పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఇద్దరు విద్యార్థులు ఉక్రెయిన్ దేశంలో చిక్కుకున్నారు. వైద్య విద్యను అభ్యసించేందుకు అక్కడికి వెళ్లిన విద్యార్థులు అక్కడ ఎంబీబీఎస్ మూడవ సంవత్సరం చదువుతున్నారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధ భేరిని మోగించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు. వారిని ఇండియాకు తీసుకొచ్చేందుకు ఇండియన్ ఎంబసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
పెద్దపల్లి పట్టణంలోని మొఘల్పురకు చెందిన సయ్యద్ ఖదీర్ కుమారుడు సయ్యద్ ఖాలీద్ ఒమన్, సయ్యద్ ఈషాన్ కుమార్తె సహెర్ ఫాతీమా ఇద్దరు ఉక్రెయిన్లోని ఇవానో ఫ్రాన్కివిస్క్ అనే సిటీలో ఉన్న ఇవానో ఫ్రాన్కివిస్క్ యూనివర్శిటీలో ఎంబీబీఎస్ మూడవ సంవత్సరం చదువుతున్నారు. రష్యా ఉక్రెయిన్పై దాడులు నిర్వహిస్తుండడంతో వాళ్ల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వారిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఇండియన్ ఎంబసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎంబసీ అధికారులు విద్యార్థులకు ఫోన్ చేసి లగేజి సిద్ధం చేసుకోవాలని చెప్పారు. ఉక్రెయిన్ నుంచి ఇండియా వచ్చేందుకు విమాన ప్రయాణాలు నిలిచిపోవడంతో రోడ్డు మార్గం ద్వారా వారిని హంగేరి గానీ, పోలండ్కు గానీ పంపించి అక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో ఇండియాకు తీసుకురానున్నారు.
సహెర్ ఫాతిమా తండ్రి ఇషాన్ సౌదీలో ఉంటుండగా, తల్లి, చెల్లి ఇద్దరూ పెద్దపల్లిలో ఉంటున్నారు. అలాగే ఖాలీద్ ఒమన్ అమ్మా, నాన్న, తమ్ముడు, చెల్లెలు పెద్దపల్లిలోనే ఉంటున్నారు. రెండు, మూడు రోజుల్లో సదరు విద్యార్థులు పెద్దపల్లి పట్టణానికి చేరుకోనున్నారు. వారి రాక కోసం తల్లిదండ్రులు, బంధువులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.