Cyber crime | జగిత్యాల, మే 12 (నమస్తే తెలంగాణ) : ఆన్లైన్, సాంకేతికతను ఆధారంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు పెట్రేగిపోతున్నారు. అమాయకులు, మహిళలు, టెక్నాలజీపై అవగాహన లేని వారిని, డబ్బు అత్యవసరం ఉన్న వారిని టార్గెట్గా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. కేవలం నిరక్ష్యరాస్యులే కాదు విద్యావంతులు సైతం ఈ మోసాలకు బలవుతున్నారు. ఇటీవల ఈ సైబర్ మోసాల బారినపడ్డ చాలామంది పోలీస్స్టేషన్లలో కేసులు కూడా నమోదు చేశారు. అపరిచిత కాల్స్కు స్పందించినా, లింక్స్ క్లిక్ చేసినా మనం వారి ఉచ్చులో పడ్డట్టే. సైబర్ మోసాలు రకరకాలుగా జరుగుతున్నాయి. వయస్సు, వ్యక్తుల విధులను బట్టి కూడా నేరాలు జరుగుతున్నాయి.
ఒకరు ఫోన్ చేసి ఆధార్ అప్డేట్ చేయాలి లింక్ పంపిస్తున్నాం అంటూ మన ఖజానా ఖాళీ చేస్తారు. మరొకరు వీడియోకాల్ చేసి అమ్మాయిలతో మాట్లాడించి రికార్డు చేసి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజుతారు. ఇంకొకరు ఓటీపీ అడిగి ముంచుతారు. ఇలాంటి సైబర్ మోసాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఈ నేరాలకు సంబంధించి కొన్ని మాత్రమే పోలీస్స్టేషన్లలో కేసులు నమోదవుతున్నాయి. మిగతా వారు పరువు పోతుందనో, చుట్టుపక్కల వారికి చులకన అవుతామనే ఉద్దేశంతో మోసపోయామని తెలిసినా ఎవరి చెప్పకుండా లోలోపల మదనపడేవారు కోకొల్లలు. ఇటీవల లోన్యాప్ వేధింపులు మరీ ఎక్కువయ్యాయి. పొరపాటున ప్రైవేటు యాప్ నుంచి అప్పు తీసుకుంటే మన జీవితం గుల్ల అయినట్టే. వడ్డీకి వడ్డీ కట్టి అసలు చెల్లించినా ఇంకా కట్టాలంటే లోన్ యాప్ వారు వేధిస్తుంటారు. మరోవైపు మన కాల్ లిస్ట్లో ఉన్న వారందరికీ ఫోన్ చేసి మన గురించి చెప్పి పరువు తీస్తుంటారు. ఇలా వేధింపులకు గురిచేస్తారు. ఈ బాధలను తట్టుకోలేక పరువు పోయిందనే మనస్తాపంతోనే చాలామంది ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఇటీవల పెరిగిపోయాయి.
బ్లాక్మెయిల్
ఆయనో రిటైర్డ్ ఉద్యోగి. గౌరవ ప్రదమైన వృత్తిగా గుర్తింపు పొందిన శాఖలో పనిచేసి, కొద్దిరోజుల క్రితమే ఉద్యోగ విరమణ పొందాడు. ఓ రోజు మధ్యాహ్నం ఓ అపరిచిత సెల్ఫోన్ నెంబర్ నుంచి వీడియో కాల్ రావడంతో అటెండ్ చేశాడు. ఫోన్ స్క్రీన్పై ఓ అమ్మాయి కనిపించింది. అంతలోనే ఆ అమ్మాయి దస్తులు తీసేయడం మొదలు పెట్టింది. రిటైర్డ్ ఉద్యోగి తేరుకోక ముందే స్క్రీన్ రికార్డింగ్ అయింది. నిమిషాల వ్యవధిలోనే మరో అపరిచిత సెల్ఫోన్ నంబర్ నుంచి కాల్ వచ్చింది. ‘మీరు అసభ్యకరమైన వీడియోలు చూస్తున్నారు. అమ్మాయిలతో నగ్నంగా చాటింగ్ చేస్తున్నారు. మీరు ఓ అమ్మాయితో జరిపిన వ్యవహారంపై మాకు రికార్డింగ్ వచ్చింది. సైబర్ బ్రాంచ్లో కేసు నమోదు చేస్తున్నాం’ అంటూ బెదిరించడంతో సదరు రిటైర్డ్ ఉద్యోగి ఆందోళనకు గురయ్యాడు. పరువు కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందడం, కొడుకులు, బిడ్డలు గౌరవ ప్రదమైన వృత్తుల్లో ఉండడం, స్క్రీన్ రికార్డింగ్ బయటకు వస్తే పరువు పోతుందన్న బెంగతో ఫోన్ చేసిన వ్యక్తితో బేరసారాలకు దిగాడు. చివరకు పెద్ద మొత్తంలో ఆన్లైన్ ట్రాంజాక్షన్లో డబ్బులు చెల్లించాడు. అయితే తాను పూర్తిగా మోసపోయాడన్న విషయం అర్థం అయిన పరువు పోతుందన్న భయంతో పోలీసులకు సైతం చెప్పుకోలేక కుమిలిపోతున్నాడు.
లింక్ క్లిక్.. లక్ష డ్రా
వెంకటేశ్ (పేరు మార్చాం) ఒక వ్యాపారవేత్త. పెట్రోల్బంక్ నిర్వహణతోపాటు ఇతర వ్యాపారాలు ఉన్నాయి. తెలివైన, చురుకైన వ్యాపారిగా ఆయనకు గుర్తింపు ఉంది. కొద్దో గొప్పో రాజకీయ పరిచయాలు ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం వెంకటేశ్ సెల్ఫోన్కు ఒక లింక్ వచ్చింది. మీ ఆధార్కార్డు ఖాతాతో లింకు కాలేదంటూ మెసేజ్ రావడంతోపాటు, లింక్ను క్లిక్ చేస్తే సరిపోతుందని మెసేజ్లో పేర్కొన్నారు. మెసేజ్ను చూసి వెంకటేశ్ లింక్ను క్లిక్ చేయగానే, అకౌంట్లో ఉన్న దాదాపు లక్ష రూపాయలు డ్రా అయిపోయాయి. ఈ విషయాన్ని రెండు రోజుల తర్వాత తెలుసుకున్న వెంకటేశ్, పోలీసులను ఆశ్రయించాడు.
అత్యాశకు పోవద్దు
నిరక్షరాస్యులే కాదు, విద్యావంతులు సైతం సైబర్ నేరగాళ్ల బారినపడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. బ్యాంకు వాళ్లమని, ఓటీపీ చెప్పాలని, లాటరీ వచ్చిందని ఎర వేసి ఖాతాల్లోంచి డబ్బులు లాక్కెళ్తున్నారు. లింకులు పంపడం, పెట్టుబడి పెడితే తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బులు వస్తాయని సైబర్ క్రిమినల్స్ ప్రకటనలను చూసి చదువుకున్న వారు సైతం అత్యాశకు పోయి మోసపోతున్నారు. సైబర్ క్రిమినల్స్ను పట్టుకోవడం క్లిష్టమైన ప్రక్రియ. ప్రజలు మోసపోకుండా సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం.
జిల్లా హెడ్ క్వార్టర్స్లో ప్రత్యేక విభాగాన్ని సైతం ఏర్పాటు చేసి విచారణ చేపడుతున్నాం. సైబర్ నేరగాళ్ల బారిన పడిన వెంటనే 1930కు డయల్ చేస్తే పోగొట్టుకున్న డబ్బును రికవరీ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఆన్లైన్ నేరాలపై విద్యార్థి దశ నుంచే అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో పాఠశాలల్లోని విద్యార్థులకు, ఉపాధ్యాయులకు సైబర్ వారియర్స్ పేరుతో శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఎవరికీ ఓటీపీలు చెప్పవద్దు, అనుమానాస్పద లింకులను ఓపెన్ చేయవద్దు, తక్కువ సమయంలో పెట్టుబడి రెట్టింపు, పార్ట్టైమ్ జాబ్స్ నోటిఫికేషన్లను ఓపెన్ చేయకండి. డబ్బుల సంపాదనకు షార్ట్కట్ రూట్స్ ఉండవు. శ్రమించాలన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
-ఎగ్గడి భాస్కర్, జగిత్యాల ఎస్పీ
ఓటీపీ.. 40వేలు ఫట్
లీలధర్ ఓ ప్రభుత్వోపాధ్యాయుడు. కొద్దిరోజుల క్రితం ఆయనకు ఫోన్ వచ్చింది. ఎస్బీఐ నుంచి ఫోన్ వస్తున్నట్లుగా ట్రూకాలర్లో కనిపించింది. బ్యాంకు నుంచి ఫోన్ కదా అన్న నమ్మకంతో లీలధర్ ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఫోన్ చేసిన వ్యక్తి.. బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామని, బ్యాంకు టెక్నికల్ బృందం మాట్లాడుతారు, లైన్లో ఉండండి అంటూ చెప్పడంతో బ్యాంకు నుంచే ఫోన్ చేస్తున్నారని నమ్మాడు. ‘మీ ఖాతాకు పాన్కార్డు లింక్ చేయలేదు. లింక్ చేయకపోతే ట్రాంజాక్షన్స్ నిలిచిపోతాయి. పాన్కార్డు నంబర్ చెబితే లింక్ చేస్తాం’ అని చెప్పడంతో లీలధర్ పాన్కార్డు నంబర్ చెప్పాడు. కార్డు నంబర్ చెప్పగానే ఫోన్ చేసిన వ్యక్తి, మీ సెల్ఫోన్కు వచ్చిన ఓటీపీ నంబర్ చెప్పాలని కోరగా, ఓటీపీ వెంటనే చెప్పేశాడు. వెంటనే అకౌంట్లో ఉన్న రూ.40 వేలు డ్రా అయిపోయాయి. దీంతో తాను మోసపోయానని లీలధర్ గ్రహించాడు.
గతేడాది 635 కేసులు
కొద్దిపాటి పెట్టుబడులతో భారీ లాభాలు, వివాహం, తోడు, మ్యాట్రిమానీ, డేటింగ్, క్యూ ఆర్ కోడ్, ఉద్యోగాలు, ఎన్జీవో, సపోర్ట్, న్యూడ్కాల్స్, ఇలా వయసును బట్టి, వ్యక్తుల విధులను బట్టి సైతం నేరగాళ్లు వల వేస్తున్నారు. ఇటీవలి కాలంలో వాట్సాప్ కాల్స్ చేస్తూ కూడా ముంచుతున్నారు. ఇలా జగిత్యాల జిల్లాలో సైబర్ నేరాలు ఎక్కువగానే నమోదవుతున్నాయి. 2022లో మొత్తం 635 పిటిషన్లు రాగా, 2,77,25,139 కోట్ల మేర బాధితులు నష్టపోయినట్లుగా ప్రకటించారు. బాధితుల అకౌంట్ల నుంచి ఏ అకౌంట్లకు డబ్బులు బదలాయించబడ్డాయన్న విషయాన్ని పోలీసులు గుర్తించి, ఆ ఖాతాలను స్తంభింపజేసి, అందులో నుంచి 17,17,299లను ఫ్రీజ్ చేశారు. ఇక ఈ యేడాది మార్చి వరకు జిల్లాలో 143 ఫిర్యాదులు రాగా, 86,45,339ను సైబర్ క్రిమినల్స్ కొల్లగొట్టారు. అందులో 9,90,332ను పోలీసు శాఖ అధికారులు స్తంభింపజేయడంలో సఫలీకృతమయ్యారు.
అన్నీ ఫేకే
ప్రజలను సులువుగా మోసం చేసే సైబర్ నేరగాళ్లను పట్టుకోవడం మాత్రం కష్టతరమే. మోసగాళ్లు చెప్పే పేరు అబద్ధం. వారు వాడే ఫోన్ నంబర్ ఫేక్. ఫోన్ నంబర్ తీసుకునేందుకు మొబైల్ నెట్వర్క్ కంపెనీలకు ఇచ్చే అడ్రస్, ఇతర ఆధార పత్రాలూ ఫేకే. ఉండేది మహారాష్ట్ర అనుకుంటే.. ఏ ఢిల్లీ , బీహార్ నుంచో ఫోన్ చేస్తారు. వీళ్ల ఫోకస్ అంతా ఇతర రాష్ర్టాలకు చెందిన బ్యాంకు ఖాతాదారులపైనే. అందుకు ఎక్కువగా హిందీనే మాట్లాడుతూ ఫోన్లు చేస్తుంటారు. బ్యాంక్ అధికారులమంటూ వారు చేసే ఫోన్ నంబర్లకు తిరిగి ఫోన్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ పనిచేయవు. ఈ నంబర్ ఎక్కడ రిజిస్ట్రేషన్ అవుతుందో. ఏ నెట్వర్క్ నంబర్ అనే వివరాలు కూడా చాలా మట్టుకు లభించవని, వారు వాడిన మొబైల్ నంబర్లను ట్రేస్ ఏద్దామన్నా ఆనవాళ్లు సైతం దొరకవని పోలీసులు చెబుతున్నారు. ఉత్తర భారత దేశానికి చెందిన రాష్ర్టాల్లోని వారే ముఠాలుగా ఏర్పడి ఇటువంటి నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించినట్లు తెలుపుతున్నారు. సైబర్ నేరగాళ్లు సైతం సామాన్యులు, అమాయకులనే టార్గెట్ చేసి మోసగిస్తున్నట్లు చెబుతున్నారు.
లోన్యాప్ రుణానికి బలి
శ్రీనివాస్ది జగిత్యాల సమీపంలోని ఓ గ్రామం. ఆర్థిక ఇబ్బందులతో విధిలేని పరిస్థితుల్లో సెల్ఫోన్లో లోన్యాప్ ద్వారా 20 వేల రుణం తీసుకున్నాడు. పది శాతం వడ్డీ కట్టాడు. కొద్ది రోజుల్లోనే పూర్తిగా డబ్బులు చెల్లించాడు. అయినా ఇంకా.. ఇంకా డబ్బులు చెల్లించాలని లోన్యాప్ వాళ్లు సెల్ఫోన్ ద్వారా వేధించడం మొదలు పెట్టారు. శ్రీనివాస్ సెల్ ఫోన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్లన్నింటికీ ఫోన్ చేసి, లోన్యాప్లో అప్పు తీసుకున్నాడని, డబ్బులు చెల్లించడం లేదని, చెల్లించేలా చూడాలంటూ శ్రీనివాస్పై ఒత్తిడి తెచ్చారు. 20 వేల రూపాయలకు పరువు తీస్తున్నారంటూ ఆవేదన చెందిన శ్రీనివాస్ విధిలేని పరిస్థితిలో ఆత్మహత్య చేసుకున్నాడు.
అప్రమత్తతే రక్షణ