Ramagundam | జ్యోతి నగర్, జులై 27 : మెడికల్ టెస్ట్ల పేరుతో యాజమాన్యం వేధింపులకు పాల్పడుతోందని ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. రామగుండం NTPC ధన్వంతరి ఆసుపత్రి ఎదుట సోమవారం కాంట్రాక్ట్ కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మెడికల్ టెస్టుల పేరుతో కాంట్రాక్ట్ కార్మికులను యాజమాన్యం అనవసరంగా భయాందోళనకు గురిచేస్తోందని వారు ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహించిన వైద్య పరీక్షల నివేదికలను అంగీకరించకుండా ప్రైవేట్ ఆసుపత్రుల నుంచే పరీక్షలు చేయించుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని నాయకులు తెలిపారు.
అక్కడ పరీక్షలకు సుమారు రూ.5వేల వరకు ఖర్చు అవుతోందని, దీంతో కార్మికులపై అదనపు ఆర్థిక భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ధన్వంతరి ఆసుపత్రిలో నిర్వహిస్తున్న వైద్య పరీక్షల్లో పారదర్శకత లేదని, కొన్ని సందర్భాల్లో తప్పుడు నివేదికలు వస్తున్నాయని ఆరోపించారు. మెడికల్ టెస్టుల పేరుతో కాంట్రాక్ట్ కార్మికులను వేధించడం మానుకోవాలని, ప్రభుత్వ ఆసుపత్రుల వైద్య పరీక్షల నివేదికలను కూడా చెల్లుబాటు అయ్యేలా గుర్తించాలని NTPC యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించకపోతే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని కార్మిక సంఘాల నాయకులు చిలుక శంకర్, గీట్ల లక్ష్మారెడ్డి, నాంసాని శంకర్, ఇజ్జగిరి భూమయ్య, దగ్గుల సత్యం, రాధారపు రాజమల్లయ్య హెచ్చరించారు.