అది తిమ్మాపూర్ మండలం పర్లపల్లి. అది ప్రగతిఎరుగని పల్లె. ఎవరైనా కొత్తవారు ఊళ్లోకొస్తే గతుకులతో కూడిన ఇరుకైన రోడ్లు, మొండిగోడల ఇండ్లు, ఎటుచూసినా చెత్తాచెదారంతో కంపుకొడుతూ మురికికూపంగా.. అధ్వానంగా కనిపించేది. కనీసం తాగేందుకు మంచినీళ్లు కూడా దొరకని దౌర్భాగ్య పరిస్థితుల్లో అల్లాడింది. ఏండ్లపాటు కష్టాలు, కన్నీళ్ల మధ్యే బతుకీడ్చింది. కానీ, స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కారు ప్రోత్సాహం, సర్పంచ్ మాదాడి భారతి ప్రత్యేక కృషితో జిగేల్మంటున్నది. విశాలమైన రోడ్లు.. రెండు వరుసల డివైడర్లు.. మధ్యలో అందమైన పూల మొక్కలు.. ఇరువైపులా అండర్గ్రౌండ్ డ్రైనేజీలు.. ఫుట్పాత్లు.. రోడ్ల పక్కన అవెన్యూ ప్లాంటేషన్, సెంట్రల్ లైటింగ్ సిస్టం, చీమచిటుక్కుమన్నా తెలిసేలా వీధివీధినా సీసీ కెమెరాలు.. ఇలా సకల సౌకర్యాలు.. తీరొక్క వసతులతో ప్రగతికి చిహ్నంగా.. పనితీరుకు కొలమానంగా నిలుస్తున్నది. ఇవే కాదు, కార్పొరేట్ను తలదన్నేలా పాలనాభవనం, దాని పక్కనే రైతు వేదిక, ఆహ్లాదానికి చిల్డ్రన్స్ పార్కు, ప్రైవేట్కు దీటుగా రూపుదిద్దుకుంటున్న పాఠశాలలు.. ఇలా గ్రామంలో ఎక్కడ చూసినా పది తరాలకు ఉపయోగపడేలా పనులతో పల్లె ప్రగతి స్ఫూర్తిని అందిపుచ్చుకొని ఇస్మార్ట్ పల్లెగా అవతరించింది. జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు సాధిస్తూ రాష్ట్రంలోని అనేక పల్లెలకు మోడల్గా నిలుస్తూ అభివృద్ధికి నమూనాగా మారిపోయింది.
– కరీంనగర్, జూలై 1 (నమస్తే తెలంగాణ)
కరీంనగర్, జూలై 1 (నమస్తే తెలంగాణ): విశాలమైన రోడ్లు.. రెండు వరుసల డివైడర్లు.. మధ్యలో అందమైన పూల మొక్కలు.. ఇరువైపులా అండర్గ్రౌండ్ డ్రైనేజీలు.. పుట్పాత్లు.. రోడ్ల పక్కన అవెన్యూ ప్లాంటేషన్, సెంట్రల్ లైటింగ్ సిస్టం, చీమచిటుక్కుమన్నా తెలిసేలా వీధివీధినా సీసీ కెమెరాలు.. ఇలా సకల సౌకర్యాలు.. తీరొక్క వసతులతో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామం జిగేల్మంటున్నది. స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కారు ప్రోత్సాహం, సర్పంచ్ మాదాడి భారతి ప్రత్యేక కృషితో ప్రగతికి చిహ్నంగా.. పనితీరుకు కొలమానంగా నిలుస్తున్నది. ఇవే కాదు, కార్పొరేట్ను తలదన్నేలా పాలనాభవనం, దాని పక్కనే రైతు వేదిక, ఆహ్లాదానికి చిల్డ్రన్స్ పార్కు, ప్రైవేట్కు దీటుగా రూపుదిద్దుకుంటున్న పాఠశాలలు.. ఇలా గ్రామంలో ఎక్కడ చూసినా పది తరాలకు ఉపయోగపడేలా పక్కా ప్రణాళికతో చేసిన అభివృద్ధి స్మార్ట్సిటీని మరిపిస్తున్నది. ఒకప్పుడు మారుమూల కుగ్రామంగా, ఇరుకైన రోడ్లు, కూలిన డ్రైనేజీలతో మురుగు కూపాన్ని తలపించిన ఊరు, పల్లె ప్రగతి స్ఫూర్తితో ఆదర్శ గ్రామంగా నిలుస్తున్నది.
చూడ ముచ్చటైన డివైడర్లు
ఈ చిత్రంలో కనిపిస్తున్న డివైడర్ గ్రామ పంచాయతీ, రైతు వేదిక ముందు నుంచి వెళ్లే ప్రధాన రోడ్డుకు సంబంధించినది. ఇక్కడ ఉన్నట్లే గ్రామంలోని ప్రధాన రోడ్ల మధ్యన నిర్మించిన డివైడర్లు కనిపిస్తాయి. వాటి మధ్యన ఏపుగా ఎదిగిన చెట్లు రోడ్లకు పచ్చదనం పంచుతుంటే వాటిపై రకరకాల డిజైన్లతో వేసిన ముగ్గులు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ప్రభుత్వ పాఠశాల నుంచి వెళ్లే ప్రధాన రోడ్డులో ఈ ముగ్గులు చూసేవారిని ఇట్టే ఆకట్టుకుంటాయి. సింగిల్ రోడ్లలో కూడా ఇలాంటి ముగ్గులే గ్రామీణ వాతావరణానికి అద్దం పడుతున్నాయి.
ఇప్పటికే 30 కోట్లతో అభివృద్ధి
సర్పంచ్ మాదాడి భారతి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటికే అనేక రకాల నిధులు, గ్రాంట్లు తెచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేశారు. ఐదేళ్లలో సుమారు 30 కోట్ల దాకా ఖర్చు చేసినట్లు ఆమె చెబుతున్నారు. ఎస్డీఎఫ్ కింద 10 కోట్లు, సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రత్యేకంగా 5 కోట్లు, సీడీఎఫ్ కింద 5 కోట్లు, ఎంపీ లాడ్స్ 5 కోట్లు, ఇతర గ్రాంట్ల కింద మరో 5 కోట్లకుపైగా నిధులు వెచ్చించి గ్రామాన్ని అభివృద్ధి చేసినట్లు సర్పంచ్ తెలిపారు. అంతే కాకుండా నుస్తులాపూర్ నుంచి పర్లపల్లి మీదుగా మొగిలిపాలెం దాకా డబుల్ రోడ్ నిర్మాణానికి ఐదేళ్ల కింద 14 కోట్ల్లు మంజూరు చేయించారు. దేవాలయాలు, చర్చి, మసీదు నిర్మాణానికి కూడా నిధులు కేటాయించారు. అంబేద్కర్ భవనానికి 25 లక్షలు వచ్చాయి. గ్రామంలో అందరికీ ఉపయోగపడేలా మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ను నిర్మిస్తున్నారు. గ్రామంలో 80 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీలో మానిటరింగ్ సిస్టంను ఏర్పాటు చేస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా వీటిని ప్రారంభించేందుకు సర్పంచ్ ప్రయత్నాలు చేస్తున్నారు.
పాఠశాలల్లో ఆహ్లాదం .. ఓపెన్ జిమ్
గ్రామంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, జిల్లా ప్రజా పరిషత్తు పాఠశాలు, అంగన్వాడీ కేంద్రాలనూ అందంగా ముస్తాబు చేశారు. ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలను చూస్తే ముచ్చటేస్తుంది. ‘మన ఊరు మన బడి’ కింద దీనిని అభివృద్ధి చేశారు. 130 మందికి పైగా పిల్లలు ఉన్న బడిని సుందరంగా తీర్చిదిద్దారు. జడ్పీ హైస్కూల్ పరిసరాలు కూడా పూర్తిగా మార్చేశారు. శిథిలమైన పాత భవనాన్ని తొలగించి కొత్తగా నిర్మిస్తున్నారు. పాఠశాలలో అందమైన గార్డెన్ను నిర్మించారు. ఇదే పాఠశాల ఆవరణలో యువకుల కోసం ఒక ఓపెన్ జిమ్ను కూడా ఏర్పాటు చేశారు.
అవార్డుల పంట
ఒకప్పుడు కుగ్రామంగా ఉన్న పర్లపల్లి గ్రామం ఇపుడు రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. దేశంలోని గ్రామ పంచాయతీలతో పోటీ పడుతూ వరుసగా అవార్డులు సాధిస్తోంది. 2020లో మొదలైన ఈ పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. 2020లో జిల్లా స్థాయి ఉత్తమ పంచాయతీగా ఎంపికైంది. 2021లో జాతీయ స్థాయిలో అందించే దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారానికి ఎంపికైంది. 2022లో రాష్ట్ర స్థాయి ఉత్తమ పంచాయతీగా ఎంపికైంది. 2023లో జాతీయ స్థాయిలో ఇచ్చిన 9 తీమ్స్లో పోటీపడి రాష్ట్ర స్థాయిలో 5 విభాగాల్లో ఉత్తమ ఫలితాలు చూపింది. సాలిడ్ అండ్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద రాష్ట్రంలోని మూడు మున్సిపాలిటీలతోపాటు పర్లపల్లికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ అవార్డును అందించింది. క్లీన్ అండ్ గ్రీన్ కింద మరో రాష్ట్ర స్థాయి అవార్డును ఈ ఏడాదిలో సాధించి పర్లపల్లి గ్రామం రికార్డు నెలకొల్పింది.
సెంట్రల్ లైటింగ్ సిస్టం స్పెషల్ అట్రాక్షన్
గ్రామంలోని ప్రధాన రోడ్లలో మొత్తం సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేశారు. అన్నింటికీ ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేశారు. జంక్షన్ల వద్ద మాత్రం హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేశారు. రాత్రిళ్లు ఈ లైట్లు జిగేల్మని వెలుగడం చూస్తే ఇది ఒక పల్లె అని ఎవరూ అనరు. పక్కా పట్టణం అనే నిర్ధారించుకుంటారు. ఇలా ఊరంతా ఇప్పటికే 389 లైట్లు ఏర్పాటు చేసుకున్నారు.
ఇది పల్లె ప్రకృతి వనం
పర్లపల్లిలోని ఈ పల్లె ప్రకృతి వనం ఎంతో విశాలంగా నిర్మించారు. ఇందులో దాదాపు 4 వేల మొక్కలు పెంచారు. వీటిని సర్పంచ్ భారతి రూ.20 లక్షలు తన సొంత డబ్బులు వెచ్చించి తూర్పుగోదావరి జిల్లా కడియం నుంచి తెప్పించారు. ఇది పల్లె ప్రకృతి వనంలా లేదు. ఒక అందమైన పార్కులా ఉంది. ఇక్కడ ప్రత్యేకంగా చిల్ట్రన్ పార్క్ కూడా ఏర్పాటు చేశారు. ఊరికి చేరువలో ఉన్న ఈ పార్క్కు పిల్లా పాపలతో గ్రామస్తులు వచ్చి సేద తీరిపోవడం ప్రారంభించారు. పిల్లలు కూడా ఇక్కడ ఆడుకోవడానికి ఇష్టపడుతున్నారు.
ఇలాంటి ఐదు జంక్షన్లు..
పర్లపల్లిలో రోడ్లనే కాదు. చిన్న చిన్న చౌరస్తాలను విశాలమైన జంక్షన్లుగా మార్చేశారు. ఇక్కడ చూస్తున్నది గ్రామంలో అడుగు పెట్టగానే కనిపించే ప్రధాన జంక్షన్. ఇది జడ్పీ పాఠశాలను అనుకొని ఉంటుంది. ఇక్కడ గ్రామంలోని శివాలయం నుంచి వచ్చే ప్రధాన రోడ్డు, గ్రామంలోకి ప్రవేశించే రోడ్డు, అక్కడి నుంచి దుబ్బపల్లికి, అక్కడి నుంచి మొగిలిపాలెం వెళ్లే ప్రధాన రోడ్డు ఇక్కడ కలుస్తాయి. ఈ జంక్షన్ను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. పక్కనే గ్రామానికి తాగు నీరు అందించే బావి ఉంటుంది. దాని చుట్టూ సీసీ గోడ నిర్మించారు. దాని పక్కనే పంప్ హౌస్ నిర్మాణం కనిపిస్తుంది. ఇక్కడ అడుగు పెట్టగానే ఒక గ్రామంలో కాకుండా ఒక పట్టణంలో అడుగుపెట్టిన భావన కలుగుతుంది. ఇలాంటి జంక్షన్లు గ్రామంలో ఐదింటిని డెవలప్ చేస్తున్నారు. ఇప్పటికే మూడు జంక్షన్ల పనులు పూర్తయ్యాయి.
గ్రామ పంచాయతీ కార్యాలయం , రైతు వేదిక
పర్లపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం ఒక కార్పొరేట్ ఆఫీసును తలదన్నేలా నిర్మించారు. గ్రామం మధ్యలో ఉన్న ప్రభుత్వ భూమిలో నిర్మించిన ఈ కార్యాలయంలో సర్పంచు గది, పంచాయతీ కార్యదర్శి గది, కారోబార్, సిబ్బంది గది, విజిటర్స్ హాల్తోపాటు సమావేశ మందిరం దేనికదే నిర్మించారు. ఏ గ్రామంలో చూసినా రైతు వేదికలు గ్రామ శివారులో కనిపిస్తాయి. కానీ పర్లపల్లిలో ప్రాధాన్యత ఇచ్చి గ్రామ పంచాయతీ పక్కనే నిర్మించారు. అటు గ్రామ పంచాయతీ, ఇటు రైతువేదిక భవనం, వాటిలో గార్డెనింగ్, పూల మొక్కలు చూస్తే పరిసరాలు ఎంతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. అంతే కాకుండా ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి ఒక ఇంకుడు గుంత నిర్మించి, బాధ్యతగా మెయింటెన్ చేస్తున్నారు.
సీసీ కెమెరాలతో నిరంతర నిఘా
గ్రామంలోని రోడ్లపై, జంక్షన్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దీంతో గ్రామంలో ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగినా ఈ కెమెరాల్లో నిక్షిప్తం అవుతోంది. ప్రతి జంక్షన్లో నాలుగు నుంచి ఆరు కెమెరాలు ఏర్పాటు చేశారు. చుట్టు పక్కల పరిసరాలన్నీ కవరయ్యేలా వీటి ఏర్పాటు ఉంది. కొద్ది రోజుల్లో మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు సర్పంచ్ భారతి తెలిపారు.
ప్రతి పనికి పక్కా ప్రణాళిక..
పర్లపల్లిలోని ఈ రోడ్డును చూశారా..? ఒకప్పుడు చింత చెట్ల కింది నుంచి వెళ్లే చిన్న బాట. దీనిని ప్రధాన రోడ్డుగా మార్చేందుకు స్థానిక సర్పంచ్ మాదాడి భారతి, పాలకవర్గం అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చింది. చెట్లు తొలగించి రోడ్డును వెడల్పు చేయడంతో పాటు మీటర్ కంటే ఎత్తు రోడ్డును లేపి ఇరువైపులా రిటర్నింగ్ వాల్స్ నిర్మించారు. జడ్పీ పాఠశాల జంక్షన్ నుంచి గ్రామానికి వెళ్లే ప్రధాన రోడ్లలో దీనిని ఒకదానిగా మార్చారు. అపుడు చిన్న బాటగా ఉన్నపుడు చూసిన వాళ్లు, ఇపుడు 60 అడుగుల రోడ్డుగా అభివృద్ధి చేసిన తర్వాత చూస్తే ఆశ్చర్య పోకుండా ఉండరు. మీటరు కంటే ఎత్తుగా రిటర్నింగ్ వాల్, అందులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు, పలు డ్రైనేజీలు కలిసే చోట అండర్ గ్రౌండ్లోనే ఏర్పాటు చేస్తున్న జంక్షన్లు ప్రతిది పక్కా ప్రణాళికతో పట్టణాలకు ధీటుగా తీర్చిదిద్దుతున్నారు.
పర్యావరణానికి ప్రాధాన్యత
గ్రామంలో అవెన్యూ ప్లాంటేషన్తో పర్యావరణానికి ప్రాధాన్యత ఇచ్చారు. హరితహారంలో భాగంగా రోడ్లకు ఇరువైపులా చెట్లు నాటడమే కాదు. వాటిని సంరక్షించడంలో పర్లపల్లి పంచాయతీ శ్రద్ద చూపింది. రెండు, మూడేళ్ల కింద నాటిన మొక్కలు ఇపుడు ఏపుగా పెరిగి చెట్లు, వృక్షాలుగా మారుతున్నాయి. ఊరిలో ఇప్పటి వరకు 20 వేలకుపైగా మొక్కలను బతికించి వాటిని సంరక్షిస్తున్నారు. దీనికి తోడు గ్రామంలోని రోడ్ల వెంట రకరకాల పూల మొక్కలు నాటారు. ఇవి రోడ్లకు మరింత అందాన్ని తెచ్చాయి.
కేసీఆర్ సార్ ప్రోత్సాహంతోనే అభివృద్ధి
సీఎం కేసీఆర్ సార్ ప్రోత్సాహంతోనే మా గ్రామం అభివృద్ధి చెందింది. ఇంకా చాలా పనులు చేయాల్సి ఉంది. సీఎం కేసీఆర్ సార్ ప్రవేశ పెట్టిన పల్లె ప్రగతి మాకు స్ఫూర్తినిచ్చింది. ఏ పని చేసినా పది తరాలకు ఉపయోగపడాలని చేశాం. పనిలో ఎక్కడా రాజీ పడలేదు. మా గ్రామాభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్ సార్కు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్కు ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు. ఐదేళ్లలో జరిగిన అభివృద్ధిపై నేనేంతో సంతృప్తిగా ఉన్నా. నాకు సహకరించిన మా పాలకవర్గ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, ముఖ్యంగా గ్రామ ప్రజలందరికీ నా కృతజ్ఞతలు. మా గ్రామాన్ని నమూనాగా తీసుకుని అన్ని గ్రామాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్న.
– మాదిడి భారతి, పర్లపల్లి సర్పంచ్
మంచి పనులు చేస్తున్నరు
మా ఊరు ఒకప్పుడు ఎట్లుండే. ఇపుడెట్లయ్యింది. చానా మంచి పనులు చేత్తండ్రు. నా ఎర్కల ఇసోంటి పనులు చేసినోళ్లను చూడలే. మా సర్పంచ్, ఆమె కొడుకు మా ఊరికి చానా మంచి పనులు చేస్తున్నరు. ఇన్ని ఊళ్లల్ల పనులు జరుగుతున్నయ్. ఇట్లున్నయా. నాకైతే మంచిగ నచ్చింది. ఎంతో మంది సర్పంచులు పేరు కోసం పనులు చేత్తరు. ఇప్పటి మా సర్పంచి ఊరు కోసం పని చేత్తున్నరు. రోడ్లు మంచిగ చేసిండ్రు. చెట్టు పెట్టిండ్రు, లైట్లేసిండ్రు.
– బాడిగె కనుకయ్య, గ్రామస్తుడు
ఊరు పునర్నిర్మాణం జరిగింది
మా ఊరు పునర్నిర్మాణం జరిగింది. ఇది నిజం. ఏ ఊళ్లె చూసినా ఉన్న రోడ్డు మీదనే రోడ్డేస్తరు. దాని మందమే మోరీలు కడ్తరు. కానీ మా ఊళ్లె అట్లగాకుంట ముందుగా రోడ్లు వెడల్పు చేసిండ్రు. దీని కోసం గ్రామస్తులను ఒప్పించిండ్రు. రోడ్లు వెడల్పు చేసుడే కాకుండా మస్తు ఎత్తు లేపిండ్రు. దాని మీద సీసీ పోసిండ్రు. అంతకుముందు ఒక్క రోడు సక్కగ ఉండక పోయేది. వాన గొడితే నీళ్లు ఇండ్లళ్లకే వచ్చేటిది. ఇపుడు రోడ్లు పోసుడే కాదు. రెండు దిక్కుల మోరీలు కట్టిండ్రు. అండర్ గ్రౌండ్ చేసిండ్రు. వానవడితే ఎన్ని నీళ్లచ్చినా మోరీలల్లనే బైటికి పోవాలే. గట్ల చేసిండ్రు. లైట్లు, చెట్లు డివైడర్లు, సీసీ కెమెరాలు మస్తు చేసిండ్రు. మా ఊరు ఊరు లెక్కలేదు. పట్నం లెక్కున్నది.
– రావ రాజు, గ్రామస్తుడు
చెట్లు రోడ్లు మంచి గున్నయి..
పర్లపల్లి అంటే ఒకప్పుడు ఎవలూ పట్టించుకోక పోయొటిది. ఇపుడు అందరు మా ఊరినే చూసి నేర్సుకుంటున్నరు. ఈ ఐదేళ్లల్ల చానా ఊళ్లల్ల పనులు జరిగినయ్. కానీ మా ఊరు లెక్క పనులు ఎక్కడా జరగలే. ఏది చేసినా ప్రజలకు ఉపయోగపడేలా చేసిండ్రు. ఇంకా 50 ఏండ్లు పోయినా ఈ పనులు ఇట్లనే ఉంటయ్. మా ఊరికి వచ్చినోళ్లంతా రోడ్లు మంచిగున్నయ్, చెట్లు మంచిగున్నయని అంటున్నరు. మాది పర్లపల్లి అయినందుకు గర్వపడుతున్నం.
– ఈరెల్ల సరోజన, గ్రామస్తురాలు