పెద్దపల్లి : కేంద్రం యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయమని చెప్పినా రైతులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన సీఎం కేసీఆర్ చిత్రపటానికి రైతులు ధాన్యాభిషేకం చేశారు. రైతు అభివృద్ధి ప్రదాత, ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి వినూత్న రీతిలో ధాన్యంతో అభిషేకం నిర్వహించారు. సోమవారం పెద్దపల్లి మండలం గౌరెడ్డిపేట గ్రామంలో పీఏసీఎస్ ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కేసీఆర్ చిత్రపటానికి ధాన్యాభిషేకం చేసి కేసీఆర్ రైతుల కోసం చేస్తున్న సేవలను కొనియాడారు. దేశంలోనే రైతుల కోసం ఆలోచన చేసే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని గుర్తుచేశారు. కార్యక్రమంలో ఎంపీపీ బండారి స్రవంతి, జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, పీఏసీఎస్ చైర్మెన్ మాదిరెడ్డి నరసింహా రెడ్డి, యూత్ మండలాధ్యక్షుడు కొయ్యడ విక్రమ్, సర్పంచ్ కొమ్ము శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.