Collector Koya Sriharsha | ఓదెల, జులై 3 : ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా కొలనూరు లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అక్కడ పేద ప్రజలకు అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తు మేరకు కొమిరె గ్రామంలో భూ సమస్యను పరిశీలించారు. ఓదెలలో నూతనంగా నిర్మితమవుతున్న తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి పనులు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ పనులు వారం రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఓదెలలో అద్దె భవనంలో కొనసాగుతున్న జూనియర్ సివిల్ కోర్టు కోసం నిరుపయోగంగా ఉన్న ఐకేపీ భవనాన్ని పరిశీలించారు. ఈ భవనాన్ని మరమ్మతులు చేయించి కోర్టు ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నారు. అనంతరం మండల పరిషత్, తహసీల్దార్ కార్యాలయాల్లో అధికారులతో సమావేశమై పాలనాపరమైన అంశాలను చర్చించి తగు సూచనలు చేశారు. ఆయన వెంట తహసీల్దార్ వనజా నాయక్, ఎంపీడీవో వెన్నపురెడ్డి అనిల్ రెడ్డి, పీఆర్డీఈ పద్మ, ఏఈ సచిన్, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.