రామగిరి, జూన్ 10 : నేటి యువత గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలకు బానిసలై తమ విలువైన భవిష్యత్తును, కుటుంబాల ఆనందాన్ని నాశనం చేసుకుంటున్నారని, మత్తు పదార్థాల రహిత సమాజాన్ని నిర్మించడంలో ప్రజలందరూ బాధ్యతగా పోలీస్ శాఖకు సహకరించాలని రామగిరి ఎస్ఐ తాడవేని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజాపాలన – 99 రోజుల ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా బుధవారం పెద్దపల్లి జిల్లా రత్నాపూర్ గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. ప్రస్తుతం సమాజంలో పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు, ముఖ్యంగా మహిళలు అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఆన్లైన్ మోసాలు, ఓటీపీలు, ఫేక్ ఇన్వెస్ట్మెంట్ లింకులు, సోషల్ మీడియా మోసాల ఉచ్చులో పడొద్దని సూచించారు. ఎలాంటి అనుమానాస్పద కాల్స్ లేదా లింక్లకు స్పందించవద్దని, ఒకవేళ ఎవరైనా సైబర్ మోసానికి గురైతే తక్షణమే పోలీసులను సంప్రదించాలని తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, నాలుగు చక్రాల వాహనదారులు సీటు బెల్ట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి ప్రమాదకర పనులు చేయవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుమన్, గ్రామ సర్పంచ్ పల్లె ప్రతిమ, తదితరులు పాల్గొన్నారు.