Telangana | ఇరుకైన రహదారులు.. అడుగడుగునా గుంతలు.. వానొస్తే బురదబురద.. ఎండొస్తే దుమ్ముదుమ్ము.. బండెక్కితే ఉయ్యాల జంపాల.. కిలోమీటర్ దూరానికి పది నిమిషాలకుపైగా సమయం.. గంటలకు 20 నుంచి 30 కిలోమీటర్లు దాటని వేగం.. దారిపొడవునా కుదుపులతో ఒళ్లంతా హూనం.. అదృష్టం బాగుంటే ఇంటికి.. లేదంటే కాలో చెయ్యో విరగ్గొట్ట్టుకొని దవాఖానకు.. ఇది నాటి సమైక్య రాష్ట్రంలో దుస్థితి.
విశాలమైన రోడ్లు.. ట్రాఫిక్ సమస్య లేకుండా సాఫీగా రాకపోకలు.. కిలోమీటర్ల దూరం కూడా నిమిషాల్లోనే వెళ్లే సౌకర్యం.. గంటకు 60 నుంచి 80 కిలోమీటర్ల వాహనాల వేగం.. ఏ పల్లె నుంచి అయినా జిల్లాకేంద్రాలకు అంతరాయం, అలసట లేకుండా ప్రయాణం.. వానొచ్చినా.. వరదొచ్చినా ఆటంకం లేకుండా సురక్షితంగా గమ్యస్థానాలకు చేరిక.. ఇది నేటి స్వరాష్ట్రంలో ప్రగతి.
నాటి సమైక్య రాష్ట్రంలో గతుకుల రోడ్లపై నరకం చూసిన ఉమ్మడి జిల్లా ప్రజానీకం నేడు స్వరాష్ట్రంలో తళతళా మెరిసే రోడ్లపై దూసుకెళ్తున్నది. పల్లె నుంచి పట్నం దాకా రోడ్లన్నీ అద్దాల్లా మారడంతో సులువుగా.. సాఫీగా రాకపోకలు సాగిస్తున్నది. ప్రధాన రోడ్ల విస్తీర్ణం పెంచి అద్భుతంగా తీర్చిదిద్దగా.. మండలకేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు గతంలో ఉన్న సింగిల్ రోడ్లన్నీ డబుల్రోడ్డుగా మారాయి. నాడు రోడ్ల బాగు కోసం ఏడాదిలో ఏనాడూ యాభై కోట్ల నిధులు రాకపోగా.. ఇప్పుడు ఏటా దాదాపు 650 నుంచి 700 కోట్లు వస్తున్నాయి. దీంతో రోడ్లన్నీ సరికొత్తగా మారి, రవాణా సౌకర్యం పెరిగింది. నాడు గంటకు 20 నుంచి 30 కిలోమీటర్లు దాటని వాహనాల వేగం, ఇప్పుడు 60 నుంచి 80కి పుంజుకున్నది. స్పీడ్ లిమిట్ 80కే పరిమితమైనా.. మాటిమాటికీ బ్రేకులు వేయకుండా, గేర్లు మార్చాల్సిన అవసరం లేకుండా వెళ్తుండడంతో సమయంతోపాటు ఇం‘ధనం’ ఆదా అవుతున్నది. పైగా ప్రయాణం అలసట తెలియకుండా సాగుతున్నది. మరోవైపు గోదావరితోపాటు వాగులపై నిర్మించిన వంతెనలతో వివిధ రాష్ర్టాలకు సంబంధాలు మెరుగుపడి, వ్యాపార లావాదేవీల పురోగతికి మార్గం సుగమమైంది.
సమైక్య పాలనలో రహదారుల పరిస్థితి దారుణంగా ఉండేది. కొత్త రోడ్ల సంగతి పక్కన పెడితే, కనీసం ఉన్న రోడ్లకు మరమ్మతులు కరువయ్యేవి. ఉమ్మడి జిల్లాలో అన్నీ రహదారులు కలిపి 3వేల కిలోమీటర్లపై చిలుకు ఉంటే.. అందులో 75 శాతం రోడ్లు ఆనాడు అధ్వానంగా ఉండేవి. ఎటు వెళ్దామన్నా గతుకుల రోడ్లే. అడుగడుగునా వాహనాలకు బ్రేకులు వేయాల్సి వచ్చేది. లేదా గేర్లు మార్చేది. 20 నుంచి 30 మధ్యే స్పీడ్ మెయింటెన్ చేయాల్సి రావడంతో అనుకున్న సమయానికి ఏ రూటులోనూ చేరే పరిస్థితి ఉండేది కాదు. ఇటు వంతెనలు లేక ఆవలి గట్టుపై ఉన్న గ్రామాలకు కిలోమీటర్ల కొద్దీ తిరిగి వెళ్లాల్సిన దయనీయ పరిస్థితులు ఉండేవి. అయినా ఆనాడు ఎవరూ పట్టించుకోలేదు. కానీ, స్వరాష్ట్రంలో పరిస్థితి మారింది. మెరుగైన రవాణాతోనే అభివృద్ధి సాధ్యమని భావిస్తున్న రాష్ట్ర సర్కారు, కోట్లాది రూపాయలతో రోడ్లను అభివృద్ధి చేయడం, వంతెనలను నిర్మించడంతో ప్రయాణం సాఫీగా సాగుతున్నది.
– కరీంనగర్, మే 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఉమ్మడి జిల్లాను ఆనుకొని గోదావరి పారుతున్నది. ఆ నదిపై వంతెనలు నిర్మిస్తే వివిధ రాష్ర్టాలతోపాటు ఇతర జిల్లాలకు అనుసంధానం ఏర్పడుతుందని నాటి ప్రభుత్వాలకు విన్నవించినా పట్టించుకోలేదు. కానీ, సీఎం కేసీఆర్ గోదావరిపై వంతెనలను నిర్మించి, వివిధ రాష్ర్టాలతో రవాణా సంబంధాలు మెరుగుపరిచారు. జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల పరిధిలోని గో దావరిపై మొత్తం 9చోట్ల బ్రిడ్జిలు నిర్మించారు. ఇవేకాకుండా,అంతర్గతంగా జిల్లాలోని మానేరు, మూలవాగుపైనా బ్రిడ్జిల నిర్మాణం చేశారు. కరీంనగర్-సిరిసిల్ల మధ్య ఉన్న మూలవాగుపై హైలెవల్ వంతె న, కరీంనగర్-సదాశివపల్లె రోడ్డుకు సంబంధించి మానేరుపై సస్పెన్షన్ బ్రిడ్జి, సుల్తానాబాద్-నీరుకుల్ల-వేగురపల్లి-కరీంనగర్ బ్రిడ్జిలు, రాయప ట్నం బ్రిడ్జి వంటి ఎన్నింటినో పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చా రు. అలాగే కరీంనగర్ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని సీఎం ఇచ్చిన హామీ మేరకు భారీగా నిధులు మంజూరు చేసి పనులు పూర్తయ్యేలా చేశారు. కాగా జిల్లాలోని పలు జాతీయ రహదారులకు గ్రీన్సిగ్నల్ ఇచ్చిన కేంద్రం వాటి ఆచరణలో పెట్టే విషయంలో మాత్రం నిర్లక్ష్యం చూపుతున్నది.
తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ రహదారులపై అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. మెరుగైన రవాణాతోనే అభివృద్ధి సాధ్యమని భావించి అధిక ప్రాధాన్యమిచ్చారు. 2014లో అధికారంలోకి వచ్చిన మొదటి రెండేళ్లలోనే ఉమ్మడి జిల్లాలో 3,500 కోట్లతో పనులు చేపట్టారు. అందులో 2500 కోట్లు రోడ్డు భవనాల శాఖ ద్వారా, మరో వెయ్యి కోట్లను పంచాయతీరాజ్శాఖ ద్వారా వెచ్చించి రోడ్లు బాగు చేశారు. గడిచిన పదేళ్లలో చూస్తే 6,500 కోట్లతో రోడ్ల పనులు జరిగాయి. మరో వెయ్యి కోట్ల విలువైన పనులు మంజూరయ్యాయి. వీటిని సైతం పూర్తి చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటున్నది. నిజానికి సమైక్య రాష్ట్రం లో ఒక యేడాదిలో ఏనాడు 50కోట్లకు మించి నిధులు వచ్చిన దాఖలాలు లేవు. కానీ, స్వరాష్ట్రంలో సుమారుగా ఏటా 650 నుంచి 700 కోట్ల వరకు రోడ్ల అభివృద్ధి కోసం ప్రభుత్వం వెచ్చింది. ఫలితంగా పల్లె నుంచి పట్నం వరకు రోడ్లు అద్దంలా మారాయి.
నాడు గతుకుల రోడ్ల వల్ల బైక్లే కాదు మిగిలిన వాహనాలు కూడా పెద్దగా స్పీడ్తో వెళ్లేవి కావు. మాటిమాటికీ బ్రేకులు వేయడం, గేర్లు మార్చడం వల్ల ప్రయాణం ఒక నరకంలా ఉండేది. ఏ రూటులోనూ నిర్ణీత సమయానికి చేరుకునే పరిస్థితి ఉండేది కాదు. మెజార్టీ రూట్లలో గంటకు 20 నుంచి 30 కిలోమీటర్ల స్పీడ్తో మాత్రమే వెళ్లాల్సి వచ్చేది. కొన్ని రూట్లలో అయితే 20 స్పీడ్ దాటితే నరకమే కనిపించేది. కానీ, ఇప్పుడు రోడ్లన్నీ అద్దల్లా మారడంతో వాహనాల స్పీడ్ పెరిగింది. జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రాలకు సింగిల్ రోడ్లు, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్లు నిర్మించడంతో ఏ మారుమూల ప్రాంతం నుంచి అయినా జిల్లాకేంద్రాలకు 60 నుంచి 80 స్పీడ్తో వాహనాలు వెళ్తున్నాయి. ఇంతకుముందు కరీంనగర్ నుంచి హుజూరాబాద్కు వెళ్లాలంటే గంటా 10 నిమిషాలు పడితే, ఇప్పుడు 50 నిమిషాలే పడుతున్నది. జమ్మికుంటకు గంటే పడుతున్నది. గతంలో హుస్నాబాద్కు చేరుకోవాలంటే గంటన్నర పడితే, ఇప్పుడు గంటలోపే పడుతున్నది. ఇటు సామాన్యుల వాహనమైన ఆర్టీసీ బస్సుల వేగం కూడా ఇప్పుడు కనీసం 60 కిలో మీటర్లకు చేరింది. కార్లలో ప్రయాణించే వాళ్లు స్పీడ్ లిమిట్ను అనుసరించి వెళ్లినా 80కి తక్కువ కాకుండా వాహనాల వేగం పెరిగింది. మొత్తంగా రోడ్లు విశాలంగా మారడం, మాటిమాటికీ గేర్లు మార్చకపోవడం, ఇదే సమయంలో స్పీడ్ పెరగడం వల్ల ఇంధనమేకాదు సమయం కలసి వస్తున్నది. అలాగే వాహనాలు ఎక్కువ కాలం సర్వీస్ ఇస్తున్నాయి.
నా పేరు చెల్కల నరేందర్. మాది ముత్తారం మండలం పోతారం. ఒకప్పుడు మా చుట్టు పక్కల గ్రామాలకు వెళ్లాలంటే దుఃఖమస్తుండే. ఏ ఊరు రోడ్డు సరిగ్గా ఉండేదికాదు. ఎక్కడ చూసినా గుంతలే ఉంటుండె. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్లే వాళ్లం. నేను ఓరోజు మోటర్ సైకిల్ మీద ముత్తారం నుంచి బేగంపేటకు పోతున్నా. రోడ్డుమీద గొయ్యి కనిపించలే. బండి సక్కగ అండ్లకే పోయింది. బండి మొత్తం నా మీద పడ్డది. కాలు విరిగింది. నా జీవితంల అది మర్చిపోలే. ఆ కాలు విరుగుడుతో నేను జీవితంలో ఎంతో వెనుకబడ్డా. నేనే కాదు ఎంతో మంది గుంతల రోడ్లతో బాధలు పడ్డరు. రోడ్లు బాగా చేయమని అడిగితే ఏ ఒక్కలూపట్టించుకోలె. కానీ బీఆర్ఎస్ సర్కార్ అచ్చినంకనే మా పోతారం రోడ్డు బాగైంది. డబుల్ రోైడ్డెంది. బేగంపేటకు వెళ్లాలన్నా, గోదావరిఖని, మంథనికి పోవాలంటే ఇట్ల షిడుగ్గున పోతన్నం. ఎలాంటి ప్రమాదాలు లేకుండా హాయిగా ప్రయాణిస్తున్నాం. ఇది ఒక్క నరేందర్ చెప్పే మాటే కాదు పెద్దపల్లి జిల్లా ప్రజలు చెబుతున్న మాట.
-చెల్కల నరేందర్. పోతారం (ముత్తారం మండలం)
కరీంనగర్ నుంచి గంటలోపే హుజూరాబాద్ల ఉంటు న్నం. అక్కడినుంచి పదిహేను నిమిషాల్లో జమ్మికుంటకు చేరకుంటున్నం. రోడ్లు బాగైన తర్వాత వేగం పెరిగింది. ఇప్పుడు స్టేజీలు పెరిగినా గంటలోపే హుజూరాబాద్కు చేరుకుంటున్నం. గతంలో గుంతలు ఉన్నకాడల్లా స్లో చేసుకుని గేర్లు మార్చుకోవల్సి వచ్చేది. మళ్లా వేగం పుంజుకోవాల్నంటే టైం పట్టేది. ఇపుడు ఎక్కడా గుంతలు లేవు.
– టీ శ్రీనివాస్, ఆర్టీసీ డ్రైవర్ (హుజూరాబాద్ డిపో)
గతంలో హైదరాబాద్ వెళ్లాలంటే మూడున్నర గంటలు పట్టేది. ఇప్పుడు మామూలు ఎక్స్ప్రెస్ కూడా మూడు గంటల్లో చేరుకుంటున్నది. రాజధాని, గరుడ, వంటి బస్సులైతే రెండున్నర గంటల్లో వెళ్తున్నయ్. మా మంథని నుంచి కరీంనగర్ రావాలంటే గతంలో 4 గంటలు పట్టేది. ఇప్పుడు మూడు గంటలే పడుతున్నది. రోడ్లు అభివృద్ధి చెందిన తర్వాత ఆర్టీసీ బస్సుల వేగం కూడా పెరిగింది.
– కే సమ్మయ్య, ఆర్టీసీ డ్రైవర్ (మంథని డిపో)
మాది వీర్నపల్లి మండలం లాల్సింగ్ తాండా. మా ఊరి నుంచి ఎల్లారెడ్డిపేట మండలానికి పోవాలంటే 16కిలోమీటర్ల దూరం. తొమ్మిది, పదేండ్ల కింద రోడ్డేలేదు, బస్సులు అసలే లేవు. ప్రైవేట్ జీపులు రెండు మూడు నడుత్తుండే. గతుకుల రోడ్డుమీద పోవాలంటే చానా తిప్పలైతుండె. 16కిలోమీటర్ల దూరానికి గంటన్నర పట్టేది. ఇగ వానకాలంలో రోడ్డంతా బురదతో నిండిపోయేది. జీపులు దిగబడితే అందరం కలిసి తోసేటోళ్లం. రోగమచ్చినా, నొప్పిచ్చినా ఎల్లారెడ్డిపేటకే పోవాలే. రోడ్లు సక్కగా లేక ఎడ్ల బండ్లు కట్టుకుని పోయేటోళ్లం. ఆ రోజులు యాజ్జేసుకుంటే నరకమే. తెలంగాణ వచ్చినంక అన్ని ఊళ్లకు సర్కారు రోడ్లేసింది. మరిమడ్లకు పోవాలంటే గర్జనపల్లి వాగు దాటనియ్యకుండే. నడుంలోతు నీళ్లలో పాణం చేతిలో పట్టుకుని పోతుంటిమి. అసోంటి వాగుపై మంత్రి కేటీఆర్ సార్ బ్రిడ్జి కట్టించిండు. మరిమడ్ల నుంచి వీర్నపల్లి మీదుగా ఎల్లారెడ్డిపేట మండలానికి డబుల్రోడ్డు వేయించిండు. పావుగంటలనే ఇళ్లు జేరుతున్నం. నాడు కార్లు సూడని మా ఊరికి ఇయ్యాల రకరకాల కార్లత్తున్నయ్. అయిదారు బస్సులు కూడా వస్తున్నయ్. పోయేందుకు వచ్చేందుకు తిప్పలు తీరినయ్. సిరిసిల్ల, కామారెడ్డి, హైదరాబాద్కు ఒక్కరోజులో పోయచ్చి పనులు చేసుకుంటున్నం.
– మాలోత్ రాంరెడ్డి నాయక్ లాల్సింగ్ తండా (వీర్నపల్లి మండలం)
గతంలో సిరిసిల్ల- కరీంనగర్ రోడ్డు మొత్తం గుంతలే ఉండేవి. బస్సును నడిపితే నరకం కనిపించేది. ఇపుడు రోడ్లు మంచిగ అయినంక స్పీడ్ పెరిగింది. కరీంనగర్ దాటుడే ఆలస్యం సిరిసిల్ల డైరెక్ట్ బస్సుల డ్రైవర్లు 60-70 కొడుతున్నరు. గంట సేపట్ల సిరిసిల్లలో ఉంటున్నం. నేను అంతకు ముందు గోదావరిఖని బస్సు నడిపెటోన్ని. కరీంనగర్ నుంచి గోదావరిఖని వెళ్లాలంటే కనీసం మూడు గంటలు పట్టేది. ఇపుడు రెండున్నర గంటల్లో చేరుకుంటున్నం.
– జే నాగరాజు, ఆర్టీసీ డ్రైవర్ (కరీంనగర్-2 డిపో)