ఇల్లంతకుంట/ గంగాధర, మార్చి 26 : కాళేశ్వరం ప్రాజెక్టును తప్పు పట్టేందుకు కాంగ్రెస్ సర్కారు సృష్టించిన కరువులో రైతులు బలవుతున్నారని కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ధ్వజమెత్తారు. మంగళవారం ఇల్లంతకుంట మండలంలోని రహీంఖాన్పేటలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్, గంగాధర మండలం ఆచంపల్లి వద్ద ఎండిపోయిన వరదకాలువను మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, బీఆర్ఎస్ చొప్పదండి ఇన్చార్జి పన్యాల భూపతిరెడ్డితో కలిసి పరిశీలించారు.
ఇల్లంతకుంట మండలంలో పలు గ్రామాల్లో బైక్పై వెళ్లి పంటలను పరిశీలిస్తూ రైతుల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి రాష్ట్రంలో సాగు, తాగు నీటి కొరత లేకుండా చేసిందని గుర్తు చేశారు. ఓర్వలేక కుట్ర పన్నిన కాంగ్రెస్ సర్కారు మేడిగడ్డ ప్రాజెక్టు లీకేజీ పేరుతో గోదావరి నీటిని సముద్రం పాలు చేసిందని మండిపడ్డారు. ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని ఖమ్మం వరకు తీసుకెళ్లి ఇల్లంతకుంట మండలాన్ని ఎడారిగా మార్చిందని ఆగ్రహించారు. కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాతనే రైతులు యాసంగి పంటలు వేశారని, వారికి చుక్క నీరు ఇవ్వకుండా, ప్రాజెక్టుల్లో నీరు లేకుండా చేసి పంటలు ఎండేందుకు కారణమైందని ధ్వజమెత్తారు.
రాష్ట్రం రాక ముందు కాంగ్రెస్ పాలనలో ఎంత ఇబ్బంది పడ్డారో మళ్లీ ఇప్పుడు అలాగే ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వడగండ్ల వానకే నష్టం కాదని, పంటకు నీరు అందించలేక పోయినా నష్టమేనని, నష్ట పోయిన, ఎండిన ప్రతి ఎకరాకు రూ.15 వేల పరిహారం చెల్లించాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజులకే రాష్ట్రంలో 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం బాధకరమని ఆవేదన చెందారు. బీఆర్ఎస్ హయాంలో రైతులు పచ్చని పంట పొలాలు వేసుకుని సుఖఃసంతోషాలతో ఉండడం చూడ లేకనే మార్పు పేరుతో వారిని కాంగ్రెస్ సర్కారు నట్టేట ముంచిందన్నారు.
వరదకాలువకు వెంటనే నీటిని విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలని వినోద్కుమార్ డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలనలో వరదకాలువ ఎట్లుండేదని, ఇప్పుడెట్లున్నదని రైతులను అడుగగా, కేసీఆర్ సర్కారులో ఏడాది పొడవునా నీళ్లు ఉండేవని, రంది లేకుంట పంటలు పండించుకునేటోళ్లమని, ఇప్పుడు నీళ్లు లేక తిప్పలు పడుతున్నట్లు వారు వివరించారు.
ఒకప్పుడు 365 రోజులు వరదకాలువ జీవనదిలా పారిందని, కాంగ్రెస్ సర్కారు వచ్చాక చుక్కనీరు లేక ఎడారిగా మారిందని వినోద్కుమార్ తెలిపారు. ఆయాచోట్ల జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, సిరిసిల్ల జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, సెస్ డైరెక్టర్ రవీందర్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పల్లె నర్సింహారెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ వేణురావు, ఎంపీటీసీ గొట్టెపర్తి పరశురాం, మాజీ సర్పంచ్ బిళ్ళవేణి పరశురాం, నాయకులు గుండ ముత్తయ్య, కేవీఎన్ రెడ్డి, గాదె కనుకయ్య, జక్కుల నాగరాజు ఉన్నారు.