పల్లె, పట్టణ సఫాయిలు సంబురపడుతున్నారు. పగలనకా.. రాత్రనకా పనిచేస్తూ పల్లె, పట్టణాల స్వచ్ఛతకు పాటుపడుతున్న పారిశుధ్య కార్మికులకు మేడే కానుకగా సీఎం కేసీఆర్ రూ. వెయ్యి వేతనం పెంచుతున్నట్లు ప్రకటించగా, మురిసిపోతున్నారు. గత ప్రభుత్వాలు ఎన్ని ఉద్యమాలు చేసినా కనీస కనికరం చూపలేదని, కానీ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని కొనియాడుతున్నారు. తాజా పెంపుతో కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 9100 మందికి లబ్ధి కలుగుతుండగా, వారంతా మంగళవారం సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు చాటారు.
– కరీంనగర్, మే 2 (నమస్తే తెలంగాణ)/ కార్పొరేషన్
కరీంనగర్, మే 2 (నమస్తే తెలంగాణ)/ కార్పొరేషన్: గ్రామాల్లో పొద్దున ఊరు నిద్ర లేవక ముందే పల్లె, పట్టణాల్లో పారిశుధ్య సిబ్బంది విధులు మొదలవుతాయి. రోడ్లు, మురుగు కాలువలు శుభ్రం చేస్తూ, నిత్యం దుర్గంధాన్ని భరిస్తూ కనిపిస్తుంటారు. వీళ్లు పనిచేస్తేనే గ్రామీణ, పట్టణ వ్యవస్థలు ప్రజలకు ఆరోగ్యకర వాతావరణం అందుతుంది. ఇన్ని సేవలు అందిస్తున్న వీరిని గత ప్రభుత్వాలు అస్సలు గుర్తించలేదు. ఏండ్ల తరబడి చాకిరీ చేసినా నెలకు కనీస వేతనం అందేదికాదు. ఈ క్రమంలోనే వీరి కోసం గతంలో ఏ ప్రభుత్వం తీసుకోలేని నిర్ణయాలను కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటోంది. పంచాయతీ కార్మికులకు రూ.8,500 వేతనం ఉండగా, మునిసిపాలిటీలో సిబ్బందికి రూ.15,500 వేతనం అందజేస్తున్నారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో ప్రతి కార్మికుడికి మరో రూ. వెయ్యి వేతనం పెరుగనుండగా, కుటుంబాల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
ఆనందహేల
చొప్పదండి/కోల్సిటీ, మే2: పారిశుధ్య కార్మికులు సంబురపడుతున్నారు. సీఎం కేసీఆర్ మేడే కానుకగా పారిశుధ్య కార్మికులకు రూ.వెయ్యి వేతనం పెంచడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఊరూరా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తూ కృతజ్ఞతలు చాటుతున్నారు. కరీంనగరంలోని టవర్సర్కిల్ వద్ద బీఆర్ఎస్ నాయకుడు సోహన్సింగ్ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. చొప్పదండి మున్సిపాలిటీ కార్యాలయంలో పారిశుధ్య కార్మికులు, మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రామగుండం మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మిక సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చిత్రపటానికి, ధర్మపురి మున్సిపల్ కార్యాలయ ఆవరణలో సీఎం కేసీఆర్, మంత్రి ఈశ్వర్ చిత్రపటాలకు ధర్మపురి మున్సిపల్ పారిశుధ్య కార్మికులు, మెట్పల్లి పాత బస్టాండ్ వద్ద సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే విద్యాసాగర్రావు చిత్రపటాలతో కూడిన ప్లెక్సీకి పాలాభిషేకం చేశారు.
రూ. 3వేల నుంచి రూ.17వేలు అయింది
నేను పదేళ్లుగా కోరుట్ల మున్సిపాలిటీల పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్న. నాకు మొదట్ల రూ.3 వేల జీతం వస్తుండె. అవి ఏ మూలకూ సరిపోకపోతుండె. కుటుంబం గడుసుడే చానా కష్టమైతుండె. అప్పటి ప్రభుత్వాలు ఎన్ని పోరాటాలు చేసినా జీతం పెంచకపోతుండె. కానీ ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం వచ్చిందో మా కష్టాలు ఒక్కొక్కటిగా తీరినయ్. సీఎం కేసీఆర్ సార్ మా కష్టాన్ని గుర్తించి ఎప్పటికప్పుడు జీతాలు పెంచుతున్నడు. ఈ రోజు నా జీతం నెలకు రూ.17 వేల దాకా పెరిగిందంటే అది సార్ దయతోనే. మేడే పండుగ నాడు రూ. వెయ్యి జీతం పెంచారంటే మా కష్టానికి తగిన ఫలితంగా అనుకుంటున్నం. మాకు అండగా నిలుస్తూ, బతుకులకు భరోసా కల్పిస్తున్న సార్కు మేమంతా ఎప్పటికీ రుణపడి ఉంటం.
– మోర్తాడు గంగనర్సయ్య, పారిశుధ్య కార్మికుడు, కోరుట్ల బల్దియా.
అడుగకుండానే పెంచిండు..
గతంలో జీతాల పెంపుకోసం ఏండ్లతరబడి పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉండేది. అయినా పెంచుతారనే నమ్మకమే లేకపోతుండె. కానీ కేసీఆర్ సారు మేం అడుగకముందే వెయ్యి రూపాయలు పెంచుతున్నట్లు ప్రకటించి మా కుటుంబాల్లో సంతోషాన్ని నింపారు. మా కష్టాలు తెలిసిన నాయకుడు కాబట్టే ఎప్పటికప్పుడు జీతం పెంచుతున్నారు. ఇప్పుడు సకాలంలో జీతాలు వస్తున్నయి. అడగకుండానే అన్నీ ఇస్తండు. ఇంక మాకేం కావాలె.
– దీకోండ భాగ్యలక్ష్మి (కరీంనగర్)
మేం చేస్తున్న పనికి గుర్తింపు..
మేం చేస్తున్న పనికి గుర్తింపు దకింది. స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దడంలో మేం పడుతున్న కష్టాన్ని సీఎం కేసీఆర్ సార్ గుర్తించారు. మే డే కానుకగా వెయ్యి రూపాయలు జీతాన్ని పెంచడం ఎంతో సంతోషంగా ఉంది. కేసీఆర్కు ఎన్నటికీ మర్చిపోం. జీవితాంతం రుణపడి ఉంటం.
– బేతి నరేందర్, దేశాయిపేట(చొప్పదండి)
కార్మికుల కష్టం తెలిసిన నేత కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కార్మికుల కష్టం ఏంతో తెలిసిన నేత. కార్మికులు అడుగక ముందే వారి సమస్యలను తెలుసుకొని అండగా నిలుస్తున్నారు. గతంలోనూ కార్మికులు చేస్తున్న పనులను చూసి కనీస వేతనాల అమలుకు చర్యలు తీసుకున్నారు. అలాగే కరోనా టైంలో కార్మికులు అన్నింటిని తెగించి చేస్తున్న పనులను చూసి సీఎం కేసీఆర్ అదనపు వేతనాలను కూడా అందించి గొప్ప మనసును చాటుకున్నారు. కార్మికుల సంక్షేమానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం పెరుగుతున్న ధరలను దృష్టిలో పెట్టుకొని వేతనాలు పెంచడం ఆనందంగా ఉంది.
– శ్రీనివాస్రెడ్డి (కరీంనగర్)
రుణపడి ఉంటాం
ఊర్లను శుభ్రంగా ఉంచే మాలాంటోళ్ల గురించి కేసీఆర్ సార్ తప్ప ఎవరూ ఆలోచించరు. ఇంతకుముందు మా గురించి పట్టించుకున్నోళ్లే లేరు. గతంలో మా బతుకులు ఘోరంగా ఉంటుండె. జీతం చాలక, ఇల్లు గడువని పరిస్థితి ఉండె. కానీ కేసీఆర్ సారు సీఎం అయిన తర్వాత మాకు జీతాలు పెంచిండు. మొన్నటికి మొన్న మేం అడుగకుండానే రూ. వెయ్యి పెంచిండు. కేసీఆర్ సార్కు రుణపడి ఉంటాం.
– కాశపాక బుదమ్మ, దేశాయిపేట(చొప్పదండి)