కోనరావుపేట, ఆగస్టు 17: సుద్దాల గ్రామంలో గురువారం ఒక్కసారిగా అలజడి రేగింది. గ్రామంలో ఇద్దరి ఇంటి నిర్మాణానికి అనుమతి ఇచ్చేందుకు పంచాయతీ కార్యదర్శి పెందోట జగదీశ్వర్ 30వేలు డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో ఇదివరకే 10వేలు అడ్వాన్స్గా తీసుకున్నాడు. గురువారం గ్రామంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన తాత్కాలిక పంచాయతీ కార్యాలయంలో 20 వేలు లంచం తీసుకుంటుండగా, ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం.. సుద్దాలకు చెందిన బండారి వోవేల్ గ్రామంలో తాను, తన తండ్రి బాలయ్య పేరిట ఉన్న మూడు గుంటల భూమిలో రెండు ఇండ్లు కట్టుకునేందుకు అనుమతి ఇవ్వాలని గ్రామపంచాయతీ కార్యదర్శి జగదీశ్వర్కు దరఖాస్తు చేసుకున్నాడు. నాలుగు నెలలైనా పర్మిషన్ ఇవ్వలేదు. ఎప్పుడు వెళ్లినా పేపర్లు సరిగ్గా లేవని దాట వేస్తూవచ్చాడు.
దీంతో వోవేల్ అన్ని కాగితాలు ఇచ్చినా పర్మిషన్ ఇవ్వలేదు. ఇదేంటని అడిగితే 30వేలు లంచం ఇస్తేనే ఇల్లు అనుమతి ఇస్తానని కార్యదర్శి తెగేసి చెప్పాడు. దీంతో ఈ నెల 14న వోవెల్ 10వేలు అడ్వాన్స్ ఇచ్చాడు. మిగతా డబ్బులు 20వేలు గురువారం గ్రామంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన తాత్కాలిక గ్రామ పంచాయతీ ఆఫీస్లో కార్యదర్శికి ఇస్తుండగా, అప్పటికే అక్కడ మాటు వేసి ఉన్న ఆదిలాబాద్ జిల్లా ఏసీబీ డీఎస్పీ, కరీంనగర్ ఇన్చార్జి రమణామూర్తి తన సిబ్బందితో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. జగదీశ్వర్ను అదుపులోకి తీసుకుని రైతువేదికలో సుమారు రెండు గంటల పాటు విచారణ జరిపారు. ఇందులో ఇంటి అనుమతి కోసం రూ.3వేలు చలాన కట్టి మిగితా సొమ్మును లంచం కింద తీసుకున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. విచారణలో ఎంపీవో, ఎంపీడీవోకు ఎలాంటి సంబంధం లేదని తేలినట్లు చెప్పారు. జగదీశ్వర్ను కోర్టులో హాజరు పరిచి పూర్తి విచారణ చేస్తామని వెల్లడించారు.
గ్రామంలో మాకున్న మూడు గుంటల భూమిలో నా పేరు, మా తండ్రి పేర్లపై ఇండ్లు కట్టుకునేందుకు అనుమతి కోసం నాలుగు నెలల కింద కార్యదర్శికి దరఖాస్తు చేసుకున్నం. ఇండ్ల పత్రాలు అందజేసినం. కానీ అనుమతి ఇవ్వకుండా తిప్పించుకున్నడు. సరైన పత్రాలు లేవని అంటే వాటిని కూడా తీసుకువచ్చి ఇచ్చినం. అయినా అనుమతి ఇవ్వలేదు. 30వేలు లంచం ఇవ్వాలని అడిగిండు. ఈ నెల 14న 10వేలు, గురువారం 20వేలు ఇచ్చిన.
– బండారి వోవేల్, ఫిర్యాదుదారు(సుద్దాల)