వానకాలం సీజన్లో వేసిన వరి కోతకు వస్తున్న నేపథ్యంలో ధాన్యం సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసింది. రైతులకు ధాన్యం రవాణా చార్జీలు భారం కాకూడదన్న ఉద్దేశంతో ప్రతీ సీజన్లో వారి ముంగిట్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఈసారి కూడా అలాగే చేస్తుండగా, ఈ నెల 22 నుంచి సిద్ధం చేయనున్నది. జిల్లాలో 350 కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నది. జిల్లాలో రెండు లక్షల 62 వేల 765 ఎకరాల్లో వరి సాగు కాగా, 4 లక్షల 46 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యంగా ముందుకెళ్తున్నది. కాగా, ఈ సారి మద్దతు ధర ఏ-గ్రేడ్ రకం క్వింటాల్కు రూ.2,060, సాధారణ రకానికి రూ.2,040 చెల్లిస్తున్నారు. మిల్లర్లు ఆన్లైన్లో నమోదు చేసిన 24 గంటల్లో చెల్లింపులు పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
కరీంనగర్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): వానకాలం ధాన్యం కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 22 నుంచి అన్ని జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు.
కేంద్రాల ఏర్పాట్లలో అధికారులు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సీజన్లో ధాన్యం కొనుగోళ్లను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఈసారి కూడా అదే విధంగా కొనుగోళ్లు జరిపేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హైదరాబాద్లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి ఈ నెల 22 నుంచి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో జిల్లాలోనూ అధికారులు కేంద్రాల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. గత సీజన్ కంటే ఈసారి ఎక్కువ ధాన్యం మార్కెట్కు వచ్చే అవకాశం ఉన్నందున అందుకు తగినట్లుగానే ఏర్పాట్లు చేస్తున్నారు.
జిల్లాలో ఈసారి 4.46 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు ఐకేపీ ద్వారా 58, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (ప్యాక్స్) ద్వారా 237, డీసీఎంఎస్ ద్వారా 54, హాకా ద్వారా ఒకటి చొప్పున మొత్తం 350 కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. గన్నీ సంచులకు లోటు లేకుండా ముందు నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుత సీజన్లో 1.11 కోట్ల గన్నీ సంచులు అవసరం ఉంటాయని అంచనా వేశారు. అధికారుల వద్ద ఇప్పటికే 40 లక్షల గన్నీ సంచులు సిద్ధంగా ఉన్నాయి. ఇంకా 52 లక్షల సంచులకు టెండర్లు పూర్తి చేశారు. సప్లయ్కి సిద్ధంగా ఉంచారు. ప్రతి సెంటర్కు ప్యాడీ క్లీనర్ ఇవ్వాలని నిర్ణయించారు. 21 కేంద్రాల్లో ప్యాడీ క్లీనర్లు లేవని గుర్తించిన అధికారులు వాటిని సమకూర్చేందుకు ఏజెన్సీలతో చర్చిస్తున్నారు. కరీంనగర్, హుజూరాబాద్ డివిజన్లను రెండు సెక్టర్లుగా విభజించి ధాన్యం రవాణాకు కూడా ఇద్దరు కాంట్రాక్టర్లను సిద్ధం చేశారు. ఇలా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిన అధికారులు ఎప్పుడు అవసరమైతే అప్పుడు కేంద్రాలను ప్రారంభించేందుకు సన్నద్దమయ్యారు.
దీపావళి తర్వాతే ముమ్మరం
దీపావళి తర్వాతే జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా జరుగుతాయని అధికారులు భా విస్తున్నారు. జిల్లాలోని హుజూరాబాద్ డివిజన్తోపాటు మానకొండూర్, శంకరపట్నం మండలాల్లోని ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు ప్రాం తంలో త్వరగా నాట్లు వేస్తారు. ఈ ప్రాంతంలో కోతలు కూడా త్వరగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంతోపాటు జిల్లాలో ఎక్క డ కోతలు ప్రారంభిస్తే అక్కడ కేంద్రాలను ఏర్పా టు చేసేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉన్నదని జిల్లా అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్ లాల్ తెలిపారు. పెద్ద గ్రామాల్లో ఒకటి నుంచి మూడు కేంద్రాలు, ప్రతి గ్రామంలో ఒక కొనుగోలు కేం ద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అయితే, దీపావళి ముందు కోతలు నిర్వహించడం వల్ల తేమ శా తం అధికంగా వచ్చే అవకాశం ఉన్నందున చా లా మంది రైతులు దీపావళి తర్వాతనే కోతలు నిర్వహించుకుంటారు. ఈ నేపథ్యంలో పండుగ తర్వాతనే కొనుగోళ్లు కూడా ముమ్మరం అవుతాయని అధికారులు భావిస్తున్నారు.
ఏ గ్రేడు ధాన్యానికి రూ.2,060
కొనుగోళ్ల సమయంలో ఎఫ్సీఐ ఇచ్చిన ఎఫ్ఏక్యూ నిబంధనల ప్రకారం నాణ్యతా ప్రమాణాలు తప్పని సరిగా పాటించాలని అధికారులు కేంద్రాల నిర్వాహకులు చెబుతున్నారు. ఇందు కు అనుగుణంగా ఉన్న ఏ గ్రేడు ధాన్యం క్వింటాలుకు రూ.2,060, సాధారణ రకానికి రూ.2,040 చెల్లిస్తున్నారు. ధాన్యంలో రాళ్లు, మ ట్టిపెల్లలు 1 శాతం, చెత్త, ఇతర ధాన్యపు గింజ లు 1 శాతం, చెడిపోయిన, రంగు మారిన, మొ లకెత్తిన, పురుగుతిన్న ధాన్యం 5 శాతం, పరిపక్వత కాని, ముడుచుకుపోయిన ధాన్యం 3 శా తం, తక్కువ రకాల మిశ్రమాలు 6 శాతం, తేమ 17 శాతానికి మించరాదని అధికారులు చెబుతున్నారు. కాగా, రైతులు కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన తమ ధాన్యం రైస్ మిల్లులకు చేరి, అక్కడ మిల్లర్లు ఆన్లైన్లో రైతుల వివరాలను నమోదు చేసిన 24 గంటల్లో నగదు వారి ఖాతాల్లో జమచేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇదివరకటిలాగే రైతులు ధాన్యం విక్రయించే ముందు పట్టాదారు పాసు పుస్తకం, బ్యాంకు ఖాతా పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్లతోపాటు ఫోన్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది.
22 నుంచి కేంద్రాలు సిద్ధం
మంత్రి గంగుల కమలాకర్ ఆదేశాల మేరకు ఈ నెల 22 నుంచి జిల్లాలో కొనుగోలు కేంద్రాలను సిద్ధంగా ఉంచుతున్నాం. యాక్షన్ ప్లాన్ ప్రకారంగా ఇప్పటికే కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. ఎట్లెట్ల కోతలు నిర్వహిస్తే అట్లట్ల కేంద్రాలు ప్రారంభించేందుకు మా యంత్రాంగం సిద్ధంగా ఉన్నది. కేంద్రాల ఏర్పాటు నుంచి ధాన్యం రవాణా, రైతులకు చెల్లింపుల వరకు ఎక్కడా లోటు రాకుండా అధికారులకు బాధ్యతలు అప్పగించాం. కేంద్రాల వద్ద ఎప్పటిలాగే అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. రైతులు తమ ధాన్యాన్ని నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా సిద్ధం చేసి కేంద్రాలకు తేవాలి. అలాంటప్పుడే ప్రభుత్వం చెల్లిస్తున్న మద్దతు ధర వర్తిస్తుంది.
– జీవీ శ్యాంప్రసాద్లాల్, అదనపు కలెక్టర్ కరీంనగర్