పెద్దపల్లి, మార్చి (నమస్తే తెలంగాణ): యాసంగి మార్కెటింగ్ సీజన్లో నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలను తూచా తప్పకుండా పాటిస్తూ మద్దతు ధర పై వరి పంట కొనుగోలుకు సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష (Collector Sriharsha)అన్నారు. గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ధాన్యం కొనుగోలు సన్నాహక సమావేశంలోఅదనపు కలెక్టర్ డి.వేణు లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. యాసంగి మార్కెటింగ్ సీజన్ 2024-25లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చివరి గింజ వరకు నాణ్యమైన వడ్లను మద్దతు ధరపై కొనుగోలు చేసి 48 గంటల్లో చెల్లింపులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
పెద్దపల్లి జిల్లాలో 4.5 లక్షల మెట్రిక్ టన్నుల వరకు కొనుగోలు చేసే అవకాశం ఉందని, దీనికి తగ్గట్టుగానే అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో అవసరమైన మేర కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, కొనుగోలు కేంద్రాల జాబితా, ఇంచార్జీలను ఫైనల్ చేసి మార్చి 3వ వారంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన టార్ఫాలిన్, తేమ యంత్రాలు, వెయింగ్ యంత్రాలు గన్నీ బ్యాగులు.. మొదలగు సామగ్రికి సంబంధించి నివేదిక అందించాలని ఆదేశించారు.
మార్కెటింగ్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన సామగ్రి కొనుగోలు కేంద్రాల వద్ద ఏర్పాటు చేయాలని సూచించారు. రైస్ మిల్లుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తాలు కట్ చేయడానికి వీలు లేదని, నాణ్యతను కొనుగోలు కేంద్రాల దగ్గరే పరిశీలించి పంపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ డీఎం శ్రీకాంత్, మార్కెటింగ్ అధికారి ప్రవీణ్, జిల్లా సహకార అధికారి శ్రీమాల, జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి రాజేందర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.