పెగడపల్లి, ఏప్రిల్ 13: ‘కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చింది. నాలుగు నెలల పాలనలో అరకొర పథకాలు అమలు చేసి, అసలు స్కీంలను గాలికొదిలేసింది. ఆ పార్టీని నమ్మితే నిండా మునుగుడే. మళ్లీ మోసపోవద్దు’ అని ప్రజలకు పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ సూచించారు. శనివారం పెగడపల్లి మండల కేంద్రంలో ప్రచారం నిర్వహించి, ఆయన మాట్లాడారు. ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, రెండు, మూడు పథకాలను మాత్రమే అరకొరగా అమలు చేస్తూ కాలయాపన చేస్తున్నదని దుయ్యబట్టారు. రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు సాయం, వరి పంటకు బోనస్, మహిళలకు ఆర్థిక సాయం, పెన్షన్ల పెంపు వంటి అనేక హామీలను తుంగలో తొక్కిందని విమర్శించారు.
కాంగ్రెస్ నాయకులు ఓటు అడిగే హక్కు కోల్పోయారని, ఓట్లడిగేందుకు వస్తే ప్రజలు తరిమికొట్టే పరిస్థితి నెలకొన్నదని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో కరోనా సమయంలోనూ తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ రైతుబంధు, పెన్షన్లను నిరంతరాయంగా పంపిణీ చేశారని, సంక్షేమ పథకాలు ఎప్పుడూ ఆగలేదని తాగు, సాగు నీటికి కొరత లేకుండా బీఆర్ఎస్ పాలన కొనసాగిందన్నారు. వచ్చే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని, ప్రజల కోసం పోరాడే బీఆర్ఎస్కు ఓటేసి పెద్దపల్లి ఎంపీగా తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఆయన వెంట పెగడపల్లి, నంచర్ల విండో చైర్మన్లు వోరుగంటి రమణారావు, మంత్రి వేణుగోపాల్, వైస్ ఎంపీపీ గాజుల గంగాధర్, పార్టీ నాయకులు సురెందర్రెడ్డి, నరెందర్రెడ్డి, వెంకన్న, రాజేశ్వర్రావు, కరుణాకర్రావు, ఆనందం, మోహన్రెడ్డి, రాజిరెడ్డి, శ్రీనివాసరావు, స్వామి, సంతోష్, రాజశేఖర్, లోకేశ్, ఆంజనేయులు, రహీం, తిరుపతి, లక్ష్మీనారాయణ, సత్యనారాయణరెడ్డి, రఘునందన్, షకీల్, సంజీవరెడ్డి, జానీలక్ష్మణ్, శ్రీనివాస్, కరుణాకర్, మహెందర్, గంగాధర్, చెంద్రారెడ్డి, కనకయ్య, లక్ష్మణ్, భాస్కర్ ఉన్నారు
యాసంగి కోతలు ముమ్మరమైనయ్. అయినా గ్రామాల్లో ధాన్యం కొనుగోళ్లు ఎందుకు ప్రారంభించడం లేదు. వాతావరణ పరిస్థితుల్లో మార్పులతో రైతులు భయపడుతున్నరు. దిక్కుతోచని స్థితిలో దళారులకు క్వింటాల్ 1700 నుంచి 1800కే ధాన్యాన్ని విక్రయిస్తున్నరు. వెంటనే ప్రభుత్వం స్పందించాలి. రైతులకు నష్టం లేకుండా వెంటనే ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి. వరికి 500 బోనస్ ఇవ్వాలి.
– పెగడపల్లిలో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం కొప్పుల ఈశ్వర్