Manthani | మంథని, డిసెంబర్ 11 : తొలి విడుత పంచాయతీ ఎన్నికలు డివిజన్ పరిధిలో మంథని, ముత్తారం, రామగిరి, కమాన్పూర్ మండలాలతో పాటు పెద్దపల్లి నియోజకవర్గంలోని కాల్వశ్రీరాంపూర్ మండలాల్లో ప్రశాంతంగా జరుగుతున్నది. ఆయా మండల్లాల్లో ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ ఆయా మండలాల పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో 1,43,856 మంది ఓటర్లకు 75,412 తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
దాంతో 52.42 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు తెలిపారు. మంథనిలో 55.57 శాతం, కమాన్పూర్లో 53.80 శాతం, రామగిరిలో 49.94, ముత్తారంలో 44.95, కాల్వ శ్రీరాంపూర్లో 49.14 శాతం నమోదైందని తెలిపారు. మంథనిలోని గుంజపడుగు, నాగారం, చిల్లపల్లి పోలింగ్ కేంద్రాలను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సందర్శించారు. ఈ సందర్భంగా పోలింగ్ సరళి, క్యూ లైన్లు, బందోబస్తు తదితర అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసులతో పాటు ఎన్నికల సిబ్బందికి పలు సూచనలు చేశారు.