మంథని/మంథని రూరల్, నవంబర్ 13 : వాణిజ్య సేద్యం.. ఒక్కసారి మొక్కలు నాటితే 30 ఏండ్లపాటు సిరులు కురిపించే పంట.. ఆయిల్పామ్ సాగుకు కర్షకలోకం కదులుతున్నది. సంప్రదాయ విధానాలతో లాభం లేదని, మార్కెట్లో డిమాండ్ ఉన్న నూనె జాతి ఆయిల్ పామ్ సాగు బాట పట్టాలని సర్కారు పిలుపు మేరకు చైతన్యవంతమైంది. తక్కువ పెట్టుబడి.. రాబడి ఎక్కువ ఇచ్చే పంట కావడం.. సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుండడం.. ముఖ్యంగా ఎకరానికి రూ.లక్షకుపైనే నికర ఆదాయం వచ్చే అవకాశాలతో సాగుపై అమితాసక్తి చూపుతున్నది. ఇప్పటికే మంథని డివిజన్లో 172ఎకరాల్లో పంట వేసిన రైతాంగం, వారం రోజుల్లో మరో 450 ఎకరాల్లో వేసేందుకు సిద్ధమవుతున్నది. కొత్తగా మరో 2450 మంది సాగుకు దరఖాస్తు చేయగా, ఉద్యానవన శాఖ అందుకు తగ్గట్టుగానే ప్రణాళికలు వేస్తున్నది. మొక్కల కోసం దూర ప్రాంతానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా సుల్తానాబాద్ మండలం రెబ్బల్దేవ్పల్లిలో నర్సరీని పెంచుతూ రైతులకు మొక్కలు అందిస్తున్నది.
వ్యవసాయంలో రైతులు ఆనాదిగా సాంప్రదాయ పంటలే వేస్తున్నారు. మార్కెట్లో డిమాండ్ను బట్టి కాకుండా పాతకాలం నాటి సేద్య విధానాలే పాటిస్తున్నారు. ఫలితంగా లాభం వస్తే తీసుకుంటున్నారు.. లేదంటే నష్టపోతున్నారు. ఈ క్రమంలో పరిస్థితిని గుర్తించిన రాష్ట్ర సర్కారు మార్కెట్లో డిమాండ్ ఉన్న ఆయిల్పామ్ సాగును ప్రోత్సహిస్తున్నది. వాణిజ్య పంటలు.. ముఖ్యంగా దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండే పంటను రాష్ట్రంలో విస్తరించాలని గతంలోనే నిర్ణయించింది. ఈ క్రమంలో వరి సాగు చేస్తున్న రైతులను ఇతర పంటలపైకి మళ్లించేందుకు ప్రభుత్వం 90శాతం సబ్సిడీతో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తుండడంతో పెద్దపల్లి జిల్లా రైతాంగం చైతన్యవంతమైంది. కొద్దిరోజుల క్రితమే ఆయిల్పామ్ సాగుకు శ్రీకారం చుట్టి తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నది.
సర్కారు ప్రోత్సాహం.. సబ్సిడీలు..
ఆయిల్పామ్ పంట సాగుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహమిస్తున్నది. నీటి యాజామాన్యాన్ని ప్రోత్సహించేందుకు బిందు సేద్యం పద్ధతిలో మైక్రోజెట్ల ద్వారా నీటిని అందించేందుకు ఉద్యానవన శాఖ ద్వారా రాయితీ ఇస్తున్నది. ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం సబ్సిడీ ఇస్తున్నది. ఎస్సీ రైతులు కేవలం జీఎస్టీ మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఐదు ఎకరాల లోపు ఉండే బీసీ, ఓసీలకు 90 శాతం, ఐదు ఎకరాలు దాటితే బీసీ, ఓసీలకు 80 శాతం ప్రభుత్వం రాయితీ అందిస్తోంది. ఇంకా మొక్కలను అతి తక్కువ ధరకే అందిస్తున్నది. ఒక్కో మొక్క ధర మార్కెట్ విలువ రూ.213 ఉండగా రైతుకు సబ్సిడీపై రూ.20కు అందజేస్తున్నది.
ఒక్కసారి నాటితే 30ఏండ్ల దాకా దిగుబడి..
ఆయిల్పామ్ సాగులో భారీ లాభాలుంటాయి. ముందుగా మొక్కకు మొక్కకు మధ్య తొమ్మిది మీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలి. ఎకరాకు 48నుంచి 57దాకా మొక్కలు నాటుకోవచ్చు. మొక్కలు నాటేందుకు రైతుకు సుమారు రూ.20వేల పెట్టుబడి అవుతుంది. తర్వాత రెండు, మూడో సంవత్సరం పెద్దగా పెట్టుబడి పెట్టాల్సిన పని లేదు. నాటిన మొక్క నాలుగేళ్ల నుంచి దిగుబడినివ్వడం ప్రారంభమై 30 ఏండ్ల దాకా దిగుబడినిస్తుంది. ఒక్కో చెట్టుకు ఏడు నుంచి ఎనిమిది గెలలు వేస్తాయి. రైతు నిర్వాహణను బట్టి గెల సైజు 20నుంచి 60కిలోల మధ్య ఉంటుంది. రైతుకు ఒక్కో ఎకరా సాగులో నాలుగేళ్ల తర్వాత ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.2లక్షల ఆదాయం వస్తుంది. ఒక్కో ఎకరాకు 10 నుంచి 12టన్నుల దాకా దిగుబడి వస్తుంది. ప్రస్తుతం టన్ను ధర మార్కెట్లో రూ.15వేల నుంచి రూ.20వేల దాకా పలుకుతుంది.
అంతర పంటలూ వేసుకోవచ్చు..
ఆయిల్ పామ్ పంట సాగు చేసే రైతులు అంతర పంటలూ సాగు చేసుకోవచ్చు. పత్తి, మిర్చి, కూరగాయలు, పసుపు, మక్క, పొద్దు తిరుగుడు, టమాట, బీర, శ్రీగంధం, సోయాబీన్, పెసళ్లు, మినుములు, పప్పు దినుసులు, పత్తి పంటలను సాగు చేసుకోవచ్చు. చీడ పీడల ఇబ్బందుల ఉండవు. ఇతర పంటల సాగుకు అవసరమయ్యే ఎరువులను 30 శాతం ఉపయోగిస్తే సరిపోతుంది. దిగుబడిలో సైతం ఎలాంటి తేడాలు ఉండని అధికారులు చెప్తున్నారు.
మంథని డివిజన్లో 172 ఎకరాల్లో సాగు
ప్రభుత్వం ప్రోత్సాహంతో మంథని డివిజన్ పరిధిలో ఆయిల్పామ్ సాగు బాట పట్టారు. ఇప్పటికే మంథనిలో 35 ఎకరాలు, ముత్తారంలో 109, కమాన్పూర్లో 25 ఎకరాలు అంటే దాదాపు 172 ఎకరాల్లో పంట వేశారు. మరో వారం రోజుల్లో మంథని మండలంలో 120 ఎకరాలు, ముత్తారంలో 120 ఎకరాలు, రామగిరిలో 100, కమాన్పూర్ మండలాల్లో 100 ఎకరాలు వేసేందుకు సిద్ధమవుతున్నారు. వీరే కాకుండా మరో 2450 మంది రైతులు ఉద్యానవన శాఖ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 1205 మంది రైతులు మొక్కల కోసం డీడీలను సైతం తీసి సిద్ధంగా మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉన్నారు. కాగా, మొక్కల కోసం ఎక్కడోదూర ప్రాంతానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా సుల్తానాబాద్ మండలం రెబ్బల్దేవ్పల్లిలోని నర్సరీలో తిరుమల ఆయిల్ పామ్, ఉద్యానవన శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మొక్కలు సాగు చేస్తున్నారు. ఇక్కడి నుంచే రైతులకు పంపిణీ చేయనున్నారు.
కొనుగోలుకు ఇబ్బంది లేదు..
ఆయిల్ పామ్ సాగు చేసే రైతులు వారు పండించిన గెలలను అమ్ముకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. కాల్వశ్రీరాంపూర్ మండలం ఎదులాపురంలోని ఆయిల్ పామ్ నూనె ఫ్యాక్టరీలో రైతులు పండించే పంటను కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేసిన 15 రోజుల్లో ఖాతాల్లో డబ్బును జమ చేస్తారు.
అంతర పంటగా అరటి సాగు చేస్తున్న..
నాకు రెండెకరాల భూమి ఉంది. గతంల వరి వేసిన. ఉద్యానవన శాఖ అధికారులు మా ఊరికి వచ్చి ఆయిల్ పామ్ వేస్తే లాభాలుంటయని చెప్పిన్రు. అశ్వరావుపేటలోని తోటలకు తీసుకెళ్లి చూపించిన్రు. నేను కూడా వేయాలని అనుకున్న. 2020 డిసెంబర్లో రెండెకరాల భూమిల 144 మొక్కలు పెట్టిన. అంతర పంటగా 2021 ఫిబ్రవరిలో 2500 అరటి మొక్కలు పెట్టిన. చాలా సంతోషంగా ఉంది.
– నాంసాని సమ్మయ్య, రైతు, అడవిశ్రీరాంపూర్, ముత్తారం
తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం..
ఆయిల్ పామ్ పంట సాగు చేయడం వల్ల రైతులకు తక్కువ పెట్టుబడి..ఎక్కువ ఆదాయం సమకూరుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ పామ్ పంటకు మంచి డిమాండ్ ఉంది. ఈ పంట సాగు చేయడం వల్ల ప్రభుత్వం కల్పించే సబ్సిడీ పొందడం పాటు అంతర్ పంట ద్వారా సైతం రైతులు లాభాలు గడించవచ్చు. మంథని డివిజన్లో ఇప్పటికే 172ఎకరాల్లో సాగవుతుంది. మరో వారంలో దాదాపు 500 ఎకరాలు సాగులోకి రానుంది. ఈ పంట వేయాలనుకునే రైతులు తమను సంప్రదిస్తే సాగుకు కావాల్సిన పూర్తి వివరాలు తెలియజేస్తాం.
– శ్రీకాంత్, మంథని డివిజన్ హార్టికల్చర్ అధికారి
లాభాలు గడిస్తాననే నమ్మకం ఉంది..
సీఎం కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టుతో మనకు ఇప్పుడు నీళ్లకు కొదవ లేకుండా పోయింది. ప్రత్యామ్నాయ పంటలతో అధిక దిగుబడులు సాధించవచ్చని ఉద్యానవశాఖ అధికారులు చెప్పారు. దీంతో నాకున్న మూడు ఎకరాల్లో ఆయిల్ పామ్ వేసిన. మొత్తం 171 మొక్కలు పెట్టిన. అంతర పంటగా పత్తి వేసిన. అధికారులు ఎప్పటికప్పుడు మెలకువలు నేర్పుతున్నరు. ఈ పంటతో లాభాలు గడిస్తాననే నమ్మకం బలంగా ఉంది.
– బెల్లంకొండ ప్రకాశ్రెడ్డి, రైతు, నాగారం, మంథని