ఇసుక ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. క్వారీల మూతతో ఆకాశాన్నంటుతున్నాయి. అమాంతం పెరిగిన ధరలను చూసి సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. బుకింగ్ నుంచి ట్రాన్స్పోర్టు దాకా అదనంగా చెల్లించాల్సి వస్తున్నదని వాపోతున్నారు. పెద్దపల్లి జిల్లా నుంచి హైదరాబాద్ తరలించేందుకు లారీ ఒక్కో ట్రిప్పునకు అదనంగా 10వేలకు పైనే అవుతున్నాయని చెబుతున్నారు. ప్రజలకు మేలు చేయాల్సిన ప్రభుత్వం ఇలా క్వారీలు మూసివేసి ఇలా ఆర్థికంగా ఇబ్బంది పెట్టడం సరికాదని సూచిస్తున్నారు.
పెద్దపల్లి, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ) : గత కేసీఆర్ సర్కారు రెండేళ్ల క్రితం (2022) పెద్దపల్లి జిల్లాలోని మానేరు, హుస్సేన్మియా వాగులపై టీఎస్ఎండీసీ ఆధ్వర్యంలో 23 ఇసుక క్వారీలకు టెండర్లు పిలిచింది. అందులో ఒక్కటి మినహా మిగతా 22 క్వారీలకు టెండర్లు పూర్తయ్యాయి. మానేరు నదిపై 18, హుస్సేన్మియావాగుపై 4 క్వారీలు నడువగా, వీటి గడువు గత డిసెంబర్ 31తో ముగిసింది. అయితే, ఇసుక తవ్వకాలపై మధ్యలో పలువురు గ్రీన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించడంతో దాదాపు ఐదారు నెలల పాటు నిలిచిపోయాయి. తాజాగా గడువు ముగియడంతో కాంట్రా క్టు గడువును పొడిగించాల్సి ఉన్నా.. పొడిగించలేదు. ఇసుక తవ్వకాలకు పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో ఆ 22 క్వారీలు బంద్ అయ్యాయి. అయితే చిన్నఓదాల, అడవిశ్రీరాంపూర్, ముత్తారం, ఓడేడ్, గోపాల్పూర్, అడవిసోమన్పల్లి స్టాక్ యార్డుల్లో భారీగా ఇసుక నిల్వలు ఉండడంతో తరలించేందుకు మాత్రం అనుమతులున్నాయి. దీంతో ఆ ఆరు చోట్ల నుంచి తరలింపు సాగుతుండగా, మరో మూడు నెలల్లో ఖాళీ కానున్నాయి.
నెల క్రితం వరకు ఇలా..
పెద్దపల్లి జిల్లాలోని ఇసుక క్వారీల్లో గృహ, ఇతర నిర్మాణాలకు సంబంధించి మూడు రకాల ఇసుక లభ్యమవుతున్నది. ఇండ్ల నిర్మాణాల మొదటి దశలో వాడే గల్ల ఇసుక (కోర్ సాండ్), నిర్మాణాల మధ్య లో వాడే కట్టుబడి ఇసుక, చివరి సమయంలో వాడే ఫైన్ సాండ్ దొరుకుతున్నది. కోర్ సాండ్ టన్నుకు 411, కట్టుబడి ఇసుకకు 1300, ఫైన్ సాండ్కు 1500 చొప్పున చెల్లించి బుక్ చేసుకునేది. అదనంగా ట్రాన్స్పోర్టు చార్జీలు భరించి ఈ ఇసుకను క్వారీల నుంచి 14 టైర్ల టిప్పర్లలో 32 టన్నులు, 16 టైర్ల టిప్పర్లలో 35 టన్నులను రవాణా చేసుకునేది. హైదరాబాద్తోపాటు 13 జిల్లాలకు ఇక్కడి నుంచి తీసుకెళ్లేది. నెల క్రితం వరకు పరిస్థితి బానే ఉన్నా.. ప్రస్తుతం అంతా మారిపోయింది.
అడ్డగోలు ధరలు
గతంలో 22 క్వారీలు నడిచినప్పుడు ఒక్కో క్వారీకి రోజుకు 40 లారీల వరకు వచ్చేవి. అయితే అవి మూతపడగా, ఆరు స్టాక్ యార్డులకు డిమాండ్ పెరిగింది. దీంతో ఒక్కో చోటనే వందకుపైగా లారీలు క్యూ కడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇసుక ధరలు అమాంతం పెరిగాయి. నెల క్రితం వరకు 14 టైర్ల టిప్పర్లో 32 టన్నుల కోర్ సాండ్ కోసం 13,152 చెల్లించి బుక్ చేసుకునేది. హైదరాబాద్ తరలించేందుకు ఒక్కో ట్రిప్పునకు 40 వేలకుపైగా వినియోగదారుడికి ఖర్చయ్యేది. కానీ, ప్రస్తుతం 50 వేల నుంచి 60 వేల వరకు ఖర్చవుతున్నది. ప్రభుత్వానికి చెల్లించే మొత్తం మారకున్నా.. రవాణా, ఇతరత్రా ధరలు రెట్టింపయ్యాయి. ఇంతకుముందు ఇసుక బుక్ చేసేందుకు 200 నుంచి 300 వరకు తీసుకున్నా.. ప్రస్తుతం 1500 నుంచి 3వేల వరకు వసూలు చేస్తున్నారు. అలాగే, స్టాక్ యార్డు వద్ద రోజుకు 40 లోపు లారీల్లో లోడింగ్ చేస్తుండగా.. వందలాదిగా వస్తున్న లారీలు ఒకటి రెండు రోజుల పాటు వేచి చూడాల్సి వస్తున్నది. దీంతో వెయిటింగ్ చార్జీలంటూ అదనంగా 7 వేల నుంచి 8 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇలా ధరల పెంపుతో సామాన్యులు లబోదిబోమంటున్నారు. తిరిగి ప్రభుత్వం ఇసుక క్వారీలను కొనసాగిస్తేనే తప్ప ధరలు దిగిరావని చెబుతున్నారు. దీనిపై స్థానిక నేతలు పట్టించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.