వెల్గటూర్, జూలై 12: విద్యార్థులు ప్రభు త్వం, ఎల్ఎం కొప్పుల సర్వీసెస్ కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనారిటీ, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. భవిష్యత్లో ఉన్నతస్థాయికి ఎదిగి తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఎల్ఎం కొప్పుల సోషల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో బుధవారం ధర్మపురి నియోజకవర్గంలోని ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు మోటివేషన్ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు కష్టపడి చదివి లక్ష్యాన్ని అధిగమించాలని ఉద్బోధించారు. మేధా ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకుడు డాక్టర్ చిరంజీవి మాట్లాడుతూ, విద్యార్థి దశలో లెర్నింగ్ చేస్తే ఎవరూ ఆపలేరన్నారు. విద్యార్థులు చరిత్ర చదివేవారుగా కాకుండా చరిత్ర సృష్టించాలన్నారు.
ఎస్పీ ఎగ్గడి భాస్కర్ మాట్లాడుతూ, విద్యార్థులు లక్ష్యాన్ని చేరుకునేందుకు పేదరికం అడ్డుకాదని చెప్పారు. క్రమశిక్షణతో ఉంటూ కష్టపడి చదివితే విజయం వరిస్తుందని పేర్కొన్నారు. ఇప్పుడు మీకు తల్లిదండ్రులు కేరాఫ్ అడ్రసైతే.. భవిష్యత్లో మీరు మీ తల్లిదండ్రులకు కేరాఫ్ అడ్రస్ కావాలని పిలుపునిచ్చారు. ఎల్ఎం ట్రస్ట్ చైర్పర్సన్ కొప్పుల స్నేహలత మాట్లాడుతూ, ధర్మపురి నియోజకవర్గంలోని పిల్లలందరూ తన పిల్లలాంటి వారని పేర్కొన్నారు. వారి అభ్యున్నతి కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. విద్యార్థులను మంచిని స్వీకరించి చెడును వదిలివేయాలని సూచించారు. సెల్ఫోన్లకు దూరంగా ఉంటూ లక్ష్యం దిశగా సాగాలని పిలుపునిచ్చారు. కాగా, మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎల్ఎం కొప్పుల సోషల్ ఆర్గనైజేషన్ చైర్పర్సన్ కొప్పుల స్నేహలత కార్యక్రమానికి హాజరైన అతిథులను సన్మానించారు. అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లను భద్రపరుచుకునేందుకు ఫైళ్లను అందజేశారు. కార్యక్రమంలో మాజీ వైస్ చాన్స్లర్ ముత్యాల నాయుడు, శరత్ అద్దంకి, ఎల్ఎం కొప్పుల సోషల్ ఆర్గనైజేషన్ సభ్యులు, యువకులు పాల్గొన్నారు.
ధనం కాదు, చదువే శాశ్వతం
సమాజంలో ఇప్పటి వరకు మనకు మూడు కోతుల కథ గురించి విన్నాం. ఇప్పుడు నాలుగో కోతి అయిన సెల్ఫోన్ మనలను పట్టి పీడిస్తున్నది. సెల్ఫోన్ను దూరం పెట్టినప్పుడే మన బతుకులు బాగుపడతాయి. మనకు ధనం శాశ్వతం కాదు, చదువే శాశ్వతం. గమ్యం స్థిరంగా ఉంటే లక్ష్యం చేరువవుతుంది. పాత బట్టలు, నిరుపేద స్నేహితులు, ముదుసలి వాళ్లు దేవుడి ఇచ్చిన వరం. వారి ద్వారా మనం అనేక విషయాలను తెలుసుకుంటాం.
– నైనా జైస్వాల్, విద్యావేత్త, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి