ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు ఇంకా పూర్తిస్థాయిలో మోక్షం కరువైంది. ఏళ్లు గడుస్తున్నా పరిష్కారం లేక నిరీక్షణే మిగులుతున్నది. ఉమ్మడి జిల్లాలోని కార్పొరేషన్లు, మున్సిపాల్టీలో ఇంకా 35వేలకుపైగా దరఖాస్తులు పెండింగ్లో ఉండగా.. అందుకు ప్రభుత్వ అలసత్వం, అధికారుల నిర్లక్ష్యమే కారణమనే విమర్శలున్నాయి. పరిష్కారంలో సాంకేతిక కారణాలు చూపుతుండగా.. దరఖాస్తుదారులు నేటికీ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు క్షేత్రస్థాయిలో అధికారులు ‘మామూలు’గా తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.
కరీంనగర్ కార్పొరేషన్, జూన్ 26 : ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్)పై నిర్లక్ష్యం కొనసాగుతున్నది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని రెండు కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీల పరిధిలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం జరుగుతున్నది. మొత్తం 98వేలకుపైగా అర్జీలు వస్తే, అందులో 35వేలకుపైగా నేటికీ పెండింగ్లోనే ఉన్నా యి. ఒక్క కరీంనగరంలోనే 24019 దరఖాస్తులు రాగా, వేల సంఖ్యలో పెండింగ్లోనే ఉన్నట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. పరిష్కారంలో సాంకేతిక సమస్యలను సాకుగా చూపి జాప్యం చేస్తున్నారనే విమర్శలున్నాయి. నిజానికి ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించే విషయంలో బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు (ఎల్ 1 అధికారులు) స్థలం దగ్గరకు వెళ్లి యాప్లో వివరాలను నమోదు చేయాలి. అనంతరం దరఖాస్తుదారులు ఫీజు చెల్లించాలి. తర్వాత ఎల్ 1 అధికారి అప్లోడ్ చేస్తే టీపీవో (ఎల్ 2 అధికారి) దానిని పరిశీలించి, అప్లోడ్ చేస్తే కమిషనర్ (ఎల్ 3) లాగిన్కు వెళ్తుంది. వారు అక్కడ ఓకే చేస్తే ప్రొసీడింగ్స్ వస్తాయి.
కానీ, కొందరు దరఖాస్తుదారులకు ఎల్-1 అధికారి సంబంధించి ఇరిగేషన్, రెవెన్యూ విభాగాల నుంచి ఓకే చేసిన తర్వాత దరఖాస్తుదారుడు ఫీజు కడితే మళ్లీ ఎల్-1కే వెళ్తున్నది. ఎల్-2లో ఆమోదించిన తర్వాత ఎల్-3 లాగిన్లకు వెళ్లకుండా, ఎల్-1కు వెళ్తుండడంతో దరఖాస్తుదారులు గందరగోళానికి గురవుతున్నారు. దీంతో ప్రతీసారి మున్సిపాలిటీ, ఇరిగేషన్, రెవెన్యూ విభాగాల చుట్టూ తిరగాల్సి రావడంతో అవస్థలు పడుతున్నారు. బల్దియాల చుట్టూ తిరగలేక విసిగి వేసారిపోతున్నారు. అసలు ఈ సమస్యలపై సరైన సమాధానం ఇచ్చే వారు లేకుండా పోయారు.
సాంకేతిక సమస్యల పరిష్కారం కోసం కరీంనగర్ నగరపాలక సంస్థకు వస్తే.. కనీసం సమాచారం ఇచ్చే వారు కరువయ్యారని దరఖాస్తుదారులు మండిపడుతున్నారు. అసలు ఆఫీసులచుట్టూ తిరుగుతున్నా టౌన్ ప్లానింగ్ అధికారులు సాయంత్రాలు తప్ప మిగిలిన సమయాల్లో దొరకడం లేదని వాపోతున్నారు. దొరికినా సరైన సమాధానం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహిస్తున్నారు. కమీషన్లు ఇస్తేనే పనిఅయ్యే పరిస్థితు లు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. కార్యాలయం చుట్టూ తిరగలేక కొందరు దరఖాస్తులను అలాగే వదిలేస్తున్నారు. ఈ విషయంలో ఎప్పటికప్పుడు ఎల్ఆర్ఎస్ గడువు ప్రభుత్వం పెంచుతున్నా పూర్తి స్థాయి పరిష్కారం లేకపోవడం విమర్శలకు తావిస్తున్నది. అందుకే ప్రభుత్వం 25 శాతం రాయితీతో వచ్చే నెల 31 వరకు ఎల్ఆర్ఎస్కు అవకాశం ఇచ్చినా కొందరు ఆస్తకి చూపడం లేదని తెలుస్తున్నది.