జిల్లాలో ఓ మండలాన్ని ఎంపిక చేసుకుని, నెల రోజుల పాటు ఆ మండలం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన బిల్లులను ఆన్లైన్ ద్వారా త్వరితగతిన చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు .పైలెట్ ప్రాజెక్టు నుంచి వచ్చే ఫలితాల ఆధారంగా రాష్ర్టవ్యాప్తంగా ఆన్లైన్ చెల్లింపులు చేయటానికి ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. వీసీలో కలెక్టర్, డీఈవోతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.