ఓదెల మార్చి3 : పెద్దపల్లి జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ఓదెల మల్లికార్జున స్వామి ఆలయాన్ని చంద్రగ్రహణం వలన మంగళవారం మూసివేశారు. మంగళవారం కేతు గ్రస్త చంద్రగ్రహణం ఉన్నందున స్వామివారి ప్రాతకాల నిత్య నిధి నిర్వహించి దేవాలయాన్ని ఉదయం ఎనిమిది గంటలకు అర్చకులు మూసివేశారు. మంగళవారం భక్తులకు ఆలయ దర్శనం ఉండదని పేర్కొన్నారు. తిరిగి బుధవారం ఉదయం 8 గంటలకు భక్తుల దర్శనానికి అనుమతించబడునని దేవాలయ ఈవో సదయ్య, ప్రధాన అర్చకుడు దూపం వీరభద్రయ్య, భవాని ప్రసాద్ పేర్కొన్నారు.
కాగా, నేడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాలను మూసివేశారు. వేములవాడ, యాదగిరిగుట్ట, భద్రాచలం, బాసర, కీసర సహా అన్ని ప్రధాన ఆలయాలతో పాటు చిన్న ఆలయాల్లో ప్రత్యేక పూజల అనంతరం మూసివేశారు. చంద్రగ్రహణం అనంతరం సాయంత్రం 7 గంటలకు సంప్రోక్షణ చేసి, తిరిగి ఆలయాలను తెరవనున్నారు.