Peddapalli : ‘ప్రజారోగ్యంతో చెలగాటం’ శీర్షికన జూన్14వ తేదీన నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన ప్రత్యేక కథనంపై అధికారులు స్పందించారు. పెద్దపల్లి జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్, మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు హోటళ్లు, రెస్టారెంట్లలో అకస్మిక తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్రమైన వాతావరణంలో ఆహార పదార్థాలు తయారు చేసి, విక్రయిస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు స్థానిక హోటళ్లు, రెస్టారెంట్లలోని పరిస్థితులను స్వయంగా పరిశీలించారు.
అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) నగర పాలక సంస్థ కమిషనర్ జె. అరుణ శ్రీ ఆదేశాలననుసరించి ప్రజారోగ్య విభాగం అధికారులు సోమవారం నగరంలోని వివిధ బేకరీలు, రెస్టారెంట్లలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా దసరా దావత్ కిచెన్, అన్ లిమిటెడ్ , బేకర్స్ డిలైట్ షాపులకు రూ 2,000/- చొప్పున జరిమానా విధించారు. ఈ తనిఖీల్లో నగర పాలక సంస్థ శానిటరీ ఇన్స్పెక్టర్లు సంపత్ కుమార్, నాగ భూషణం, వార్డు ఆఫీసర్ రామకృష్ణ, పర్యావరణ ఇంజనీర్ మధుకర్, ఎంఐఎస్ ఆపరేటర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
