బెజ్జంకి, నవంబర్ 6: అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని పార్టీ మానకొండూర్ అభ్యర్థి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రజలను కోరారు. మండలంలోని దేవక్కపల్లి, తోటపల్లి, వీరాపూర్, గూడెం, బేగంపేట, వడ్లూర్, తలారివానిపల్లి గ్రామాల్లో సోమవారం రోడ్ షో ద్వారా ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యాభై ఏండ్లలో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదని విమర్శించారు. ఆ పార్టీపై ప్రజల్లో నమ్మకం లేకే ఆరు గ్యారంటీల పేరుతో మోసం చేసేందుకు కుట్ర చేస్తున్నదన్నారు. కాంగ్రెస్ పాలనలో కేవలం రూ.200 పింఛన్ ఇచ్చేవారని, అది కూడా ఎవరైనా పింఛన్దారు చనిపోతేనే మరొకరికి వచ్చే అవకాశం ఉండేదని గుర్తు చేశారు. కానీ, నేడు బీఆర్ఎస్ ప్రభుత్వం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఆసరా పింఛన్ ఇచ్చి ఆదుకుంటున్నదన్నారు.
నాడు కరువు పరిస్థితులతో వేసిన పంటలు ఎండి ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, అలాగే బతుకుదెరువు కోసం అనేక మంది వలస పోయారని పేర్కొన్నారు. కానీ నేడు ఇతర దేశాలు, ప్రాంతాల్లో స్థిరపడ్డవారు సైతం స్వగ్రామానికి వచ్చి ఆత్మగౌరవంతో తెలంగాణలో బతుకుతున్నారని తెలిపారు. నాడు ఆడబిడ్డ పెళ్లికి ఏ ప్రభుత్వం సైతం ఏకాణా సాయం చేయలేదని, నేడు పేదింటి ఆడబిడ్డల తల్లిదండ్రుల ఇబ్బందులు తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా రూ.లక్ష ఆర్థిక సాయం అందించి అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా రైతులు సాగునీటి కష్టాలు తీర్చేందుకు ప్రాజెక్ట్లు నిర్మించారని, పంట పెట్టుబడి సాయం అందిస్తూ వ్యవసాయాభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చాక అందించే పథకాలు వివరించారు.
ప్రజలు కాంగ్రెస్, బీజేపీ పార్టీలను నమ్మి ఆగంకావద్దని, దూరదృష్టితో దేశం గర్వించేలా రాష్ర్టాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న బీఆర్ఎస్ పార్టీకే 30 తేదీన ఓటు వేయాలని కోరారు. అనంతరం పలు గ్రామాల్లో వివిధ పార్టీలకు చెందిన యువకులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరగా, ఎమ్మెల్యే వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా ఆయా గ్రామాలకు ప్రచారానికి వచ్చిన రసమయి బాలకిషన్కు డప్పు చప్పుళ్లు, కోలాటాల మధ్య మహిళలు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. కార్యక్రమాల్లో ఎంపీపీ లింగాల నిర్మల, జడ్పీటీసీ కనగండ్ల కవిత, పార్టీ మండలాధ్యక్షుడు మహిపాల్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ చంద్రకళ, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.