“స్వార్థ రాజకీయాలతో దేశం ఆగమవుతున్నది. మతవిద్వేషాలతో అశాంతి కనిపిస్తున్నది. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసే కుట్ర జరుగుతున్నది. కీలకమైన విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమల రంగాల్లో సరైన వృద్ధి కనిపించడం లేదు. అభివృద్ధి, సంక్షేమం ముందుకెళ్లడం లేదు. ప్రజావ్యతిరేక విధానాలతో బీజేపీ సర్కారుపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో దార్శనికుడు సీఎం కేసీఆర్ నేతృత్వంలో పురుడు పోసుకున్న భారత్ రాష్ట్ర సమితి దేశానికి ఒక భరోసానిస్తుంది’ అని ఉమ్మడి జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు స్పష్టం చేస్తున్నారు. గురువారం తమ అభిప్రాయాలను ‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్నారు. తెలంగాణ మాడల్ అభివృద్ధి జరగాలన్నా.. మత సామరస్యం వెల్లివిరియాలన్నా.. సామాన్యుల జీవితాలు గాడినపడాలన్నా.. రైతు గోస తీరాలన్నా, సాగు పండుగలా మారాలన్నా.. దేశ ప్రతిష్టలు వెలగాలన్నా అది కేసీఆర్తోనే సాధ్యమవుతుందని చెబుతున్నారు. రాష్ర్టాన్ని నంబర్ వన్గా నిలిపిన ఆయన, దేశానికి నాయకత్వం వహిస్తే ప్రపంచంలోనే ఆదర్శంగా నిలుస్తుందని అభిప్రాయపడుతున్నారు. దేశానికి మంచిరోజులు వచ్చాయని, బీఆర్ఎస్తో నవశకం మొదలవుతుందని చెబుతున్నారు.
కరీంనగర్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ కరీంనగర్ (నమస్తే తెలంగాణ) : దసరా శుభముహూర్తాన సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)ని భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)గా ప్రకటించి, రాష్ట్ర రాజకీయ చరిత్రలో నయా అధ్యాయం లిఖించారు. జాతీయ రాజకీయాల్లో వెళ్తున్నట్టు ప్రకటించడాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు. కేసీఆర్ నిర్ణయంపై హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. దేశంలో సరికొత్త మార్పునకు అడుగుపడిందని, కేసీఆర్ పేద, బడుగు బలహీన వర్గాల జీవితాల్లో కొత్త వెలుగు తెస్తారని చెబుతున్నారు. గులాబీ శ్రేణుల్లో నూతనోత్సాహం నిండగా, నాయకులు, కార్యకర్తలు సంబురాల్లో మునిగితేలుతున్నారు. ఇటు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు కూడా కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతించడమే కాదు, నాటి నుంచి కేసీఆర్ వెంటే ఉంటున్నామని, బీ(టీ)ఆర్ఎస్ కోసం నిరంతరం శ్రమిస్తామని చెబుతున్నారు. నాడు తెలంగాణ కోసం పార్టీని స్థాపించి అలుపెరుగని పోరు సల్పి స్వరాష్ర్టాన్ని సాధించారని, ఇప్పుడు అదే స్ఫూర్తితో ఉజ్వల భారత్ కోసం అడుగువేశారని కొనియాడుతున్నారు. ఆయన అనుకున్న పని అయ్యేదాక విశ్రమించరని, అందుకు రాష్ట్ర ఏర్పాటే ఒక ఉదాహరణగా చెబుతున్నారు. ఇప్పటికే ఇతర రాష్ర్టాల వలస కూలీలు మన రాష్ట్రంలోని అభివృద్ధిని ప్రత్యక్షంగా చూస్తున్నారని, అందుకే కేసీఆర్ నాయకత్వం దేశమంతా ఉండాలని కోరుకుంటున్నారని పేర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లోనే కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటించి దేశ రాజకీయ చరిత్రలో కొత్త అధ్యయనం లిఖించారని అభిప్రాయపడుతున్నారు. దేశానికి తెలంగాణ మోడల్ అభివృద్ధి, సంక్షేమాన్ని అందించే సంకల్పంతో బీఆర్ఎస్ అవతరించిందని వివరించారు. బీఆర్ఎస్పై తమ అభిప్రాయాలను ఎమ్మెల్యేలు ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా పంచుకున్నారు.
ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి
దేశ ఔన్నత్యాన్ని పెంచి, దేశ భవిష్యత్తును మార్చివేసేందుకు జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ అవతరించింది. దేశాన్ని 40 ఏండ్లు పాలించిన కాంగ్రెస్, ఎనిమిదేండ్లుగా పాలిస్తున్న బీజేపీ ప్రజా సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపించలేక పోయాయి. దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా క్షీణించిపోగా, దేశంలో మత విద్వేషాలు నెలకొన్నాయి. దళితులు, గిరిజనులపై దాడుల తీవ్రమయ్యాయి. మైనార్టీలపై ప్రత్యేక ఎజెండాతో వ్యవహరిస్తూ, వారిని శత్రువులుగా చూసే పరిస్థితి నెలకొన్నది. దేశంలోని కీలక రంగాలైన విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమల రంగాల్లో సరైన వృద్ధి కనిపించడం లేదు. కొంతమంది వ్యాపారవేత్తల మేలు కోసం అనేక ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసే కుట్ర జరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్రం కర్ర పెత్తనం చేస్తున్నది. బీజేపీయేతర రాష్ర్టాల్లో రాజకీయ అనిశ్చితికి కారణమవుతున్నది. రాష్ర్టాల ఆర్థిక పరిస్థితి బాగున్నా ఎఫ్ఆర్బీఎంను సాకుగా చూపి కనీసం రుణాలు తెచ్చుకోలేని స్థితికి రాష్ర్టాలను నెట్టివేస్తున్నది. పేదలకు అన్నం పెట్టే ఉపాధిహామీ పథకాలను రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నది. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి సహకరించాల్సింది పోయి వివక్ష చూపుతున్నది. దేశంలోని అనేక రాష్ర్టాలపై ఇదేతీరున వ్యవహరిస్తున్నది. ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న బీజేపీ వంటి పార్టీలను ఎదుర్కొని, దేశ ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు జాతీయ స్థాయిలో రాజకీయ ప్రత్యామ్నాయ శక్తి అవసరమున్నది. గత ప్రభుత్వాలకు భిన్నంగా, సంక్షేమం, అభివృద్ధిని సమంగా అమలు చేసి, దేశాన్ని ప్రపంచ పటంలో సమున్నతంగా నిలబెట్టాల్సిన నేపథ్యంలో బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి) ఆవిర్భవించింది. దార్శనికుడైన సీఎం కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ దేశ చరిత్రలో వేగుచుక్కలా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
– మంత్రి కొప్పల ఈశ్వర్
దేశ ప్రజలు కోరుకుంటేనే బీఆర్ఎస్
ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ప్రజలు తయారు చేసుకున్న వజ్రాయుధం కేసీఆర్. తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా పోరాటాలు నిర్మించి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించారు. రాష్ట్రం ఏర్పడిన ఎనిమిదేళ్లలో కనీవినీ ఎరుగని రీతిలో అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు వచ్చాయి. రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోతున్నది. ఇలాంటి పథకాలు మాకూ కావాలని దేశ ప్రజలు కోరుకున్న నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఆవిర్భవించింది. అంతేకానీ, బీఆర్ఎస్ అనేది కేసీఆర్ కోసమో మరి దేనికోసమో స్థాపించిన పార్టీ కాదు. ఒకప్పుడు దేశానికి రోల్మోడల్ అనుకున్న గుజరాత్లో ఇప్పుడు తాగేందుకు నీళ్లు లేని పరిస్థితి. కనీసం కరెంట్ కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేక పోతున్నరు. ఇప్పుడు దేశం దృష్టంతా తెలంగాణపైకి మళ్లింది. ఇంత త్వరగా అభివృద్ధి చెందడానికి కేవలం కేసీఆర్ దార్శనికతే కారణమని దేశ ప్రజలు నమ్ముతున్నరు. 74 ఏండ్ల స్వాతంత్య్ర భారతదేశంలో మేమెందుకు అభివృద్ధి చెందలేక పోయామని ఆలోచిస్తున్నరు. తెలంగాణలో గొప్పగా అమలవుతున్న పథకాలు తమ రాష్ర్టాల్లోనూ అమలు కావాలని కోరుకుంటున్నరు. అందుకే దేశంలోని అన్ని వర్గాలు, రాజకీయ ఉద్ధ్దండులు కూడా కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నరు. బీడు భూములకు నీళ్లు కావాలన్నా, 24 గంటల ఉచిత కరెంట్ కావాలన్నా, కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా, దళిత బంధు వంటి పథకాలు తమ రాష్ర్టాల్లో అమలుకావాలన్నా కేసీఆర్ తమ నాయకుడు కావాలని దేశ ప్రజలు ఆకాంక్షిస్తున్నరు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీఆర్ఎస్ ఏ విధంగా సక్సెస్ అయ్యిందో, దేశ ప్రజల కోసం బీఆర్ఎస్ కూడా సక్సెస్ అవుతుంది. దేశ ప్రజలు మద్దతు తెలిపేందుకు ముందుకు వస్తున్న తీరే ఇందుకు నిదర్శనం.
– మంత్రి గంగుల కమలాకర్
టీఆర్ఎస్ పార్టీని జాతీయ స్థాయికి విస్తరిస్తూ భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చిన అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా నమస్తే తెలంగాణ దినపత్రిక అందించిన ప్రత్యేక సంచికలో ఆ వార్తలను ఎంతో ఆసక్తిగా చదువుతున్న సిరిసిల్ల పట్టణవాసులు
ప్రజాస్వామిక అవసరాలను తీర్చే శక్తి
దేశంలోని ప్రజాస్వామిక అవసరాలను తీర్చే శక్తి సీఎం కేసీఆర్ ఆవిష్కరించిన బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. మనది వ్యవసాయ ఆధారిత దేశమే అయినా ఆ రంగం రోజురోజుకూ నిర్వీర్యమవుతున్నది. ఈ రంగంపై ముఖ్యమంత్రి కేసీఆర్కు స్పష్టమైన అవగాహన ఉన్నది. లౌకిక ప్రజాస్వామిక దేశంలో ప్రజల అవసరాలను గుర్తించే నాయకుడు ఇప్పుడున్న పరిస్థితిల్లో ఎంతో అవసరం. ఉద్యమనాయకుడిగా, కార్యసాధకుడిగా కేసీఆర్ మనందరికీ సుపరిచితమే. తెలంగాణ మాదిరి అభివృద్ధి, సంక్షేమం దేశానికి అందించాలంటే ఆయనతోనే సాధ్యమవుతుంది. దేశానికి మంచి రోజులు వస్తాయి. ఇది నేను నమ్ముతున్నా. ఆయనతోనే దేశంలోని అన్ని వర్గాలకు మేలు జరుగుతుంది.
– చెన్నమనేని రమేశ్బాబు, వేములవాడ ఎమ్మెల్యే
దేశాభివృద్ధి, సమగ్రత కోసమే..
దేశాభివృద్ధి, సమగ్రత కోసమే బీఆర్ఎస్ అవతరించింది. దేశ రాజకీయ యవనికపై భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భావం ఒక సంచలనం. దేశ ప్రజల సమస్యలన్నింటినీ పరిష్కరించి, అభివృద్ధి, సంక్షేమం, సమగ్రతలే లక్ష్యంగా బీఆర్ఎస్ పనిచేస్తుందన్న నమ్మకం సంపూర్ణంగా ఉన్నది. రెండు దశాబ్దాల క్రితం స్వరాష్ట్ర సాధన కోసం ఉద్యమ పార్టీగా ఏర్పాటైన టీఆర్ఎస్ ఉద్యమ రాజకీయాల్లోనూ అటుపైన పరిపాలన వ్యవహారాల్లోనూ తనదైన ముద్రవేసింది. కేసీఆర్ వినూత్న ఉద్యమ పంథాతో స్వరాష్ట్ర గమ్యాన్ని ముద్దాడారు. అనంతరం సీఎంగా బాధ్యతలను స్వీకరించి, తన రాజనీతిజ్ఞతతో సంక్షేమం, అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనలో తనదైన శైలిని కనబర్చారు. ఎనిమిదేండ్లలోనే అసాధ్యాలైన కాళేశ్వరం ప్రాజెక్టు, 400లకు పైగా రెసిడెన్షియల్ విద్యా సంస్థలు, పదుల సంఖ్యలో మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ దవ3ఆఖానలు విశ్వవిద్యాలయాలు, ఐటీ రంగ అభివృద్ధి, ఆసరా పెన్షన్లు, రైతుబంధు, రైతుభీమా, దళితబంధు లాంటి ఎన్నో పథకాలను విజయవంతంగా అమలు చేశారు. సీఎం కేసీఆర్ దార్శనికత, ముందు చూపు, నిర్ణయాలు చేయడంలో ఉన్న తెగింపు నేపథ్యంలో నేడు తెలంగాణ దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా అవతరించింది. ముప్పై ఏండ్ల రాజకీయ జీవితంలో అనేక విజయాలను సాధించిన కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరం ఉంది. ఆయన ఆలోచన విధానం దేశ వ్యాప్తంగా అమలు చేయబడితే భారతదేశం రూపురేఖలు, మారిపోతాయి. దేశంలోని సహజ వనరులు సక్రమంగా వినియోగించబడి, దేశంలోని దారిద్య్రం తొలిగిపోతుంది. ప్రపంచ యవనికపై భారతదేశం సంపన్న భారతంగా ఆవిష్కృతం అవుతుంది.
– డాక్టర్ మాకునూరి సంజయ్కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే
ప్రభావితం చేయడం ఖాయం..
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఒక రోల్ మోడల్ అయింది. ఈ ఫలితాలను ప్రత్యక్షంగా చూస్తున్న దేశంలోని అనేక వర్గాల ప్రజలు, దేశాభివృద్ధిని కోరుకుంటున్న నాయకులు, దేశం లౌకికంగా ఉండాలని కోరుకుంటున్న వాళ్లందరూ కేసీఆర్ లాంటి నాయకుడివైపు చూస్తున్నరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన నాయకత్వాన్ని చాలా మంది కోరుకుంటున్నారు. ఇటీవలి కాలంలో స్వయంగా కలిసి మద్దతు తెలిపిన జాతీయ నాయకులను చూస్తూనే ఉన్నాం. కేసీఆర్ ఏది మొదలు పెట్టినా విజయం సాధించే వరకు విరామమెరుగని శ్రామికుడు. రాదు అనుకున్న తెలంగాణను సాధించారు. భారత రాజకీయాలను మార్చడం సాధ్యం కాదనుకుంటున్న ప్రస్తుత తరుణంలో సుసాధ్యం చేయడం ఒక్క కేసీఆర్ వల్లే అవుతుంది. కేసీఆర్ దేశ రాజకీయాలను కచ్చితంగా ప్రభావితం చేయడమే కాదు, తెలంగాణ కీర్తిని ఇనుమడింపజేస్తారనే నమ్మకం నాకున్నది. బీఆర్ఎస్ దేశ రాజకీయాలను సమూలంగా మార్చి వేస్తుంది. కేసీఆర్ ఇప్పుడు వేస్తున్నది తొలి అడుగే కావచ్చు గానీ, అది కోట్లాది అడుగులకు అంకురార్పణ కాబోతున్నది. త్వరలోనే ఢిల్లీ ఎర్రకోటపై కేసీఆర్ నాయకత్వంలో మువ్వన్నెల జెండా ఎగురడం ఖాయంమనే విశ్వాసం బీఆర్ఎస్ శ్రేణుల్లో కనిపిస్తున్నది.
– రసమయి బాలకిషన్, మానకొండూర్ ఎమ్మెల్యే
బీజేపీ ముక్త్ భారత్
ఆస్ట్రియా శాఖ అధ్యక్షుడు వివేక్రెడ్డి
వేములవాడ రూరల్, అక్టోబర్ 6 : బీజేపీ ముక్త్ భారత్ కేసీఆర్తోనే సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జాతీయ పార్టీగా అవతరించిన బీఆర్ఎస్ పార్టీకి తాము ఎప్పటికీ సహకరిస్తామని బీ(టీ)ఆర్ఎస్ ఆస్ట్రియా శాఖ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడిపల్లి వివేక్రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వివేక్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అవిర్భావం కోసం ఏర్పడిన టీఆర్ఎస్ ఇప్పుడు భారతదేశ భవిష్యత్తును మార్చే బీఆర్ఎస్ పార్టీగా మారడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తమ పూర్తి మద్దతుతో పాటు బీఆర్ఎస్ పార్టీ కోసం పూర్తిస్థాయిలో పనిచేస్తామన్నారు. ఎనిమిదేండ్ల పాలనలో తెలంగాణ సాధించిన అభివృద్ధి, పేదలకు అందుతున్న సంక్షేమ ఫలాలపై దేశమంతా చర్చిస్తున్నదన్నారు. మోదీ పాలనలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు కార్పొరేటర్లకు కోట్లు తెచ్చేలా ఉన్నాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీకి ప్రత్యామ్నాయ పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందన్నారు. అయన వెంట ఆస్ట్రియా శాఖ సభ్యులు ఉన్నారు.
దేశానికి రోల్ మాడల్
టీఆర్ఎస్ పార్టీ భారత్ రాష్ట్ర సమితిగా ఆవిర్భవించడడం శుభపరిణామం. బీఆర్ఎస్ దేశ రాజకీయాల్లో చరిత్ర సృష్టిస్తుంది. సీఎం కేసీఆర్ నాయకత్వం, తెలంగాణ సంక్షేమం దేశానికే రోల్ మాడల్ అవుతాయి. తెలంగాణ పాలన దేశవ్యాప్తమవుతుంది. మన పథకాలు అన్ని రాష్ర్టాల్లో అమలవుతాయి. పేద, బడుగు బలహీన వర్గాల్లో కొత్త వెలుగులు నిండుతాయి. ఇప్పటికే రాష్ట్రంలోని అనేక జిల్లాలు, మండలాలు, గ్రామాలు ఎన్నో జాతీయ అవార్డులు పొందాయి. మన పాలనకు ఇవే నిదర్శనం. రేపటి రోజు సీఎం కేసీఆర్ నేతృత్వంలో దేశమంతా ఉత్తమ పాలన అందుతుంది.
– పుట్ట మధూకర్, జడ్పీ చైర్మన్ (పెద్దపల్లి జిల్లా)
అన్ని రంగాలకు మేలు
ఎనిమిదేళ్లలోనే తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింది. దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది. టీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగా అవతరించడం సరికొత్త చరిత్రే. బీఆర్ఎస్తో అన్ని రంగాలకు మేలు జరుగుతుంది. మనలాంటి ఉత్తమ పాలన అందుతుంది. అరిగోస పడుతున్న రైతాంగానికి భరోసా దొరుకుతుంది. నదుల అనుసంధానం ద్వారా సాగునీటి రంగం బలోపేతమవుతుంది. మనలాంటి సంక్షేమ పథకాలతో ఎన్నో వర్గాలకు చేయూత అందుతుంది. దేశంలో మరింత అభివృద్ధి జరుగుతంది. ఇవన్నీ సీఎం కేసీఆర్తోనే సాధ్యమవుతాయి. తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగానైతే కేసీఆర్ చరిత్రను సృష్టించారో, ఇప్పుడు బీఆర్ఎస్తో సైతం అదే చేస్తారు.
– దాసరి మనోహర్రెడ్డి, పెద్దపల్లి ఎమ్మెల్యే
గల్లీ నుంచి ఢిల్లీ దాకా..
గొప్ప విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్. అలాంటి వ్యక్తి పెట్టిన బీఆర్ఎస్ జాతీయ పార్టీ. దేశంలోని ప్రతి గల్లీ నుంచి ఢిల్లీ దాకా పార్టీ నిర్మాణం జరుగుతుంది. తెలంగాణ పల్లెలు ఏ విధంగా ఈ రోజు సుభిక్షంగా ఉన్నాయో, అదే విధంగా దేశంలోని ప్రతి పల్లె బీఆర్ఎస్తో సుభిక్షంగా మారుతుంది. ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దీక్షాదక్షతలు పూర్తిగా ఉపయోగపడుతాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశ ప్రజలంతా ఒక గొప్ప నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో సీఎం కేసీఆర్ సార్ పెట్టిన బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీ గద్దెపై గులాబీ జెండా ఎగురవేసేలా కదన రంగంలోకి దూకుతుంది.
– కోరుకంటి చందర్, రామగుండం ఎమ్మెల్యే
భారత్ను అగ్రస్థానంలో నిలుపడమే లక్ష్యం
ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని నెంబర్ వన్గా నిలుపడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది. స్వరాష్ట్రంలో ఎనిమిదేండ్ల వ్యవధిలోనే దేశంలోనే నంబర్వన్ రాష్ట్రంగా నిలిపిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం ఎవరూ ఊహించని అభివృద్ధి, సంక్షేమం రాష్ట్రంలో అమలవుతూ వస్తున్నాయి. వ్యవసాయ రంగం కొత్త పుంతలు తొక్కింది. విద్య, వైద్యరంగాలు, గ్రామీణ వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శంగా మారిపోయాయి. సంక్షేమం ప్రతి గడపకూ చేరింది. రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, దళితబంధు ఇలా వందలాది పథకాలతో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రజా సంక్షేమాన్ని విస్మరించింది. మతం, ప్రైవేటీకరణ వంటి అంశాలపైనే పని చేస్తున్నది తప్పా, ప్రజల సంక్షేమం, అభివృద్ధి, సమగ్రత కోసం పనిచేయడం లేదు. అనేక వనరులు దేశంలో అందుబాటులో ఉన్నప్పటికీ కేంద్రం నిర్లక్ష్య వైఖరి, తప్పుడు ఆలోచనా విధానాలతో ఇతర దేశాలకు ధీటుగా అభివృద్ధిని సాధించ లేకపోతున్నది. దేశంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో దేశానికి సరైన మార్గదర్శనం చేసి, ముందుకు నడిపించాల్సిన నాయకత్వం అవసరం ఏర్పడింది. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు జాతీయ స్థాయిలో అమలు చేయడంతో పాటు, దేశంలోని వనరులన్నింటినీ సద్వినియోగం చేసి, ప్రపంచంలోనే దేశాన్ని నంబర్వన్గా నిలిపేందుకు సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ను స్థాపించారు. దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా మార్చిన సీఎం కేసీఆర్ దేశానికి నాయకత్వం వహిస్తే, ప్రపంచంలో దేశాన్ని నంబర్వన్గా మార్చుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
– కల్వకుంట్ల విద్యా సాగర్రావు, కోరుట్ల ఎమ్మెల్యే
కేసీఆర్ తీసుకున్నది చారిత్రాత్మక నిర్ణయం
కేసీఆర్ తీసుకున్నది చారిత్రాత్మక నిర్ణయం. దానిమీదే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉన్నది. బడుగు, బలహీన, గిరిజన, దళిత వర్గాల సంక్షేమం, విద్య, వైద్యం, వ్యవసాయ, తదితర అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డులన్నీ తెలంగాణ రాష్ర్టానికే వస్తున్నాయంటే గ్రామాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నయో దేశ ప్రజలు అర్ధం చేసుకుంటున్నరు. తెలంగాణ పల్లెలు బాగు పడుతున్నయి. ఇక్కడ ప్రజల జీవితాలు బాగుపడుతున్నయి. కేసీఆర్ దేశానికి నాయకత్వం వహించి భవిష్యత్తులో ప్రధాని అయితే ఈ పథకాలన్నీ దేశ వ్యాప్తంగా జరుగుతాయనే నమ్మకం ప్రజల్లో కలుగుతోంది. ఇతర రాష్ర్టాల్లోని సెక్రటేరియట్లకు సమానంగా తెలంగాణలోని కలెక్టరేట్లు అభివృద్ధి చెందుతున్న తీరు దేశ ప్రజల దృష్టిని ఆకర్శిస్తోంది. తెలంగాణ వచ్చిన తర్వాత ఎంత గొప్పగా అభివృద్ధి జరిగిందనేందుకు ఇదొక్కటే నిదర్శనం. జిల్లాలు, పల్లెలు, తండాల్లో మార్పు కనిపించే విధంగా అనేక మౌళిక సదుపాయాల కల్పన తెలంగాణలో జరిగింది. ఇంతకు ముందు తెలంగాణలో ఉన్నట్లే ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యలు దేశంలోని అనేక రాష్ర్టాల్లో ఇప్పటికీ జరుగుతున్నయి. ఇలాంటి గుణాత్మకమైన మార్పు దేశ వ్యాప్తంగా జరగాలని ప్రజలు కోరుకుంటున్నరు. మలేషియా లాంటి చిన్న చిన్న దేశాలతోపాటు చైనా లాంటి పెద్ద దేశాలు అభివృద్ధి చెందడానికి, వాళ్ల జీడీపీ పెరగడానికి కారణం ఆయా దేశాల నాయకుల దక్షత, దార్శనితతోనే సాధ్యమైంది. ఈ దేశ భవిష్యత్తును తీర్చి దిద్దేందుకు అలాంటి నాయకుడు కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నరు. అది కేసీఆర్తోనే సాధ్యమని నమ్ముతున్నరు. ఇపుడు కేంద్రంలో ఉన్న బీజేపీ కుల, మతాల పేరిట రాజకీయాలు చేయడం, బడా బాబులకు కొమ్ము కాయడం మినహా పేద, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఒక్క పథకం కూడా తేలేదు. ఇలాంటి రాజకీయ అనిశ్చితి ఉన్న పరిస్థితుల్లో ఈ దేశాన్ని ముందుకు నడిపే నాయకుడు కేసీఆరే అని దేశ ప్రజలు ప్రగాఢంగా విశ్వసిస్తున్నరు..
– సుంకె రవిశంకర్, చొప్పదండి ఎమ్మెల్యే
అభివృద్ధి దేశ వ్యాప్తం అవుతుంది
తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తన నాయకత్వంలో ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్ ఇప్పుడు దేశ ప్రజల కోసం జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి దేశ వ్యాప్తంగా జరగాలని ప్రజలు కోరుకుంటున్నరు. పేదల సంక్షేమం కోసం అమలు చేస్తున్న ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా, 24 గంటల విద్యుత్తును ఇపుడున్న కేంద్ర ప్రభుత్వం ఉచితాలు అంటూ ఎగతాళి చేస్తోంది. పేదల కోసం ఒక్క పథకాన్ని కూడా తేని కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో అమలవుతున్న పథకాలను చూసి కొర్రీలు పెడుతున్నది. అనేక అడ్డంకులు కల్పించే ప్రయత్నం చేస్తోంది. తెలంగాణ లాంటి అభివృద్ధిని దేశ వ్యాప్తంగా సాధించాలనే ఆకాంక్షతోనే ఇవాళ భారత జాతి యావత్తు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నది. దేశంలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మారని ప్రజలు ఇపుడు తెలంగాణను చూసి ఇలాంటి అభివృద్ధి మాకు కావాలని అంటున్నరు. అందుకే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టారు. వెనక్కి తగ్గేదే లేదంటూ ఇప్పటికే అనేక రాష్ర్టాల నాయకులతో చర్చలు జరిపి బీఆర్ఎస్ను త్వరలోనే అధికారంలోకి తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు. ఇది దేశానికి శుభసూచకమని చెప్పవచ్చు..
– వొడితెల సతీశ్కుమార్, హుస్నాబాద్ ఎమ్మెల్యే
సర్వత్రా చర్చ..
టీఆర్ఎస్ పార్టీని జాతీయ స్థాయికి విస్తరిస్తూ భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చిన అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కొద్ది రోజుల ముందు నుంచే ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తి పెరిగింది. బుధవారం ఉదయం నుంచే టీవీలకు అతుక్కుపోయారు. ముఖ్యమంత్రి మీటింగ్ మినట్స్ను ఆసక్తిగా పరిశీలించారు. గురువారం నమస్తే తెలంగాణ దినపత్రిక ప్రత్యేక సంచికను వెలువరించగా, ఉదయం దినపత్రికలో వచ్చిన కథనాలను ఆసక్తిగా చదవారు. బీఆర్ఎస్ పార్టీ ఆవశ్యకతను సవివరంగా ముద్రించడంతో క్షుణ్ణంగా చదివారు. హోటళ్లు, షాపులు, జనసమ్మర్థ ప్రాంతాల్లో ఏ నలుగురు కలిసినా దీనిపైనే చర్చించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ సరైన అడుగు వేశారని, కచ్చితంగా విజయం సాధిస్తారనే అభిప్రాయలు వ్యక్తం చేశారు.